కాకతీయ వంశ ప్రతిష్ఠను కాపాడటంలో, రాజ్య సంరక్షణలో చివరి వరకు పోరాడిన యోధు డు, ఓరుగల్లు కాకతీయ సామ్రాజ్య చివరి చక్రవర్తి ప్రతాప రుద్రుడు. ఇతడి పాలనలో కాకతీయ సామ్రాజ్యం పతనమైనప్పటికీ, ఆక్రమణదారులకు లొంగక ప్రతాపరుద్రుడు తన ప్రాణాలను స్వయంగా తీసుకున్నాడనే కథ ప్రచారంలో ఉన్నది. ఇతడి కాలంలో జరిగిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, దానధర్మాలు చాలావరకు శాసనస్థం చేశారు. అందులో ఒకటి పెద్దపల్లి జిల్లాలోని యెల్గేడు (ఎలిగేడు) శాసనం. ఇది ఎలిగేడు మండలంలో ఉన్నది. శాసన కాలం ప్లవ సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి – క్రీ.శ.1301, జూన్ 27.
శ్రీమన్మహామండలేశ్వర కాకతీయ ప్రతాపరుద్ర మహారాజు రాజ్యం చేయుచుండగా వారి ధర్మపత్ని లక్మా దేవమ్మ తమ తండ్రి పాలేవ నాయినిం గారికి పుణ్యంగా శ్రీ రామనాథ దేవునికి కొన్ని వృత్తులు సమర్పించి శాసనం వేయించారు. స్థానిక సుంకాలైన పన్ను, కానిక, కట్నము, పాడి పశువులకు సంబంధించిన పుల్లరి పన్నులను మినహాయించి వాటిని ఆమెనే దేవునికి వృత్తులుగా సమర్పించారు.
ప్రతాపరుద్రుని భార్య పేరు లక్మాదేవమ్మ అని ఈ శాసనం ద్వారా మనకు తెలుస్తున్నది. అంతేగాక ఒక మహారాణి అయినా ఆడపిల్లగా తండ్రికి పుణ్యంగా రాజ్యంలో ఒక దేవాలయానికి ఆ గ్రామంలో చెల్లించే పన్నులను ఆమెనే స్వయంగా సమర్పించడమన్నది ఆమె స్వభావాన్ని, మంచితనాన్ని తెలియజేస్తున్నది.రుద్రమదేవి వంటి మహారాణి ఆ పని చేస్తే అది రాజ్యపాలనా వ్యవహారంలో భాగం గా చేయవచ్చు. కానీ, మహారాజు భార్య చేయడమనేది గొప్ప విషయం.
-భిన్నూరి మనోహరి