ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేవలం మూడు రోజుల వ్యవధిలో నాలుగు ఎదురుదెబ్బలు తగిలాయి. వాటిలో అన్నింటికన్న పెద్దది 13వ తేదీ నాటి కర్ణాటక పరాభవం. అంతకు ముందు 11నాడు సుప్రీంకోర్టు మహారాష్ట్ర, ఢిల్లీ కేసులలో మోదీ వ్యవహరణకు వ్యతిరేకంగా గమనార్హమైన తీర్పులు చెప్పింది. తర్వాత 12వ తేదీన అదే న్యాయస్థానం, గుజరాత్లో జిల్లా జడ్జీల నియామక జాబితా చట్టవిరుద్ధమంటూ కొట్టివేసింది. ఇన్నిన్ని జరుగుతున్నా జాతీయస్థాయి నుంచి తెలంగాణ వరకు బీజేపీ నాయకులకు జ్ఞానోదయమవుతున్న లక్షణాలు ఏమీ కన్పించటం లేదు. వారి అధికార కాంక్షలు, ధనాపేక్ష, అంతకుమించి సంస్కారహీనతను బట్టి చూడగా, తమకు అంతకుమించిన జ్ఞానం సాధ్యమే కాదనిపిస్తున్నది.
కర్ణాటకను తిరిగి గెలవటమే గాక, ఆ తర్వాత ప్రపంచాన్ని తలకిందులు చేసైనా తెలంగాణపై పంజా విసరాలని, ఆ విధంగా తమకు కొరకరాని కొయ్యగా మిగిలిన దక్షిణ భారతదేశ స్వాధీనానికి పావులు కదపాలని మోదీ పరివార్ కన్న కలలు శనివారం నాడు దయనీయమైన రీతిలో భంగపడిపోయాయి. ఆ భంగపాటు తీరుతెన్నులు ఎటువంటివో వివిధ గణాంకాలలో విశ్లేషణలలో ఇప్పటికే మీడియా నిండా పరుచుకొని కనిపిస్తున్నాయి. అయినా రెండు మాటలు చెప్పుకోవాలంటే, డబుల్ ఇంజిన్ సర్కార్గా చెప్పుకొనే బీజేపీ ప్రభుత్వాలు ఇటు కర్ణాటకలో, అటు జాతీయస్థాయిలో రెండేసి విడుతలు పరిపాలించి కూడా తమ జీవితాలను బాగు చేసిందేమీ లేదని అక్కడి ప్రజలకు అర్థమైంది. ఇదొకటి కాగా, ఒకవైపు తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకూ, మరొక వైపు ప్రజలను రెచ్చగొట్టి, తప్పుదారి పట్టించి, అధికారాన్ని కాపాడుకునేందుకూ రకరకాల నినాదాలతో, చర్యలతో మత విద్వేషాలు సృష్టిస్తున్నారని కూడా ప్రజలు గ్రహించటం రెండవది.
ఉత్తరాది పార్టీ, దక్షిణాదికి వ్యతిరేకమైన పార్టీ, మతతత్వ పార్టీ అనే ముద్రలు మొదటి నుంచి బలంగా గల బీజేపీ, వింధ్య పర్వతాలను, దండకారణ్యాన్ని, గోదావరిని దాటి దక్షిణాదిపై దండెత్తి ఆక్రమించేందుకు చిరకాలంగా శాయశక్తులా ప్రయత్నిస్తున్నది. కానీ అప్పుడప్పుడు చెదురుమదురు అవకాశాలు లభించటం మినహా నిజమైన విధంగా వేళ్లూనుకోలేదు. అందుకు చారిత్రకంగానే గాక వర్తమానంలోనూ, విధానపరంగానే గాక సామాజిక సంస్కృతుల రీత్యానూ బలమైన కారణాలున్నాయి. అటువంటి దక్షిణ దేశంలోకి చొరబడటం, విస్తరించటం ఈ శక్తులకు తమ జనసంఘ్ అవతార కాలంలో గాని, బీజేపీగా పునరవతారంలో గాని, నాయకత్వం వాజపేయి వంటి ఉదారవాదిది అయినా, మోదీ వంటి బహిరంగ మతతత్వ వాదిది అయినా సాధ్యం కావటం లేదు. పైగా అనేక సందర్భాల్లో దక్షిణాది వ్యతిరేకులనే పేరు తెచ్చుకుంటున్నారు. ఈ విషయంలోనైతే వాజపేయి-అద్వానీల వరకు ఉండిన జాగ్రత్తలను, మర్యాదలను మోదీ-అమిత్ షాల ద్వయం గాలికి వదిలివేసింది.
దక్షిణాది తమకు అతిపెద్ద సవాలని అర్థమైన మోదీ బృందం, తాము మొదటిసారి అధికారాని కి వచ్చిన 2014లోనే, దక్షిణాదిలో ప్రవేశానికి తమకు తెలంగాణ గేట్ వే అవుతుందని పలుమా ర్లు ప్రకటించింది. ఇక్కడ మతతత్వాన్ని రెచ్చగొట్టేందుకు తగు అవకాశాలున్నాయనే లెక్కలు ఒక్కటి తప్ప, తమ ఆశాభావానికి ఆధారమేమి టో వారెప్పుడూ వివరించలేదు. కానీ వారి లెక్క లు ఈ పదేండ్లలోనూ నెరవేరకపోవటానికి ఏకైక కారణం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ విధానాలు, సమర్థవంతమైన పరిపాలన అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. బలమైన పార్టీ, సమర్థమైన నాయకత్వం, సంక్షేమాన్నీ అభివృద్ధినీ జోడెడ్ల వలె సాగించే ప్రభుత్వం, స్పష్టమైన సెక్యులర్ విధానాలు కల చోట బీజేపీ వంటి మతతత్వ, విచ్ఛిన్నకర, అభివృద్ధి నిరోధకశక్తికి ఎక్కడైనా సరే చోటుండదు. అందుకు తెలంగాణ ఒక నమూనాగా రూపుదిద్దుకున్నది.
కర్ణాటకలో స్థానికంగా కాంగ్రెస్, జేడీఎస్ల వరుస వైఫల్యాలు, పెద్ద సంఖ్యలో గల మఠాల మద్దతు, విపరీతమైన ధనబలంతో బీజేపీ తన కేంద్ర అధికారాన్ని కూడా దుర్వినియోగపరుస్తూ అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది తప్ప, లేనిపక్షంలో ఆ ఒక్క దక్షిణ ప్రాంతం కూడా బీజేపీకి అవకాశం ఇచ్చి ఉండేది కాదు.
వాస్తవానికి తక్కిన దక్షిణాదితో పాటు కర్ణాటక సీమ సైతం వందల సంవత్సరాలుగా సహజీవనం, సమాజ సంస్కరణలు, ప్రగతిశీల పాలనలు, సెక్యులరిస్టు ధోరణులు, ఉద్యమాలకు, సాహితీ సంస్కృతులకు పేరుబడినటువంటిది. ఇందుకు చెదురుమదురైన అపశ్రుతులు లేవని కాదు. కానీ, శతాబ్దాల చరిత్రను సమీక్షించుకుంటే తిరోగమనవాదం కన్న పురోగమన వాదమే చాలా ఎక్కువ. ఇది యావత్ దక్షిణాది చరిత్రలో సుదీర్ఘకాలంగా అంతర్లీనమై ఉండి ఆలోచనాధోరణులలో, తాత్వికతలో, సంస్కృతిలో, విధానాలలో ప్రతిఫలిస్తూ వస్తున్నది గనుకనే బీజేపీ వంటి మతతత్వ, విచ్ఛిన్నకరశక్తికి దక్షిణ దేశం యావత్తూ కొరకరాని కొయ్యగా మిగిలిపోయింది. అందుకు తగినట్లు, తెలంగాణలో వలెనే బలమైన నాయకత్వాలు, పార్టీలు, ప్రజాదరణ పొందిన సంక్షేమ-అభివృద్ధి విధానాలూ, ఆచరణలు ఈ నేపథ్యానికి తోడైన స్థితులలో బీజేపీ వంటి శక్తులకు దక్షిణాది అంతటా, ఇంతకాలం వలెనే, చెదురుమదురు గాలి రాలుడులో మామిడి పిందెలు తప్ప ఫల సాయమంటూ లభించే అవకాశం ఉండదు గాక ఉండదు. అంతేకాదు, బీజేపీ మతతత్వానికి ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాల్లో గల ఆలంబనలు దక్షిణాదిన లేవన్నది గమనించదగ్గ విషయం. ఆ వివరాల్లోకి ఇక్కడ వెళ్లలేము.
బీజేపీ గురించి, మోదీ గురించి తెలంగాణలో, దక్షిణాదిలోనే గాక ఇతరత్రా కూడా ఇటీవల ఒక గుర్తింపు క్రమంగా పెరుగుతున్నది. ఆయన 2014లో దేశ ప్రజలకు ఏ హామీలనైతే ఇచ్చి అధికారానికి వచ్చారో వాటిని అమలుపరచటంలో దారుణంగా విఫలమవుతున్నారు. అవినీతి తగ్గలేదు. కొత్తగా ఆయన మిత్రులు భారీ అవినీతిపరులయ్యారు. ప్రభుత్వ సంస్థలను చౌకగా అమ్మి, లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తూ ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థను అనేక రెట్లు పెంచుతున్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, విదేశాల్లోని నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షల వంటి హామీలు పచ్చి అబద్ధాలుగా మిగిలాయి. పెద్ద నోట్ల ఆకస్మిక రద్దు వంటి చర్యలతో సామాన్యుల జీవితాలూ, వ్యాపారాలూ దెబ్బతినిపోయాయి. విదేశీ రుణభారం లక్షల కోట్లలో పెరిగింది. గుజరాత్ నమూనా అన్న భ్రమాత్మకమైన ప్రచారం బోగస్గా తేలిపోయింది.
ప్రపంచంలో ప్రధానమైన సమస్త సూచీలలో భారతదేశపు ర్యాంకింగ్ నరేంద్ర మోదీ నాయకత్వాన గతంలో ఎన్నడూ లేనంతగా పతనమైంది. ధనిక-పేద తారతమ్యాలు ఎప్పుడూ లేనంతగా పెరిగాయి. వీటన్నింటి కన్న ముఖ్యంగా ప్రజాస్వామిక వ్యవస్థలను విధ్వంసం చేస్తూ, సమాజాన్ని గతంలో ఎప్పుడూ లేనట్లు మత విద్వేషంతో దీర్ఘకాలికంగా విషపూరితం చేస్తున్నారు. ఇంతచేసినా బీజేపీ ఎన్నికల్లో గెలవలేని చోట ధనాన్ని ఉపయోగించి ప్రభుత్వ ఏజెన్సీలను ప్రయోగించి, ఇతర పార్టీలను చీల్చుతూ, గవర్నర్ల వ్యవస్థను దురుపయోగం చేస్తూ, తెలంగాణలో వలె ఫార్మ్హౌజ్ కుయుక్తులకు పాల్పడుతున్నారు. కర్ణాటకలో పోయినమారు అధికారం చేజిక్కించుకున్నది ఆ విధంగానే.
ఇవన్నీ దేశ ప్రజలకు క్రమంగా అర్థమవుతున్నాయి. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ అధికారం సంపాదించేందుకే జాతీయవాదాన్ని, మతాన్ని ఒక సాధనంగా దుర్వినియోగపరుస్తున్నారనేది కూడా తెలిసివస్తున్నది. ఈ విధమైన పలురకాల దుర్మార్గాలు ఈ నెల 11, 12 తేదీలలోని సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా మరొక మారు దేశ ప్రజలకు బహిర్గతమయ్యాయి.
మహారాష్ట్రలో ఉద్ధవ్ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు గవర్నర్ను, స్పీకర్ను ఎట్లా దుర్వినియోగపరిచారో, శివసేనలోని ఒకవర్గాన్ని ఎట్లా ప్రలోభపెట్టారో, ఢిల్లీలో ఎన్నికైన కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఎట్లా ముప్పుతిప్పలు పెట్టారో, రెండు రాష్ర్టాల్లో ఈ మొత్తం చర్యలు ఎట్లా రాజ్యాంగ విరుద్ధమో మనకు ఆ తీర్పుల వల్ల తెలిసివచ్చింది. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో 68 మందిని ఏ విధంగా చట్టవిరుద్ధంగా జిల్లా జడ్జిలుగా ప్రమోట్ చేయచూసిందీ ఈ నెల 12న సుప్రీంకోర్టు ఆదేశాలతో బహిర్గతమైంది. మోదీ ప్రభుత్వం చివరికి సుప్రీంకోర్టునే నియంత్రించేందుకు సాహసిస్తున్నది ఇటీవల.
తాను అధికారానికి వచ్చిన కొత్తలో ఫెడరలిజం అంటూ వల్లించిన మోదీ, ఇతర పార్టీల ప్రభుత్వాలను రాజ్భవన్ల ద్వారా ఎట్లా ఇబ్బంది పెట్టి పరిపాలనను కుంటుపరుస్తున్నా రో తెలంగాణ సహా వేర్వేరు రాష్ర్టాలలో చూస్తు న్నాం. ఇక రాష్ర్టాల అధికారాలను హరించే ప్రయత్నం జరగకుండా ఒక్కవారం కూడా గడవటం లేదు. ప్రత్యక్ష, పరోక్ష రూపాలలో వీటన్నింటికి కర్ణాటక ఫలితాల రూపంలో, సుప్రీంకోర్టు తీర్పుల రూపంలో మోదీకి గట్టి ఎదురుదెబ్బలు తగిలినందుకు హర్షించాలి.
– టంకశాల అశోక్