తిరువనంతపురం: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేరళ మాజీ సీఎం విజయన్(Pinarayi Vijayan) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్లో పేదల ఇండ్లను కూల్చేందుకు చేపట్టిన హైడ్రా ప్రాజెక్టును.. నాజీ నియంత అడాలఫ్ హిట్లర్ స్పూర్తితో చేపట్టినట్లు సీఎం రేవంత్ పేర్కొన్న విషయం తెలిసిందే. బెంగుళూరులోని ద హిందూ పత్రిక నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. హైడ్రా ప్రాజెక్టు పట్ల గర్వంగా ఫీలవుతున్నట్లు చెప్పారు. అయితే ఆక్రమణలను కూల్చివేందుకు చేపట్టిన హైడ్రా ప్రాజెక్టును.. నాజీ నియంత హిట్లర్తో పోల్చడాన్ని మాజీ సీఎం విజయన్ తప్పుపట్టారు. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలుకు షాకింగ్గా ఉన్నట్లు విజయన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను అవమానించినట్లే అవుతుందని తెలిపారు.
సీపీఎం నేత విజయన్ తన ఫేస్బుక్ పేజీలో ఈ అంశంపై స్పందించారు. తన బుల్డోజర్ రాజ్ను సమర్థించుకునేందుకు హైడ్రా గురించి పబ్లిక్గా, గర్వంగా ఫీలవుతున్నట్లు సీఎం రేవంత్ పేర్కొన్నారన్నారు. ప్రపంచ చరిత్రలోనే కిరాతకమైన నియంతగా పేరును హిట్లర్ స్పూర్తితో హైడ్రాను ఏర్పాటుచేసినట్లు రేవంత్ చెప్పడం సిగ్గుచేటు అని విజయన్ తన ఎఫ్బీలో విమర్శించారు. హింస, నిరంకుశత్వానికి కేంద్ర బిందువైన ఓ వ్యవస్థను స్పూర్తిగా తీసుకుని, ప్రజాస్వామ్య దేశానికి చెందిన ఓ ముఖ్యమంత్రి పబ్లిక్గా మాట్లాడడం సరికాదన్నారు. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు అన్నారు. ఫాసిజంకు మరో పేరుగా నిలిచిన హిట్లర్ను కీర్తిస్తున్న రీతిలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడడం ఆందోళనకరమైన అంశమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన నోరు జారడమే కాదు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత క్యారెక్టర్ను బయటపెడుతుందని విజయన్ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్కు గతంలో సంఘ్ పరివార్తో లింకులు ఉన్నాయని, ఆ ప్రభావం కూడా రేవంత్ వ్యాఖ్యల్లో ఉన్నట్లు విజయన్ తెలిపారు.
సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు.. ఆ పార్టీ ఎప్పటికీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ విధానాలను వ్యతిరేకించలేదన్న అంశమ స్పష్టమవుతోందని విజయన్ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తుల పట్ల ప్రజాస్వామ్య ఆలోచన ఉన్న పౌరులు సమీక్షించుకోవాలని విజయన్ కోరారు. శనివారం బెంగుళూరలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైడ్రా అనే హిట్లర్కు ఇష్టమైన పదం అని, అతని వద్ద ఉన్న కోర్ బృందాన్ని హైడ్రా అని పిలిచేవారని, ఆ బృందం మరణమృదంగం సృష్టించేదని, హిట్లర్ నుంచి ప్రేరణ పొంది, తన ప్రాజెక్టుకు హైడ్రా అని పేరు పెట్టినట్లు సీఎం రేవంత్ చెప్పారు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.