మహా నాయకుడు స్వప్నాన్ని దర్శిస్తాడు. ఆ స్వప్న సాకారానికి ఉద్యమిస్తూనే ఉంటాడు. ఆ స్వప్నాలు ఎప్పటికీ అంతం కావు. ఒక స్వప్నం సాకారమవుతూనే మరో స్వప్నానికి పురుడు పోస్తుంది. స్వప్నాల బిడారు సాగుతూనే ఉంటుంది. సజీవ హృదయం స్వప్నించడం ఆగదు, స్వాప్నికుడు కార్యసాధనకు ఉద్యమించకా మానడు. తెలంగాణ సాధన కోట్లాది హృదయాల చిరకాల స్వప్నం. ఆ స్వప్న సాధనకు ప్రియతమ నేత కేసీఆర్ ప్రాణాన్ని పణంగా పెట్టి దీక్షకు ఉపక్రమించి నేటికి పదమూడేండ్లు. ఆ దీక్ష ఫలించింది, విశ్వవ్యాప్తంగా కోట్లాది తెలంగాణ జనుల హృదయం ఉప్పొంగింది. ఇది మామూలు దీక్ష కాదు, పీతిరి గద్దను ఎదిరించి గెలిచిన పిచ్చుక సాహసమిది!
తెలంగాణ స్వప్నం సాకారమైంది… మరో స్వప్నానికి జన్మనిచ్చింది. అది తెలంగాణ వికాస స్వప్నం. ఆ నాయకుడి నయనాలలో ఒక స్వప్నం దాగి లేదు. కోట్లాది మంది స్వప్నాలు దాగి ఉన్నాయి. ముద్దుల పట్టికి పెళ్ళి చేయాలన్న పేద హృదయానిదొక స్వప్నం. సుఖ ప్రసవం జరిగి పండంటి బిడ్డను ఎత్తుకోవాలన్న నిండు చూలాలు స్వప్నం. రెక్కాడితేగాని డొక్కాడని జీవితపు చరమాంకంలో ఆసరా కావాలన్న స్వప్నం. కష్టానికి ప్రతిఫలం దక్కాలన్న రైతన్నలదొక స్వప్నం. ఆ కలల సాధన కోసం నాయకుడు పడే తపన – ఒక వైవిధ్య భరితమైన దీక్ష. పరాయి శక్తుల అడ్డంకుల మధ్య సాగే అహర్నిశల మేధోమథన దీక్ష. ఆ దీక్ష నుంచే పుట్టుకొచ్చినయి అనేకానేక పథకాలు- కల్యాణలక్ష్మి- కేసీఆర్ కిట్లు, ఆసరా పింఛనులు, రైతన్నకు ధీమాలు- బీమాలు, గురుకులాలు, సన్నబియ్యం భోజనాలు. కోట్లాది జనుల స్వప్నాలు సాకారమై- సంక్షేమ పథకాలై, అభివృద్ధి కార్యక్రమాలై రూపుదిద్దుకున్న క్రమమే ‘తెలంగాణ నమూనా’గా తెర పైకి వచ్చింది.
రాష్ట్ర స్వప్నం సాకారమై భరత జాతి స్వప్నానికి బాట వేసింది. తెలంగాణ బిడ్డల చిగుళ్ళు తొడిగిన బతుకు రాగం దేశమంతా పల్లవించే సరికొత్త స్వప్నమిది. దీనిలో పంజాబ్ రైతుల పగిలిన గుండెల ఆవేదన దాగి ఉన్నది. రాష్ర్టాల వారిగా ప్రభుత్వాలను కూలదోస్తుంటే, స్వపరిపాలన కోసం అలమటిస్తున్న భూమి పుత్రుల ఆక్రందన ఉన్నది. ఆరేడు దశాబ్దాలుగా దారి చూపుతున్న ప్రజాస్వామిక ప్రమిదను సుడిగాలి నుంచి కాపాడుకోవాలనే తపన ఉన్నది. ఉప్పొంగే జీవనదుల జలాలు ఉప్పు సముద్రం పాలు కాకూడదనే ఆకాంక్ష దాగి ఉన్నది. విశ్వవ్యాప్తంగా జాతి ఔన్నత్యం జాజ్వలమానంగా వెలుగులీనాలన్న స్వప్నమిది. ఆ సువర్ణ స్వప్నం మహా నాయకుడు కేసీఆర్ను మళ్ళా దీక్షాబద్ధుడిని చేసింది. ఇది ఆనాటి నిరాహార దీక్ష కాదు. నవ భారతం వైపు నడక సాగించే ఎన్నికల దీక్ష. ఈ దీక్షా మూర్తి అడుగుజాడల్లో నడుద్దాం, అండగా నిలుద్దాం. నూటా నలభై కోట్ల మంది భారతీయుల సమిష్టి స్వప్నాన్ని పంచుకుందాం. కలసి కలలు కందాం, దీక్షాబద్ధులమై కదులుదాం.