ప్రపంచవ్యాప్తంగా కార్మిక శక్తి 61 శాతంగా ఉంటే, మన దేశంలో 64 శాతం ఉన్నది. అయినా, దేశంలో నిరుద్యోగం ఎందుకు పెరిగిపోతున్నది. దేశంలో 105 కోట్ల మంది పదిహేనేండ్ల కంటే పైబడిన వారున్నారు. 100 శాతం పట్టభద్రుల్లో 60 శాతం మంది పనిచేయటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వీరిలో 26 శాతం మందికి చేయడానికి పనిలేదు. 20-24 ఏండ్ల మధ్య ఉన్న పట్టభద్రుల్లో 46 శాతం నిరుద్యోగం ఉన్నది. 25-29 మధ్య వయసులోని యువకుల్లో 15 శాతం నిరుద్యోగం ఉన్నది. 30-34 మధ్య వయసున్న వారిలో 6 శాతం, 45-64 మధ్య వయసున్న వారిలో 2 శాతం నిరుద్యోగం ఉన్నది.
దేశంలో సుదీర్ఘ కుటుంబపాలన, ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాల కారణంగా దేశ ఆర్థికవ్యవస్థ భ్రష్టు పట్టింది. బీజేపీకి ఓటేసి స్పష్టమైన మెజారిటీ ఇస్తే సుస్థిరపాలన అందిస్తామని నరేంద్ర మోదీ ప్రగల్భాలు పలికారు. 2014 నుంచి స్థిరమైన బీజేపీ ప్రభుత్వం ఉన్నా యువశక్తికి సరైన దిశానిర్దేశం చేయలేకపోతున్నది. అచ్చేదిన్, సబ్కా సాత్ సబ్కా వికాస్, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా లాంటి నినాదాలు మాటలకే పరిమితమయ్యాయి. అనేక కార్యక్రమాలకు కొత్త పేర్లు తీసుకొచ్చి వాటి స్వరూపాన్ని మార్చింది. అంతే తప్ప, మోదీ పాలనలో విద్య, ఉపాధి, దేశ పురోగతిపై సాగాల్సిన చర్చ, మతంపైనే ఎక్కువగా సాగుతున్నది.
దేశంలో నిరుద్యోగ ప్రభావం ఎలా ఉన్నదో ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ సంస్థ గత ఐదేండ్ల అధ్యయనాన్ని పరిశీలిస్తే మనకు ఆశ్చర్యానికి గురిచేసే అంశాలు కనిపిస్తాయి. 2016 మే నెలలో 94 కోట్ల మంది పనిచేయగల యువశక్తి దేశంలో ఉంటే 2021 ఫిబ్రవరిలో అది 105 కోట్లకు చేరింది. అంటే ఐదేండ్లలో యువశక్తి 11 కోట్లు పెరిగింది. ఇక ఉపాధి వాస్తవ పరిస్థితిని చూస్తే 2016 మే నెలలో 94 కోట్లమంది పనిచేయగల యువశక్తిలో 46 కోట్ల మంది మాత్రమే ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. మిగిలిన 48 కోట్ల మంది ఉద్యోగ అన్వేషణలో, ఖాళీగా ఉన్నారని తేలింది. నేడు 105 కోట్లమందిలో 42 కోట్ల మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారు. మిగతా 63 కోట్ల మంది ఉద్యోగ వేటలో ఉన్నారు. (సీఎంఐఈ) లెక్కల ప్రకారం జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరు నిరుద్యోగిగా ఉంటున్నారు. ఇదేదో కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితి కాదు. మన దేశంలో ఉపాధి అవకాశాలను కరోనా దెబ్బతీసిందన్న మాట వాస్తవమే అయినా పైన చెప్పిన నిరుద్యోగానికి కరోనా వల్ల మూతపడ్డ పరిశ్రమలకు ఏ మాత్రం సంబంధం లేదు.
దేశంలోని విద్యా విధానాలు, పాలసీలు, నైపుణ్యాల కొరత నిరుద్యోగానికి కారణాలు. ప్రస్తుతం వృత్తి విద్య కోర్సుల్లో నైపుణ్యం ఎంత ఉన్నదో అందరికి తెలిసిందే. ఈ తరుణంలో విద్యావ్యవస్థలో మార్పులు చేసి నైపుణ్య విద్యకు బాటలు వేయాల్సిన అవసరం ఉన్నది. 2003 జాతీయ ఉపాధికల్పన నివేదికతోపాటు యూవీ రావు నివేదిక ప్రకారం వృత్తివిద్యను అభ్యసించిన వారిలో 90 శాతం విద్యార్థులకు సరైన నైపుణ్యాలు లేవని తేలింది. దీనికి కారణం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇంజినీరింగ్ కళాశాలలే. దేశంలో ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు పెరగాలి. కానీ నైపుణ్యమైన విద్య కచ్చితంగా అమలయ్యేలా చట్ట సవరణలు తీసుకురావాలి. ప్రపంచంలో నిరుద్యోగం పెరగటానికి యాంత్రీకరణ కారణం అని చెప్పవచ్చు. కానీ, టెక్నాలజీ మార్పులను మానవులు అంగీకరించకతప్పదు. కాకపోతే ప్రభుత్వం చేతిలో ఉండాల్సిన పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటు పరమైతే ఇక భవిష్యత్తు ఆగమ్యగోచరమే. ప్రభుత్వం చేతిలో ఉంటే ఏ పరిశ్రమ అయినా సరే ప్రజా ప్రయోజనంతో ముందుకుసాగుతున్నది. వ్యాపారి చేతిలోకి వెళ్తే వ్యాపారికి మాత్రమే అధిక లాభం అన్న కోణంలో సాగుతుంది. దీని పర్యవసానం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
– సయ్యద్ నిసార్ అహ్మద్, 78010 19343