2020, సెప్టెంబర్.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అత్యవసరంగా ఆమోదించబడిన మూడు వివాదాస్పద వ్యవసాయ బిల్లులు రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ చట్టాలు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, రైతుల జీవితాల్లో గుణాత్మక మార్పు తెచ్చేవిగా, దేశ ఆర్థికవ్యవస్థ, వ్యవసాయ రంగంలో అతి గొప్ప సంస్కరణగా నాడు ప్రకటించిన కేంద్రం, ఇప్పుడు ఆ బిల్లులు రద్దు చేస్తామని చెప్పడం యావత్ దేశ ప్రజలను ఆశ్చర్యచకితులను చేస్తున్నది.
వ్యవసాయ మార్కెట్ల వ్యవస్థ బలంగా ఉన్న పంజాబ్, హర్యానా, యూపీ రాష్ర్టాల్లోని రైతులు ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్లో అత్యవసర ఆర్డినెన్స్ ద్వారా ఆమోదించిన వ్యవసాయ బిల్లులను, చట్టాలుగా ఆమోదిస్తూ జూన్లో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. అయితే జనవరిలో ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ మూడు వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నర కాలం పాటు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిం ది. చట్టాల అమలు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం నలుగురు నిపుణులతో కమిటీ వేసింది. ఈ చట్టాలు అమలులో ఉన్న కాలం 221 రోజులే. దేశంలో 80 శాతం పైగా ఉన్న సన్నకారు రైతుల ప్రయోజనాలను కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టజూసిన కేంద్రం ఇప్పుడు వెనుకడుగు వేయడాన్ని రైతుల విజయంగా చెప్పుకోవచ్చు.
అధికారాల విభజనకు సంబంధించి రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగబద్ధమైన అధికారాల గురించి వివరాలు స్పష్టంగా ఉన్నాయి. వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాలోని అంశం కాబట్టి కేంద్రం చేసిన చట్టాలు చెల్లవని కేరళ, పంజాబ్ రాష్ర్టాలు ఆయా రాష్ర్టాల శాసనసభల్లో వ్యతిరేకిస్తూ తీర్మానం చేశాయి. అప్పటిదాకా ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి అయిన అకాలీదళ్ కూడా ప్రభుత్వం నుంచి తప్పుకున్నది. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాల విభజనలో భాగంగా రాజ్యాంగం ఇచ్చిన ఉమ్మడి జాబితాలో ఎంట్రీ నెంబర్ 33ను ఉపయోగించి ఆహార పరిశ్రమ, ఆహార ఉత్పత్తుల, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల పేరుతో వ్యవసాయ చట్టాలను చేసి సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడిచింది కేంద్రం. వాస్తవానికి రాష్ర్టాల జాబితాలో ఉన్న ఎంట్రీ నెంబర్ 28 రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యవసాయ సంబంధ పరిశ్రమలు స్థాపించే, వాటి పరిపాలన బాధ్యతలు చూసే అవకాశం కల్పిస్తుంది. అంటే కేంద్రం చేసిన మూడు వ్యవసాయ చట్టాలు నేరుగా రాష్ర్టాల జాబితా మీద, రాష్ర్టాల రాజ్యాంగ హక్కుల మీద దాడి చేసినట్లుగా మనం భావించాలి.
ఈ మూడు వ్యవసాయ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టిన నాటినుంచి రద్దు చేసేవరకూ అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవిగా, చిన్న రైతుల జీవితాల్లో వెలుగులు తెచ్చేవిగా పేర్కొంటూ వచ్చిన కేంద్రం ఉన్నపళంగా చట్టాలను రద్దుచేసే ఆలోచనను ప్రకటించడం ఎన్నో సందేహాలకు దారితీస్తుంది. ఈ వ్యవసాయ చట్టాలను స్థానిక మార్కెట్ వ్యవస్థ బలంగా ఉన్న పంజాబ్, హర్యానా, యూపీ రాష్ర్టాల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. రాబోయే యూపీ, పంజాబ్ రాష్ర్టాల శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అక్కడి రైతాంగాన్ని ఆకర్షించే పనిలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఒకరకమైన వ్యూహా న్ని ముందుకు తీసుకువచ్చిందనేది విశ్లేషకుల అభిప్రా యం. ఏదేమైనా వ్యవసాయ చట్టాలను పార్లమెంట్లో రద్దుచేసే వరకు, కనీస మద్దతు ధరకు రాజ్యాంగబద్ధమైన హామీ ఇచ్చేవరకు తమ ఆందోళనను విరమించుకోమని రైతు ఉద్యమ నాయకత్వం స్పష్టం చేస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం మాట మీద నిలబడుతుందా లేదా అనేది చూడాలి.
పిల్లుట్ల నాగఫణి
(వ్యాసకర్త: అజీమ్ ప్రేమ్ జీ విశ్వవిద్యాలయం, బెంగళూరు)