Telangana | సాహిత్యంలో ‘తెలుగు’ పేరుతో ‘ఆంధ్రా’ ఆధిపత్యం ఇకపై చెల్లదు! తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసమే కాదు, భాషా, సాహిత్యరంగాల్లో ఆంధ్రాధిపత్యం, వివక్షకు వ్యతిరేకంగా కూడా జరిగింది. సంస్కృతి పరిరక్షణ కోసం, అన్నిరంగాల్లో హక్కుగా దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం ఈ పోరాటం సాగింది.
60 ఏండ్ల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. అయినా ఇప్పటికీ ‘తెలుగు భాష’, ‘తెలుగుదనం’, ‘తెలుగు సంస్కృతి’,
‘ఉమ్మడి వారసత్వం’ ఇలా పలు పేర్లతో ఆంధ్రాధిపత్యం, పెత్తనం, దాష్ఠీకం, వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర సాహిత్య అకాడమీ
కమిటీల నియామకాల్లోనూ, నిర్వహణలోనూ, తెలుగులో రాసే సాహిత్యకారులకు ఇచ్చే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల్లోనూ, ఆంధ్రా
సాహిత్యకారులు ‘తెలుగు’ పేరిట వెలువరించే సంకలనాల్లోనూ, నిర్వహించే రైటర్స్ మీట్లు, లిటరరీ ఫెస్టివల్స్, సంస్థల సభలు, కళాశాలల
సదస్సులు, సమావేశాల్లోనూ, కొన్ని ప్రచురణా సంస్థలు ముద్రించే పుస్తకాల విషయంలోనూ ఈ వివక్ష ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది.
తెలుగు పత్రికల్లోని సాహిత్యపేజీల్లో అచ్చయ్యే కవిత్వం, విమర్శ, పరామర్శ, పరిచయాలు, సమీక్షలు అన్నీ కూడా ఒక ప్రాంతానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి మరొక ప్రాంతానికి కనీస ప్రాతినిధ్యాన్ని నిరాకరిస్తున్నాయి. ఒక పద్ధతి ప్రకారం తెలంగాణవారిని, వారి ప్రతిభను ద్వితీయ శ్రేణిదిగా నిర్ధారిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఆత్మగౌరవ నినాదం ప్రధానమైంది. 90 ఏండ్ల కింద ‘తెలంగాణలో కవులు పూజ్యం’ అని విమర్శ వస్తే, ‘తెలంగాణలో కవులు పూజ్యం కాదు. పూజనీయులు’ అని సురవరం ప్రతాపరెడ్డి ‘గోలకొండ కవుల సంచిక’ను 369 కవులతో వెలువరించారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలంగాణ ఉద్యమ సందర్భంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారు ఇబ్బడిముబ్బడిగా సాహితీ సృజన చేసిండ్రు. లెక్కకు మించి సంకలనాలు వెలువరించిండ్రు. ప్రపంచంలో మరే ఉద్యమంలో రానన్ని పాటలు, కవితలు, విమర్శలు, వ్యాసాలు, చారిత్రక వ్యాసాలు ఈ ఉద్యమ సందర్భంగా వచ్చాయి. అయినా ఆంధ్రాధిపత్యం తమ వివక్షాపూరిత దృష్టితో ఈ సాహిత్యానికి విలువ కట్టడానికి నిరాకరించింది.
అయితే మొన్నటి జూన్ 2 (2024) వరకు అధికారికంగా హైదరాబాద్ నగరం ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ర్టాలకు ఉమ్మడి రాజధానిగా ఉండింది. దానివల్ల తెలంగాణవాదులు తమ హక్కులను గట్టిగా చాటిచెప్పడానికి కొంత ప్రతిబంధకాలుండేవి. అదే సమయంలో ఆంధ్రాధిపత్యం, లాబీయింగ్ విస్తరించింది. ఈ ఆధిపత్యం నిత్యం రెండింతలవుతున్నందుకే మరోసారి నీళ్లు, నిధు లు, నియామకాల మాదిరిగానే ‘సాహిత్యం’లోనూ సమానమైన వాటా దక్కాలని నినదిస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్ కేవలం తెలంగాణ ప్రజల ఆస్తి. ఇక్కడ జరిగే ప్రతి ప్రభుత్వ సాహిత్య కార్యక్రమాల్లో పూర్తిగా తెలంగాణవారికే ప్రాతినిధ్యం ఉం డాలి. ఆంధ్రా ప్రాంతంలో ఎక్కడ సభలు నిర్వహించినా కేవలం ఆ ప్రాంతం వారినే కేంద్ర సాహిత్య అకాడమీ అతిథులుగా, వక్తలుగా అవకాశం కల్పిస్తున్నది. హైదరాబాద్లో సభలు జరిపినా అదే ఆంధ్రావారినే ప్రధానంగా ఆహ్వానిస్తున్నారు. దీనివల్ల అక్కడా, ఇక్కడా.. రెండు ప్రాంతాల్లోనూ ఆంధ్రావారి పెత్తనమే సాగుతున్నది.
కేంద్ర సాహిత్య అకాడమీ ఇచ్చే అవార్డుల్లోనూ ఇదే వివక్ష కొనసాగుతున్నది. 2014 నుంచి 2023 వరకు మొత్తం 11 మందికి తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటిస్తే అందులో నిఖిలేశ్వర్, గోరటి వెంకన్న మాత్రమే తెలంగాణవాళ్లు. మిగతా 9 మంది ఆంధ్రా, రాయలసీమవాళ్లే. అంటే తెలుగు పేరిట తెలంగాణవారిని ఎలాంటి దగా చేస్తున్నారో అర్థమవుతున్నది.
‘కవి సంధి’లో కూడా ఇలాంటి వివక్షే జరుగుతున్నది. అకాడమీ నిర్వహించే అన్ని సభలు ఇట్లాగే మిగులుతున్నాయి. అవార్డుల గురించి గట్టిగా నిలదీస్తే ఇది ‘తెలుగు’ సాహిత్యంలో ప్రతిభ చూపించేవారికి ఇస్తారని చెప్తున్నారు. పరోక్షంగా తెలంగాణలో అవార్డుకు యోగ్యులైన సాహితీవేత్తలు లేరని తేల్చిచెప్తున్నారు.
‘తెలుగు కథలు’, ‘కవిత్వం’, ‘యువ కథకులు’ (విమర్శ) పేరిట ఆంధ్రా సాహిత్యానికి పెద్దపీట వేస్తున్నారు. తద్వారా తెలంగాణలో సాహిత్యం లేదని సంకేతిస్తున్నారు. వాళ్ల సంకలనాలు వాళ్లిష్టమొచ్చినట్లు వేసుకోవచ్చు, అభ్యంతరమేమీ లేదు. కాకపోతే ఆ సాహిత్యాన్ని ‘తెలుగు’ పేరిట కాకుండా ‘ఆంధ్రా’ పేరుతో వేసుకున్నట్టయితే సంతోషం. అట్లా కాకుండా ఏ ఒక్కరో, ఇద్దరో తెలంగాణవారికి ప్రాతినిధ్యం కల్పించి అది మొత్తం తెలుగువారి ప్రాతినిధ్య సంకలనం, సభ, ఫెస్టివల్, అవార్డు అంటే ఇకముందు చెల్లదు. మేము ఈ నిర్ణయం తీసుకోవడానికి గత పదేండ్ల అనుభవాలు నేర్పిన గుణపాఠాలే కారణం. కుట్రలు, మోసాలు, అన్యాయాలను ఎన్నో ఎదుర్కొన్నాం. ఆంధ్రా ప్రాంతానికి చెందిన సాహితీ లబ్ధప్రతిష్టులు ఒక పథకం ప్రకారం తమ వారికి మాత్రమే ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. అది సంకలనాల కూర్పులో కావొచ్చు, విమర్శ పేరిట వెలువరించే వ్యాస సంపుటాలు కావొచ్చు, అవార్డులు కావొచ్చు, సభలు, సదస్సులు, లిటరరీ మీట్స్, ఫెస్టివల్స్ కావొచ్చు, ప్రచురణలు కావచ్చు. వీటిలో వేటిలోనూ తెలంగాణవారికి న్యాయమైన ప్రాతినిధ్యం లేకుండా, అసలు తెలంగాణలో సాహితీవేత్తలే లేరనే అభిప్రాయం పాదులూనుకునేలా వ్యవహరిస్తున్నారు. అందుకే ఈ ధిక్కారం.
మీది ఆంధ్రా సాహిత్యం. మీరు ఆంధ్రా సాహిత్య చరిత్ర నిర్మించుకుంటున్నారు. సంతోషం. మీ సాహిత్యం క్యారెక్టర్ వేరు, నేచర్ వేరు, ఫంక్షన్ వేరు, బిహేవియర్ వేరు, లక్ష్యం వేరు. కాబట్టి, మీరు వేరు, మేం వేరు. మా సాహిత్యం మాది. మా ఆత్మగౌరవం మాది. ఇప్పటికే చాలాసార్లు చెప్పాం. అయినా, మేం ఇలాగే చేస్తామంటూ సిగ్గు విడిచి అవే పనులు పదేపదే చేస్తున్నారు. కాబట్టి, మీ కథలు, కవిత్వాన్ని ‘ఆంధ్రా’ పేరిట అచ్చేసుకుంటే మాకేం అభ్యంతరం ఉండదు. ఇదొక్కటే ఆంధ్రాధిపత్యాన్ని నిలువరించగలదని విశ్వసిస్తున్నాం. రాష్ర్టాలు విడిపోయిన పదేండ్ల తర్వాత ఒక విస్పష్ట ప్రకటన చేస్తున్నాం. ఎందులోనైనా ఆంధ్రా రిప్రజెంటేషన్, తెలంగాణ రిప్రజెంటేషన్ విడిగా ఉండాలి. కాబట్టి ప్రభుత్వాలకు, సంస్థలకు, కేంద్ర సాహిత్య అకాడమీ వారికి చెప్పేదేమంటే తెలుగు అనే భాషా ప్రాతిపదికన కాకుండా రాష్ర్టాల ప్రాతిపదికన రిప్రజెంటేషన్ ఇవ్వండి. తెలుగు సాహిత్యం అనే చర్చ పెట్టినా.. తెలంగాణ సాహిత్యం, ఆంధ్రా సాహిత్యం వేరుగా పెట్టవలసిందే. ఎందుకంటే అవి వేర్వేరు కాబట్టి. తెలంగాణకు ప్రత్యేకంగా ఆహ్వానం ఉండాల్సిందే.
అట్లాగే కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు కన్వీనర్లు ఒకసారి ఆంధ్రావారుంటే, మరోసారి తెలంగాణవారుండాలి. రొటేషన్ పద్ధతిలో మారాలి. అంతేకాకుండా అవార్డులు సైతం ఒక సంవత్సరం తెలంగాణవారికిస్తే, మరుసటి సంవత్సరం ఆంధ్రా/ రాయలసీమ వారికివ్వాలి.
కేంద్ర ప్రభుత్వం తెలుగు వారందరికీ కలిపి ఏర్పాటుచేసిన ‘ప్రాచీన తెలుగు విశిష్ఠ అధ్యయన కేంద్రం’ కార్యక్రమాల్లో తెలంగాణ ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉంటున్నది. తగిన ప్రాతినిధ్యం ఉండాలి. అసలు తెలంగాణ సాహిత్య ప్రాచీనత వల్లే తెలుగుకు ప్రాచీన హోదా లభించిందన్న విషయం గుర్తుంచుకోవాలి.
తెలంగాణలో ఉన్న వాగ్గేయకారులు, చిందు, డక్కలి, బైండ్ల తదితర కళలు వేరు. గొప్పవైన ఈ కళారూపాలను కూడా సాహిత్యంలో భాగంగా చూడాలి. ఆ కళల్లోనే బతుకుతున్న ఆ ఫోక్ ఆర్టిస్టులను గుర్తించి వారిని గౌరవించుకోవడం, వారికి డయాస్ ఇవ్వడం, అతిథులుగా పిలవడం ఆంధ్రావారి వల్ల కాదు. అది తెలంగాణవారు మాత్రమే చేసుకోగలరు. కాబట్టి ‘తెలుగు’ పేరిట మొత్తంగా కొనసాగుతున్న ఆంధ్రాధిపత్యానికి ఇక తెరదించాల్సిందే! ఇప్పటినుంచి మా ప్రాతినిధ్యాన్ని లాక్కుంటే సహించేది లేదు. ‘ఇక మీది మీదే! మాది మాదే!!’ ఇక మీ సభలు, మీ కార్యక్రమాలు కావాలంటే ఆంధ్రాలో చేసుకోండి. ఇక చాలు మీరు చేసిన నిర్వాకం. మా సాహిత్యం మేం ప్రచురించుకుంటాం. మా సభలు మేం చేసుకుంటాం. ఇక చాలని తేల్చిచెప్తున్నాం.
సోదరభావం ఉంటే గింటే మా రచయితలను మీరు, మీ రచయితలను మేం అతిథులుగా పిలుచుకుందాం. దానికెవరూ అడ్డు చెప్పరు. ఈ వివక్షలకు, ఆధిపత్య పోకడలకు వ్యతిరేకంగా నిరసనలు జరిగేదాకా లాగవద్దని కోరుతున్నాం.
– డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, వఝల శివకుమార్, డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, దేశపతి శ్రీనివాస్, జూలూరి గౌరీశంకర్, అఫ్సర్, అన్నవరం దేవేందర్, డాక్టర్ జిలుకర శ్రీనివాస్, స్కైబాబ, డాక్టర్ పసునూరి రవీందర్, డాక్టర్ నాళేశ్వరం శంకరం, పెద్దింటి అశోక్కుమార్, డాక్టర్ ఉదారి నారాయణ, ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి, అన్వర్, దాసోజు లలిత, గుడిపల్లి నిరంజన్, కుంజ కళ్యాణి, బిల్లా మహేందర్, పొట్లపల్లి శ్రీనివాసరావు, వనపట్ల సుబ్బయ్య, నరేష్కుమార్ సూఫీ, తైదల అంజయ్య, గాజోజు నాగభూషణం, కూకట్ల తిరుపతి, డాక్టర్ పొన్నాల బాలయ్య, బూర్ల వెంకటేశ్వర్లు, విలాసాగరం రవీందర్, కందుకూరి శ్రీరాములు, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, వేముగంటి మురళి, దాసోజు కృష్ణమాచారి, ఘనపురం దేవేందర్, రేడియం, కాంచనపల్లి గోవర్ధన్ రాజు, పెనుగొండ బసవేశ్వర్, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, ఎదిరెపల్లి కాశన్న, అవనిశ్రీ, నాగవరం బాల్రాం, బైరెడ్డి కృష్ణారెడ్డి, అంబటి వెంకన్న, డాక్టర్ గాదె వెంకటేష్, డాక్టర్ కటుకోజ్వల రమేష్, రూపా రుక్మిణి, తోకల రాజేశం, బోల యాదయ్య, మోత్కూ రు శ్రీనివాస్, గోవింద్ గోవర్ధన్, విఠలాపురం పుష్పలత, పెరుమాండ్ల రాము, డాక్టర్ వెల్దండి శ్రీధర్, శ్రీశైల్రెడ్డి పంజుగుల, తం డు కృష్ణ కౌండిన్య, పరిమళ్, ఒద్దిరాజు ప్రవీణ్కుమార్, వి.శంకర్, దాస్యం సేనాపతి, తూర్పు మల్లారెడ్డి, రాజు దుర్గాని, జి.ఎన్.స్వామి, మద్దెర్ల రమేష్, గండ్ర లక్ష్మణరావు, కె.వీరయ్య.