కోకాపేటలో ఎకరం భూమి వంద కోట్లకు కొన్నారు. తెలంగాణలోనే కాకుండా ఆంధ్రలో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. 69 వేల కోట్లతో నగరానికి నలువైపులా మెట్రోను విస్తరిస్తున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించారు. తెలంగాణ భవిష్యత్తును చూపిస్తున్న పరిణామాలివి.
బంగారు తెలంగాణ అని వెకిలి నవ్వు లు నవ్వే పరాన్నజీవులను వదిలేయండి. ఈ రెండు వార్తలను సరిగ్గా అంచనా వేస్తే రేపటి తెలంగాణ, రేపటి హైదరాబాద్ మహా నగరం కండ్లముందు కనిపిస్తుంది. ఎదురుగా కనిపించే ఛానల్ మైకు ముందు పైసా ఖర్చులేకుండా విమర్శలు చేసే మేధావులను వదిలేద్దాం, వంద కోట్లు పెట్టి ఎకరం కొనేవాళ్లు ఏం ఆలోచించకుండానే కొంటారా? తెలంగాణ వారికన్నా, రాజకీయ నాయకుల కన్నా, మైకుల ముందు మాట్లాడే మేధావుల కన్నా డబ్బు పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా ఆలోచిస్తారు. రేపటి తెలంగాణ ను, విశ్వనగరం హైదరాబాద్ భవిష్యత్తును మనకన్నా వాళ్లే బాగా అంచనా వేస్తున్నారు.
2003లో వై.ఎస్.రాజశేఖర్రెడ్డి చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఆ సమయంలో రాయలసీమ, ఆంధ్రా నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు అక్కడికి వచ్చారు. అక్కడి భూములు పంటలు లేకుండా ఉండటంతో విచారిస్తే ఎకరా వేల రూపాయల్లోనే చెప్పారు. పాదయాత్ర తర్వా త చేవెళ్ల ప్రాంతంలో పెద్ద ఎత్తున భూముల రిజిస్ట్రేషన్ జరిగింది, చేతులు మారాయి. పాదయాత్రలో పాల్గొన్న నాయకులు అప్పుడు తెలంగాణ లో రైతుల దుస్థితి చూసి కన్నీరు కారుస్తూ టీడీపీని ఓడించండి, మమ్ముల్ని గెలిపించండని చెప్పడమే కానీ, బంగారం లాంటి భూములను కారుచౌకగా అమ్ముకోకండని చెప్పినవారు లేరు. వందకోట్ల ధర పలికిన కోకాపేటలో 10 వేల నుంచి 50 వేల కు ఎకరం అమ్ముకున్న రైతు కుటుంబాలున్నాయి. అలా కారుచౌకగా అమ్ముకున్న వారు ఎవరూ నేటి తెలంగాణను అంచనా వేయలేదు. ఇప్పుడు రేపటి తెలంగాణను అంచనా వేయకపోతే 10 వేలకు ఎకరం అమ్ముకున్న కోకాపేట రైతు ఇప్పుడు బాధపడుతున్నట్టే, రేపటి తెలంగాణను అంచనా వేయలేని వాళ్లు బాధపడతారు.
‘భూముల ధరలు పెరగడమే అభివృద్ధా?’ అని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నవాళ్లు, తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, ఇండ్ల స్థలాల ధరలు, భూముల ధరలు పడిపోతాయని ఉపన్యాసాలు ఇచ్చినవారే. అప్పుడే కాదు చివరికి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రియల్ ఎస్టేట్ ఢాం అంది అంటూ అవకా శం వచ్చినప్పుడల్లా తమ మీడియా ద్వారా విషం చిమ్ముతున్నవాళ్లే. భూముల ధరలు మంత్రం వేస్తే పెరగవు. వ్యక్తుల ఆదాయాలు, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంటే భూముల ధరలు పెరుగుతాయి. దేశంలోని అన్ని ప్రాంతాలవారు హైదరాబాద్లో ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ ఉద్యోగావకాశాలు పెరిగినప్పుడు సహజంగా వాళ్లు సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. ఉద్యోగ అవకాశాలు పెరగడం రియల్ ఎస్టేట్కు ఊతం ఇస్తుంది. గ్రాఫిక్స్ ద్వారా భారీ భవంతులను చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచాలని ప్రయత్నించినా ఆ గాలి బుడగ ఎక్కువ రోజులు ఉండదని అమరావతి ఉదంతం చెప్తున్నది. అమరావతి రాజధాని ప్రకటన తర్వాత ఎం.వెంకయ్యనాయుడుది రెండు పేజీల ఇంటర్వ్యూ ప్రముఖ పత్రికలో వచ్చింది. ఒకేసారి హైదరాబాద్తో పోటీ పడి మహానగరాన్ని నిర్మిస్తామని చెప్పడం సరికాదు. చైనాలో అలా నిర్మించిన నగరాలూ మనుషులు లేకుండా పడి ఉన్నాయి. నగరం క్రమంగా పెరుగుతూ పోవాలని చెప్పారు. ఆ మీడియా దానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు కానీ, ప్రపంచస్థాయి నగరమని అందరినీ బోల్తా కొట్టించింది.
2014లో ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ కాదు. హైదరాబాద్ ఐదు వందల ఏండ్ల మహానగరం. అప్పటినుంచి అన్ని ప్రాంతాల వారికి ఆశ్రయం ఇస్తూ వారి ఎదుగుదలకు దోహదం చేస్తున్న నగరం. 69 వేల కోట్లతో మెట్రో హైదరాబాద్ నగరానికి నలువైపులా విస్తరిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించడం అంటే దాన్ని ఒక రాజకీయ ప్రకటనగా, ఎన్నికల ప్రకటనగా తీసుకుంటే అలాంటి మేధావులను చేసేదేమీ లేదు. కానీ మహానగరంలో తమకు సొంత ఇల్లు ఉండాలని కోరుకునేవారు ఈ ప్రకటన జాగ్రత్తగా గమనించాలి. ఔటర్ వెంట, మరో నాలుగు మార్గాల్లో మెట్రో నిర్మించనున్నారు. బీబీనగర్, షాద్నగర్, ఇస్నాపూర్, పెద్ద అంబర్పేట, ఈసీఐఎల్, కండ్లకోయ, తూంకుంట వరకు మెట్రో పరుగులు పెట్టనున్నది. మొత్తం 278 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణం జరుగుతుంది. ఇది ఆచరణలోకి రావడానికి సమయం పట్టవచ్చు కానీ జరిగి తీరుతుంది. గత పదేండ్లలో ప్రభుత్వ ఆదాయం పెరుగుదల చూస్తే మెట్రో విస్తరణ పెద్ద కష్టమేం కాదు.
1996 ప్రాంతంలో హైటెక్ సిటీ నిర్మాణానికి భూమి పూజ జరిగినప్పుడు ఆ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు ఒక రిపోర్టర్గా వెళ్లాను. అప్పుడు అక్కడ లక్ష రూపాయలకు ఎకరం. వార్త ఎలా రాయాలి? ఏం లీడ్ తీసుకోవాలి? ఆఫీస్కు ఎంత త్వరగా వెళ్లి వార్త ఇవ్వాలనే ఆలోచనే తప్ప రిపోర్టర్ అనేవాడికి హైటెక్ సిటీ నిర్మాణం తర్వాత ఇక్కడ జరగబోయేదేమిటీ అనే అంచనా ఉండదు. నారావారి పల్లె దాటని అమ్మణ్ణమ్మ (చంద్రబాబు తల్లి) ఇక్కడ ఐదెకరాల భూమి కొని మనవడికి బహుమతిగా ఇచ్చారు. కానీ, ఇక్కడి మేధావులు, జర్నలిస్టులు, నాయకులు భూముల విలువలు ఎలా పెరుగుతాయో గుర్తించలేదు.
278 కిలోమీటర్ల పరిధిలో మెట్రో నిర్మాణం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తే, కావాలంటే వంద బస్సులు వేయండి, మెట్రో ఎందు కు వృథా అని జయప్రకాశ్ నారాయణ్ అనే మేధావి సలహా ఇచ్చారు. మెట్రో లేకముందు దిల్సుఖ్నగర్ నుంచి కూకట్పల్లికి వెళ్లాలంటే నరకం కనిపించేది. మెట్రో వచ్చాక అరగంటలోపే నగరంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా వెళ్లిపోతున్నారు. నగరం క్రమంగా విస్తరిస్తున్నది. పైకి రాజకీయ విమర్శలు చేసే కొందరు ఓవైపు భూములు కొంటూనే మరోవైపు ప్రభు త్వం చెప్పేది అయ్యేది కాదు, పొయ్యేది కాదని విమర్శిస్తుంటారు.
-బుద్దా మురళి
9182777011