రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని, అధికారంలోకి రాబోతోందని, ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ప్రధాని కాబోతున్నారని తుక్కుగూడ జనజాతరలో తెలంగాణ సీఎం సహా కాంగ్రెస్ మంత్రులు చెప్పారు. ఈ మాటల్లో నిజమెంత ఉన్నదో.. బీఆర్ఎస్కు ఒకట్రెండు లోక్సభ సీట్లు కూడా రావని, ఎమ్మెల్యేల ఫిరాయింపుతో అసెంబ్లీలో దాని బలం గణనీయంగా పడిపోతోందనే వారి జోస్యంలోనూ అంతే నిజం ఉన్నది. పదేండ్ల తర్వాత అధికార పీఠమెక్కిన కాంగ్రెస్ నేతల అంచనాలు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నాలేగాని మరేమీ కావు. అయితే, తెలంగాణలోని కొందరు రాజకీయ పండితులు, పరిశీలకులు కూడా కాంగ్రెస్ బాణీలోనే లోక్సభ ఎన్నికల ఫలితాలను బేరీజు వేసి చెప్పడం వింతగా ఉన్నది.
Congress | ఏ రాష్ట్రంలోనైనా ఆరు నెలల వ్యవధిలో రెండు చట్టసభలకు (అసెంబ్లీ, పార్లమెంట్) వెంటవెంటనే ఎన్నికలు జరిగితే ఫలితాలు ఒకే తీరున ఉండే అవకాశం ఉంటుంది. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సాధారణ నమ్మకం. ఈ సూత్రీకరణకు భిన్నమైన ఫలితాలు వచ్చిన సందర్భాలు అనేకం కనపడుతాయి. పైన చెప్పిన కొందరు దేశవాళీ ఎన్నికల విశ్లేషకుల అంచనాల ప్రకారం.. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకు గానూ బీఆర్ఎస్కు అతి తక్కువ సీట్లు వస్తాయనడానికి ఈ 4 నెలల్లో జరిగిన గొప్ప రాజకీయ పరిణామాలేవీ లేవు. అత్యధిక హామీలను తొలి వంద రోజుల్లో కాంగ్రెస్ అమలు చేయనూ లేదు. శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన కీలక వాగ్దానాలను అమలు చేయడానికి గట్టి ప్రయత్నాలు ఇంకా మొదలుపెట్టలేదు. జాతీయపక్షాలకు అత్యధిక రాష్ర్టాల్లో అసెంబ్లీలో కన్నా పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు దక్కిన మాట చాలా సందర్భాల్లో వాస్తవమే గానీ ప్రతి సందర్భంలోనూ అదే జరగాలని లేదు. ఏదైనా ఒక రాష్ట్రంలో ఏకకాలంలో అసెంబ్లీ, పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో కాస్త భిన్నమైన ఫలితాలు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవించి ఉండగా 1989 చివరలో 9వ లోక్సభతో పాటు జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకుగాను టీడీపీ 74 సీట్లు గెలిచింది. 42 పార్లమెంట్ సీట్లలో కేవలం రెండే రెండు స్థానాలను (బొబ్బిలి, నర్సాపురం) దక్కించుకున్నది. ఏడాదిన్నరకే 1991 మేలో జరిగిన పార్లమెంట్ మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ 13 సీట్లతో బలం పెంచుకోగా, పాలకపక్షమైన కాంగ్రెస్ బలం 14 సీట్లు తగ్గి 25కు పడిపోయింది. అలాగే 1980 లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో తమిళనాడులో దివంగత సీఎం ఎంజీఆర్ నాయకత్వంలోని ఏఐఏడీఎంకే మొత్తం 39 సీట్లలో 2 మాత్రమే గెలుచుకొని చతికిలపడింది. అయితే, ఆరు నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతీయ పక్షం మొత్తం 234 సీట్లలో 162 కైవసం చేసుకొని మరోసారి అధికారంలోకి వచ్చింది.
పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయి, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎల్డీఎఫ్: కొన్ని రాష్ర్టాల్లో జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే.. ఇలాంటి భిన్నమైన ఫలితాలు వచ్చాయనే విషయం అవగతం అవుతుంది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమికి మొత్తం 20 స్థానాల్లో ఒకే ఒక సీటు రాగా, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ మిగిలిన 19 స్థానాలను కైవసం చేసుకున్నది. కానీ, రెండేండ్ల తర్వాత 2021 మేలో జరిగిన కేరళ శాసనసభ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ మొత్తం 140 సీట్లలో 99 గెలుచుకొని చరిత్రాత్మక విజయం సాధించింది. పాలక కూటమి బలం 9 సీట్లు పెరిగింది. కాంగ్రెస్ కూటమి బలం 6 స్థానాలు తగ్గి 41కి పడిపోయింది. ఓట్ల శాతం విషయానికి వస్తే.. ఎల్డీఎఫ్కు 45.43 శాతం, కాంగ్రెస్ కూటమికి 39.47 శాతం లభించాయి. 2018 చివరలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోగా, కాంగ్రెస్ విజయం సాధించింది.
ఆరు నెలల తర్వాత జరిగిన 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఈ మూడు రాష్ర్టాల్లోని 90 శాతానికి పైగా సీట్లను కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది. ఇంకా మూడు దశాబ్దాల కిందట ఉమ్మడి ఏపీలో 1994 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ మొత్తం సీట్లలో మూడొంతులకు పైగా స్థానాలను కైవసం చేసుకున్నది. ఆ తర్వాత ఏడాదిన్నరలోపే అనగా 1996 మార్చిలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 42 సీట్లకుగాను పాలకపక్షమైన టీడీపీ కేవలం 16 సీట్లు గెలుచుకున్నది. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో 25 స్థానాలే దక్కించుకున్న కాంగ్రెస్ 22 ఎంపీ సీట్లు కైవసం చేసుకున్నది. ఇలా చెప్పుకుంటూపోతే పార్లమెంటుకు, అసెంబ్లీకి కొన్ని మాసాలు లేదా సంవత్సరాల వ్యవధితో జరిగే ఎన్నికల్లో భిన్నమైన ఫలితాలు రావడం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కనిపించే సాధారణ వ్యవహారం.
ఆధిక్యం రెండు శాతమే: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి పాలకపక్షం బీఆర్ఎస్పై కేవలం 2.05 శాతం ఓట్ల ఆధిక్యంతో (39.40 శాతం) కాంగ్రెస్ పార్టీకి సాధారణ మెజారిటీకి అవసరమైన 64 సీట్లు దక్కాయి. బీఆర్ఎస్కు 39 సీట్లు వచ్చాయి. మరో రకంగా చెప్పాలంటే తెలంగాణ అసెంబ్లీలోని మొత్తం 119 సీట్లలో కాంగ్రెస్కు 53 శాతం రాగా, బీఆర్ఎస్కు 32 శాతం వచ్చాయి.
దాదాపు 40 శాతానికి దగ్గరగా ఓట్లు, మూడో వంతు సీట్లు దక్కించుకున్న నేపథ్యంలో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు చిక్కే సీట్లు ఒకటా? రెండా? అనే కొందరు కాంగ్రెస్ భజనపరులు వేస్తున్న అంచనాలు హేతుబద్ధంగా లేవు. ఇక బీజేపీ విషయానికి వస్తే.. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఒక మోస్తరు త్రిముఖ పోటీ జరగడంతో 13.9 శాతం ఓట్లతో ఆ పార్టీ 8 స్థానాలు కైవసం చేసుకున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ కారణంగా ఈ రెండింటిలో ఏ ఒక్క పక్షానికి 45 శాతం ఓట్లు రాకపోవడంతో మధ్యలో బీజేపీకి మొత్తం సీట్లలో 6.7 శాతం లభించాయి.
గత నాలుగు దశాబ్దాల నుంచి లోక్సభ ఎన్నికల్లో జాతీయ పక్షాల వైపు తెలుగు ఓటర్లు కాస్త మొగ్గు చూపించడం వల్ల బీజేపీ గత నాలుగైదు అసెంబ్లీ ఎన్నికల్లో పది సీట్లలోపే దక్కించుకున్నది. కానీ, 1998 నుంచి (2004, 2009 ఎన్నికలు దీనికి మినహాయింపు) జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 3, 4 సీట్లు కైవసం చేసుకున్నది. తెలంగాణ ఇచ్చానని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీని జనం నమ్మడానికి పదేండ్లు పట్టింది. మరి తెలంగాణ సాధనకు 2002 నుంచి 2014 వరకూ నిరవధిక పోరు సలిపి అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను కార్యరూపంలో సాధించి తొమ్మిదిన్నరేండ్లు పాలకపక్షంగా కొనసాగిన చరిత్ర బీఆర్ఎస్ది. పై అంశాలన్నీ పరిశీలిస్తే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుచుకునే సీట్లపై ఎన్నికల విశ్లేషకుల అంచనాలకు అర్థం లేదు. అలాగే 2019 లోక్సభ ఎన్నికల్లో ఒక్క కేరళలోనే రెండంకెల సీట్లు గెలుచుకున్నది కాంగ్రెస్. మొత్తం 52 సీట్లకే పరిమితమైంది. గుర్తింపు పొందిన ప్రతిపక్షానికి అవసరమైన సీట్లు పార్లమెంటు దిగువ సభలో కాంగ్రెస్ పార్టీకి పదేండ్లుగా లేవు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సర్కారు ప్రవేశపెట్టిన రైతుబంధు వంటి సంక్షేమ పథకాలను అమలు చేయలేక చతికిలపడుతున్న హస్తం పార్టీ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఏం చేసిందని జనం 14 సీట్లు ఇస్తారో ఆ పార్టీ అయినా చెప్పే స్థితిలో లేదు. బొటాబొటి మెజారిటీతో నాలుగు నెలల కిందట అధికారం దక్కిన తెలంగాణలో 14 ఎంపీ సీట్లలో విజయం సాధిస్తే పార్టీ అధినేత రాహుల్ ప్రధాని అవుతారన్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ప్రకటన ఈ ఏడాదికి పెద్ద జోక్గా మిగిలిపోతుంది.
– నాంచారయ్య మెరుగుమాల