కేసీఆర్ను గెలిపించాలి! కేసీఆర్ను ఓడించాలి! ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ప్రధానంగా మారిన అంశం ఇదే. కేసీఆర్ను గెలిపించాలనే వారికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. కానీ కేసీఆర్ను ఓడించాలనే వారి దగ్గర ఉన్న కారణాలు ఒక్కటి కూడా కనిపించడం లేదు. పదేండ్లయింది కాబట్టి ప్రభుత్వాన్ని మార్చాలని కొందరు, కుటుంబ పాలన అని ఇంకొందరు.. ఇంతకు మించి ఒక్కటంటే ఒక్కటి ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నదనడానికి స్పష్టమైన కారణం చెప్పేవారే లేరు.
దీనికి తోడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆ పార్టీకి పెద్ద భారంగా మారుతున్నారన్న అభిప్రాయాలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే అయితే తెలంగాణ అవసరమే లేదని, అవన్నీ సీమాంధ్ర పాలకులు దండిగా ఇచ్చారని మాట్లాడటం ద్వారా రేవంత్.. తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా అవమానించారు. పాజిటివ్ అయినా.. నెగెటివ్ అయినా.. చర్చంతా తన చుట్టూనే తిరుగాలని అనుకుంటున్నానని టీవీల ఇంటర్వ్యూలోనే చెప్పిన నేత.
వంశపారంపర్యంగా రాచరిక పాలన చేస్తున్న పార్టీల నేతలు కుటుంబ పాలన గురించి మాట్లాడతారు. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. రాదు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారందరూ కూడా స్వయం ప్రకాశకులే. చెట్టు నీడ నుంచి బయటపడి వేళ్లూనుకొని ఎదిగినవారు. ఇక్కడ కుటుంబ పాలన అన్న మాటకు అర్థమే లేదు. మరి ప్రభుత్వ వ్యతిరేకత అంటే, అది కూడా కృతకమైన మాటే తప్ప ప్రజల్లో వ్యతిరేకతే లేదు. మీడియాలో, సోషల్ మీడియాలో మూడ్ క్రియేట్ చేయడానికి సృష్టించింది తప్ప మరేమీ కాదు. మన ఇండ్లల్లో ఫ్రిజ్ వాడుకుంటాం.. అది బాగానే ఉంటుంది.. పదేండ్లయింది కాబట్టి ఏదో కొత్త మాడల్ వచ్చిందని మార్చేస్తాం. కానీ, ప్రభుత్వాన్ని అలా మార్చలేం కదా ?
తెలంగాణలో కేసీఆర్ను మించిన ప్రత్యామ్నాయం ఏదైనా ఉన్నదా? అంటే ఇప్పటి వరకు లేదనే చెప్పాలి. తెలంగాణలోనే కాదు.. మొత్తం దేశంలోనే లేదు. కేసీఆర్కు దీటైన దార్శనికత ఉన్న దక్షత కలిగిన నాయకుడు ఉన్నాడా అంటే అదీ లేదు. ఎందుకంటే కేసీఆర్ విజన్ సామాన్యమైంది కాదు. సాధారణ రాజకీయ నాయకులకు.. కేసీఆర్కు హస్తిమశకాంతరం ఉంటుంది. దీన్ని ఎవరూ కాదనలేరు. ఉద్యమకాలం నుంచి కూడా నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా నిలబడి నిగ్గదీసే స్వభావం ఆయనది. ఆయనది పరిణతి కలిగిన వ్యవహారశైలి, నిర్మాణాత్మకమైన ఆలోచనావిధానం రాజకీయాలను వ్యక్తిగత సంబంధాలను పాలునీళ్లలాగా వేరుచేసి చూడగల నేర్పు కేసీఆర్కు మాత్రమే చెల్లింది. రాజీపడని అడుగులు వేయడం సమకాలీన రాజకీయాల్లో ఆయనకు మాత్రమే సాధ్యమైంది. ఆయన ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకోగలరంటే.. ఆ వేగాన్ని అందుకోవడం ఎవరివల్లా కానిపని. ఆయన తీసుకొనే ఏ నిర్ణయం కూడా ఇది సాధ్యమేనా అని అనిపిస్తుంది. సాధ్యం కాదనే కచ్చితంగా తోస్తుంది. కానీ.. ఒక్కొక్క స్థాయిలో దాని సక్సెస్ రేటు పెరుగుతూ పోతుంటే.. ఆశ్చర్యమేస్తుంది. అద్భుతమనిపిస్తుంది. చివరకు దాన్ని కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఏర్పడుతుంది.
ఇందుకు ఉదాహరణలు.. ఢిల్లీ నుంచి అనేక రాష్ర్టాల దాకా పేర్లు మార్చుకొని.. తమ ఫొటోలు తగిలించుకొని, తమ ఖాతాలో వేసుకొని అమలు చేస్తున్న అనేక పథకాలను చూపించవచ్చు. ప్రతి నిర్ణయం వెనుక ఆయన దూరదృష్టి ప్రస్ఫుటమవుతుంది. తీసుకొన్న నిర్ణయాన్ని వెనుకడుగు వేయకుండా అమలుచేయగల నాయకుడు కేసీఆర్. అడిగినవారికి అడిగినది లేదనకుండా ఇవ్వగలిగిన ఔదార్యమాయనది.
విద్యుత్తు వ్యవస్థలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంస్కరణలైతే ఎవరూ ఊహించలేదు. తెలంగాణరాష్ట్రం వస్తే ముందుగా వచ్చే సంక్షోభం విద్యుత్తే అన్నారు. కానీ.. స్వరాష్ట్రంలో తొట్టతొలి సంస్కరణ జరిగింది విద్యుత్తురంగంలోనే. ప్రభుత్వ విద్యుత్తు రంగ సంస్థలను బలోపేతం చేస్తూనే.. వివిధ మార్గాల నుంచి రాష్ర్టానికి విద్యుత్తును తీసుకువచ్చేందుకు ఆయన రచించిన వ్యూహం ఎవరికీ అంతుపట్టలేదు. ఇప్పటికి తొమ్మిదేండ్లు గడిచిపోయింది. మిగతా పథకాలను ఏదో రకంగా అమలు చేసిన రాష్ర్టాలు కానీ, కేంద్రం కానీ.. విద్యుత్తు సంస్కరణల విషయంలో తెలంగాణను అనుసరించడం ఇప్పటికీ సాధ్యపడనే లేదు.
రాష్ర్టాన్ని అన్ని పార్శ్వాలలో అభివృద్ధి చేయడంపైన దృష్టిసారించిన నాయకుడు కేసీఆర్. ఓ వైపు సంపదను సృష్టిస్తూనే.. దాన్ని ప్రజలందరికీ పంచడమెలాగో ఆలోచించిన సిసలైన నేత. విద్య, వైద్య రంగాల్లో ఆయన అనుసరించిన, అమలుచేసిన విధానాలు యావత్తు దేశానికే ఆదర్శాలు. ఒకనాడు కునారిల్లిన ప్రభుత్వ విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు చేయడం ఒక్క కేసీఆర్కే సాధ్యపడింది. తెలంగాణలో ఆడపిల్ల జీవితానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించిన సామాజిక భద్రత తేలికైన ప్రణాళిక కాదు. శిశువు గర్భంలో ఉండగానే పౌష్టికాహారమివ్వడం దగ్గరి నుంచి ప్రసవానికి ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చి.. ప్రసవానంతరం పదమూడువేల నగదు, కేసీఆర్ కిట్ ఇచ్చి.. తిరిగి ఇంటి దగ్గర దింపి.. పెరిగిన కొద్దీ ఉచితంగా చదువు చెప్పి.. పెండ్లీడు వచ్చిన తర్వాత లక్షా నూటపదహార్లు ఖర్చులకు ఇచ్చేంత వరకు సుదీర్ఘ ప్రణాళిక దేశంలో మరెక్కడా కనిపించదు.
దేశంలో పాజిటివ్ పాలిటిక్స్ నడుస్తున్న కాలమిది. తప్పనిసరిగా ప్రజలకు అభివృద్ధి కనిపించాలి. విజిబుల్ డెవలప్మెంట్ అన్న మాట ఇప్పుడు తెలంగాణలో మాత్రమే కనిపిస్తున్నది. అతి త్వరగా.. అత్యంత వేగంగా దశాబ్దాల తరబడి పెండింగ్లో పడేయకుండా నిర్మాణాత్మకంగా అభివృద్ధిని ఎలా చేయాలో చూపించిన, చూపిస్తున్న రాష్ట్రం ఇవాళ తెలంగాణ.
ఈ తెలంగాణ పాలనకు మించిన ప్రత్యామ్నాయం ఏదైనా కనిపిస్తే.. దాన్ని అందుకోవడానికి ప్రజలు ఆలోచిస్తారు. కానీ అలాంటి ప్రత్యామ్నాయం లేనే లేదు. తెలంగాణలో బీజేపీ స్థానాన్ని కాంగ్రెస్.. కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయే తప్ప బీఆర్ఎస్ స్థానం దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నాయనేది వాస్తవం.
కర్ణాటకలో విజయం సాధించగానే ఆ ప్రభావం తెలంగాణపై కూడా పడుతుందని కాంగ్రెస్ ఆశపడింది. కర్ణాటక మాడల్ అన్న పదాన్ని కాయిన్ చేయడానికి ప్రయత్నించింది. కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఇస్తే.. ఇక్కడ ఆరు గ్యారెంటీలు ఇస్తామని ఊదరగొట్టారు. డిక్లరేషన్లు.. గ్యారెంటీలతో హంగామా జరిగింది. ఆరు గ్యారెంటీలు తమకు చాలా సానుకూలంగా మారుతాయని నమ్మారు. కానీ.. కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వచ్చి తమ రాష్ట్రంలో ఐదు గంటలకు మించి కరెంటు ఇవ్వటం లేదని ప్రచార సభలోనే మాట్లాడటంతో స్థానిక కాంగ్రెస్ నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. దీంతో ఎంత వేగంగా ఆరు గ్యారెంటీలు తీసుకొచ్చారో.. అంతే వేగంగా వాటిని పక్కన పెట్టి మళ్లీ కేసీఆర్ పై దుర్భాషలు, ఇతర అంశాలపైకి కాంగ్రెస్ ప్రచారం మళ్లింది. కేవలం కేసీఆర్ పై వ్యతిరేక ప్రచారంతోనే నాలుగు ఓట్లు సంపాదించుకోవచ్చన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నది.
కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందన్న ఒక మేనియా ఆయన్ని కమ్మేసింది. తన పార్టీ గెలిచినట్టు.. తానే ముఖ్యమంత్రి అయిపోయినట్టు ఆయనకు వస్తున్న కలల కల్లోలంలో ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు. ఈ ధోరణి ఆయన సొంత పార్టీలోనే చాలామందికి నచ్చడం లేదు. ఈ వ్యాఖ్యానాలు రేవంత్కే కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా రివర్స్ అయ్యాయి. ఈయన కేసీఆర్ లాంటి నాయకుడికి ప్రత్యామ్నాయం అవుతారని ప్రజలు భావించడం లేదు.
ఇక బీజేపీ కూర్చొన్న కొమ్మనే నరుక్కున్నది. ఆ పార్టీ అధ్యక్షుడే పోటీ నుంచి తప్పుకున్నాడు కాబట్టి.. ఆ పార్టీ పోటీలో ఉన్నట్టు ప్రజలే అనుకోవడం లేదు. ఈ క్రమంలో తెలంగాణలో పార్టీని, ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ప్రజలకు ఎంతమాత్రం కనిపించడం లేదు. కేసీఆరే వారికి ఏకైక నాయకుడు. వాళ్లు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే, దశాబ్దాల పాలనలో పాలకుల ద్రోహాలతో, గాయపడిన తన జాతి విముక్తం కోసం అందరి కలను తన కలగా చేసుకొని గర్వంగా ఎగిరిన జెండా కేసీఆర్. మళ్లీ చీమల దండులా ఈ మట్టిని, ఈ గడ్డను నిలువు దోపిడీ చేయడానికి దండు కట్టి వస్తున్న దారి దోపిడీ దారులకు అడ్డుగా నిలిచి ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతున్న తెలంగాణను సుదర్శనుడై అడ్డుకోగల ఏకైక నాయకుడు కేసీఆర్ కాబట్టి.
– కోవెల సంతోష్కుమార్ 90521 16463