ఉమ్మడి ఏపీలో అణగారిన వర్గాల కోసం తక్కువ సంఖ్యలో సంక్షేమ పాఠశాలలు నెలకొల్పడంతో మన విద్యార్థులు నష్టపోయారు. కానీ తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించాక టీఆర్ఎస్ ప్రభుత్వం 969 సంక్షేమ గురుకులాలు ప్రారంభించి నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నది. ఈ గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం దేశ అక్షరాస్యత కంటే తెలంగాణ 6.5 శాతం (66.5 శాతం) వెనకంజలో ఉన్నది. ఈ వెనుకబాటును అధిగమించడానికి విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకురావాలని సీఎం కేసీఆర్ భావించారు. అం దులో భాగంగానే గురుకులాల స్థాపనకు శ్రీకారం చుట్టి సఫలీకృతులయ్యారు. ఈ గురుకులాల్లో సుమారుగా 5.5 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మొత్తం గురుకులాల్లో 539 గురుకులాలు ప్రత్యేకంగా బాలికల కోసం ఏర్పాటు చేయడం విశేషం. గురుకులాల్లో ఇంటర్ కూడా ప్రవేశపెట్టడంతో బాలికలు ఎలాంటి ఆటంకాల్లేకుండా తమ చదువులు కొనసాగిస్తున్నారు. ఇంట ర్ చదివిన బాలికల కోసం గురుకుల డిగ్రీ కళాశాలలను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిం ది. దీనివల్ల బాల్య వివాహాలు ఆగిపోయాయి. బాలికలు ఉన్నత చదువుల బాటపట్టారు.
గురుకులాల్లో చదివే ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏడాదికి రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నది. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు అన్నిరకాల వసతి సౌకర్యాలను కల్పిస్తున్నది. ఈ నేపథ్యంలో గురుకులాల్లో సీటు కోసం విద్యార్థులు పోటీ పడుతున్నారు. గురుకుల అర్హత పరీక్షలో ఒక్కో సీటుకు సుమారుగా 35-40 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారంటే వీటికి ఉన్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. 21వ శతాబ్దంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు సాంకేతిక నైపుణ్యాలతో కూడిన విద్యను అందించడం గురుకులాల ప్రత్యేకత. తద్వారా విద్యార్థుల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపి వారిలో నాయకత్వ, జీవన నైపుణ్యాలను పెంపొందిస్తున్నది. ఆహ్లాదకరమైన వాతావరణం లో 1:29 నిష్పత్తిలో తగినంత మంది అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన చేయిస్తున్నది. రాష్ట్ర గురుకులాల్లో చదివిన కొందరు విద్యార్థులు ప్రపంచంలోని మేటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించి ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్య ను మరింత మంది మారుమూల ప్రాంత విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం 15 డిగ్రీ బీసీ గురుకులాలు, 33 గురుకుల పాఠశాలలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ సహకారంతో అధికారులు, ఉపాధ్యాయులు మరింత అంకితభావం తో పని చేసినట్లయితే తెలంగాణ గురుకులాలకు దేశంలోనూ, ప్రపంచంలోనూ ప్రత్యేక గుర్తింపు వచ్చే అవకాశం ఉన్నది.
– మర్రి యాదవరెడ్డి
73372 22461
(వ్యాసకర్త: కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్)