‘పాలకులకు సత్యనిష్ఠ మినహా మరేదీ ప్రజా విశ్వాసాన్ని సంపాదించలేదు’ అని అన్నారు భీష్ముడు. ఇది సార్వత్రిక సత్యం. కానీ, ‘పొద్దున విత్తునాటి, రాత్రికి పండు కోసుకోవాలనే’ అత్యాశాపరులైన నేతలు, ఆధునిక భారతంలో అడ్డదారిని సృష్టించారు. ‘గంగానదిని మురికి కాలువగా, మురికి కాలువను గంగానదిగా భ్రమింపజేయగలిగిన మీడియా, సోషల్ మీడియాల అండతో, అభాండాల ఉపన్యాసాలతో పనిచేసే ప్రభుత్వాలను పడగొట్టి, అధికారానికి రావచ్చని, వచ్చాక పని చేయకుండానే ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకోవచ్చని నిరూపించారు.
అలాంటి నేతలలో నరేంద్ర మోదీ, రేవంత్రెడ్డి అగ్రగణ్యులని, వారిలోనూ రేవంత్ ప్రథముడని అంటున్నారు. ‘పార్టీ మారటం, మారగానే ఆ పార్టీ రాష్ర్టాధ్యక్షుడు కావటం, అయిన కొద్దికాలానికే మంత్రిగా అనుభవం కూడా లేకపోయినా చిన్న వయసులోనే ముఖ్యమంత్రి కావటమే అందుకు నిదర్శనమంటున్నారు పరిశీలకులు. అందుకోసం అబద్ధాల సోషల్ మీడియాను, అభాండాల నోటిని రేవంత్రెడ్డి వాడినంత సమర్థవంతంగా మోదీ తప్ప దేశంలో మరే నేతా వాడలేదనటానికి గత అసెంబ్లీ ఎన్నికలే సాక్ష్యం అంటున్నారు.
అభాండాల ఉపన్యాసాలు: తెలంగాణను సాధించి, దశాబ్దికాలంలో భారతాగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దిన బీఆర్ఎస్ను అవినీతి పార్టీగా, తెలంగాణ పిత కేసీఆర్ను నియంతగా అబద్ధాల సోషల్ మీడియా అండదండలతో భ్రమింపజేయగలిగారు. అసాధ్యాలు అని తెలిసి కూడా అలవోకగా హామీలిచ్చేశారు. ఉదాహరణకు.. ‘కేసీఆర్ మీ రుణాలు మాఫీ చేసినా సరే, ఇప్పటికిప్పుడు బ్యాంకులకెళ్లి 2 లక్షల రూపాయల రుణం తీసుకోండి. డిసెంబర్ 9 కల్లా వాటిని రద్దు చేస్తా. నన్ను గెలిపించండి’ అంటూ తెలంగాణ ప్రజలను ఆశామోహంలో ముంచేశారు. దటీజ్ రేవంత్రెడ్డి.
ఇక ఉత్తర భారతాన విస్తరిస్తున్న ‘కేజ్రీవాల్’ను దక్షిణ భారతాన నిర్దిష్ట ప్రణాళికతో తనకు సవాలు విరుసుతున్న కేసీఆర్ను దెబ్బ తీసేందుకు కాచుకుకూర్చున్న నరేంద్ర మోదీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి వ్యూహాలు పన్నారు. రేవంత్ను మించి దుందుడుకు బండి సంజయ్ నాయకత్వంలో థర్డ్ ఫోర్స్గా దూసుకొచ్చింది బీజేపీ. ఆ దూకుడుతో ఎన్నికలకు వెళ్తే ముక్కోణపు పోటీగా మారుతుంది. కేసీఆర్ విజేత అవుతారు. అందుకని బండి సంజయ్ను తప్పించి, కిషన్రెడ్డి చేతికి పార్టీ పగ్గాలు అప్పగించారు. ఆ సమయంలో కవితను అరెస్టు చేస్తే, బీఆర్ఎస్కు సింపతీ పెరుగుతుందని వెనక్కు తగ్గారు. తద్వారా ‘బీజేపీకి బీ టీమ్ బీఆర్ఎస్’ అన్న కాంగ్రెస్ దుష్ప్రచారానికి బలం చేకూర్చి, బీఆర్ఎస్కు దన్నుగా ఉన్న ముస్లిం, దళిత ఓటర్లను కొంత మేరకు కాంగ్రెస్కు బదిలీ చేయించగలిగారు. అలా 1.8 శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్ను గెలిపించి, కేసీఆర్ను దెబ్బతీశారు. దటీజ్ నరేంద్ర మోదీ.
రేవంత్రెడ్డి కూడా రాహుల్ గాంధీ నిరసిస్తున్నా సరే, మోదీ అనుంగు మిత్రుడు ఆదానీకి తెలంగాణలో చోటిచ్చారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ముఖ్య అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ తరపున బలహీన అభ్యర్థులను నిలిపి మోదీ రుణాన్ని రేవంత్రెడ్డి తీర్చుకున్నారని పరిశీలకులు చెప్తున్నారు. అలా మోదీ వ్యూహంలో, రేవంత్ భ్రమల్లో, వారిద్దరి క్విడ్ ప్రో కోలో తెలంగాణ ప్రజలు చిక్కుకోవటం వల్లనే పదేండ్ల కిందటి సాగు, తాగునీటి కరువు, చెరువులు, బోర్లు ఒట్టి పోవటం, విద్యుత్తు కోతలు, ట్రాన్స్ఫార్మర్లు కాలటం, పంటలు ఎండిపోవడం, అన్నదాతల ఆత్మహత్యలు వగైరా సమస్యలన్నీ తిరిగి తెలంగాణను చుట్టుముట్టాయి.
అందుకే తెలంగాణ సహోదరులారా, కర్షక , కార్మిక, విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ, మేధావులారా, కవులు కళాకారులారా.. అబద్ధాల, అభాండాల సోషల్ మీడియా ప్రవాహంలో కొట్టుకుపోకండి. దయచేసి మీ సొంత బుద్ధిని శరణు వేడండి. ప్రజలను మేల్కొల్పండి. వాగ్దాన కర్ణులు మోదీ, రేవంత్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
రేవంత్రెడ్డి లాంటి నాయకులు తమ అవసరాల కోసం ఎన్ని హామీలనైనా గుప్పిస్తారు. అవసరం తీరాక అంబాలీస్ అంటారు. ఆ మేరకే నష్టం. కానీ, మోదీ అలా కాదు, ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా, తద్భిన్నంగా వ్యవహరిస్తారు. ఉదాహరణకు తాము అధికారానికి వచ్చాక ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ, అందుకు భిన్నంగా ఏటా రెండు కోట్ల నిరుద్యోగులను సృష్టించారు. అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పి.. వ్యవసాయ ఖర్చులను రెట్టింపు చేశారు. విదేశాల్లోని నల్లధనాన్ని రప్పించి, ప్రతి భారతీయుని ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానన్నారు. కానీ, ఎన్నికల బాండ్ల రూపంలో వేల కోట్ల నల్లధనాన్ని బీజేపీ ఖాతాలో వేయించారు. ఆరు దశాబ్దాల పాలనలో రూ.55 లక్షల కోట్ల అప్పుల కుప్పగా దేశాన్ని కాంగ్రెస్ మార్చిందని, తాను భారత్ను సుసంపన్నం చేశానని చెప్పుకొనే మోదీ.. కేవలం దశాబ్ద కాలంలో రూ.155 లక్షల కోట్ల అప్పుల కొండగా దేశాన్ని దిగజార్చారు. డాలర్కు 63 రూపాయలుగా రూపాయి విలువను కాంగ్రెస్ చేసిందని, పాలకునిగా రూపాయి విలువను పెంచటమెలాగో తనకు తెలుసని మోదీ ప్రకటించారు. కానీ, ఆయన డాలరుకు 83 రూపాయలకు చేర్చి రూపాయి విలువను పాతాళానికి పడేశారు. భారతీయులకు అచ్చేదిన్ తెస్తానన్న మోదీ.. లక్షల కోట్ల రుణమాఫీ, పన్ను రాయితీల ద్వారా బడా కార్పొరేట్లకు అచ్చేదిన్ తెచ్చిన మాట వాస్తవం.
ఆ లోటు పూడ్చడానికి ఇంధన ధరలను భారీగా పెంచి, పాలు, పెరుగుతో సహా నిత్యావసరాలపై జీఎస్టీ బాది ధరలను చుక్కలకు తాకించి బడుగు, బలహీన, నిరుద్యోగ వర్గాలకు చచ్చేదిన్ తెచ్చారు. అందుకే ఉద్యోగ, ఉపాధి లేమితో భారత్లో బతకలేక చచ్చే కన్నా, బతకటం కోసం చావటానికి సిద్ధపడి నిత్యాగ్ని గుండాల వంటి గాజా, ఉక్రెయిన్లకు సైనికులు, కూలీలుగా భారతీయులు వలస వెళ్తున్నారు. నిరుద్యోగ తీవ్రతకు ఇంతకన్నా నిదర్శనమేం కావాలి. ప్రపంచం తలెత్తుకు చూసేంత సమున్నతంగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతానని మోదీ హామీ ఇచ్చారు. పరిశ్రమలు చైనా వీడి భారత్కు వచ్చేలా పటిష్ఠం చేస్తానన్నారు. కానీ వాస్తవం ఏమంటే.. చైనా వార్షిక ఆదాయం 16.5 ట్రిలియన్ డాలర్లు. భారత వార్షికాదాయం 3 ట్రిలియన్ డాలర్లు. యాపిల్ కంపెనీ వార్షిక ఆదాయం 3.1 ట్రిలియన్ డాలర్లు. అంటే ఒక కంపెనీ ఆదాయం కన్నా మన దేశ ఆదాయం తక్కువ. అంతేకాదు పర్యావరణం, ప్రజాస్వామ్యం, పత్రికాస్వేచ్ఛ, మానవ వనరుల అభివృద్ధి, ఆకలి సూచీ తదితర అన్ని రంగాల్లోనూ ప్రపంచం తలదించుకొని తొంగిచూసేంత కిందికి భారతదేశాన్ని నెట్టేశారు మోదీ. ఐరాసతో సహా ప్రపంచ సర్వే సంస్థలు ప్రకటించిన వాస్తవాలివి.
‘హిందువులను ఉద్ధరించే పార్టీ’ బీజేపీ అన్న భ్రమలో హిందువులను ముంచేశారు మోదీ. వాస్తవానికి మోదీ, బీజేపీ పాలనలో హిందువులు నష్టపోయినంతగా మరే ప్రభుత్వంలోనూ నష్టపోలేదని గణాంకాలతో సహా వివరిస్తున్నారు పరిశీలకులు. వ్యవసాయాన్ని కార్పొరేటీకరించేందుకు మోదీ తెచ్చిన నల్ల వ్యవసాయ చట్టాల వల్ల, స్వామినాథన్ వంటి వ్యవసాయ పరిశోధకులు సూచించినట్టు పంటలకు గిట్టుబాటు ధరలను చట్టబద్ధం చేయనందున, డీజిల్ ధరలు భారీగా పెంచినందున వ్యవసాయ ఖర్చులు రెట్టింపు అయ్యి, నష్టాలకు గురై అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పెద్ద నోట్ల రద్దు వల్ల లక్షలాది చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, చిన్నచిన్న వ్యాపారాలు మూతబడి ఉపాధి కోల్పోయారు. కొత్తగా ఒక్క ప్రభుత్వరంగ సంస్థను నెలకొల్పకపోగా, ఉన్న ప్రభుత్వ సంస్థలను తెగనమ్ముతున్న భారతైక ప్రధాని నరేంద్ర మోదీ. ఆ కారణంగా ఉద్యోగాలు కోల్పోయి, కొత్త ఉద్యోగాల సృష్టి లేకపోవడంతో అనేకమంది నిరుద్యోగులుగా మిగిలారు. వీరిలో 80 శాతం మంది హరిజన, గిరిజన, బీసీ, ఓబీసీ వర్గాలకు చెందిన హిందువులేనన్నది స్పష్టం.
అవినీతి నిర్మూలనే తమ లక్ష్యం అంటూ గొప్పలు చెప్పుకొంటున్న మోదీ ‘ఈడీ, ఐటీ, సీబీఐ’ త్రిశూలంతో వేట ప్రారంభించిన మాట నిజమే. కానీ, తీరా చూస్తే.. అవినీతి నిర్మూలనకు కాదు, ప్రతిపక్షాలను బెదిరించి లొంగదీసుకోవటానికేనని కేసుల గణాంకాలే స్పష్టీకరిస్తున్నాయి. ఉదాహరణకు మోదీ త్రిశూలపు వేటలో పీఎంఎల్ఏ మొదలగు చట్టాల కింద బనాయించిన కేసులు 5,422. వీటిలో రుజువైనవి కేవలం 25. ఈ కేసుల్లో బీజేపీయేతర పార్టీల వారిపై పెట్టిన కేసులు 5,150. ఈ కేసులకు బెదిరి బీజేపీ కండువా కప్పుకొన్నవారు 2,987 మంది అని పరిశీలకులు తేల్చారు.
మాంత్రికుడు తన మంత్రదండాన్ని తాకించగానే వ్యక్తిని ఆవహించిన భూత, ప్రేత, పిశాచాలన్నీ పటాపంచలైనట్టు.. బీజేపీ కండువా కప్పుకోగానే ఎంత పెద్ద అవినీతి మరకైనా ఇట్టే మాయమవుతుంది. ఉదాహరణకు రూ.7 వేల కోట్ల అవినీతి మరక అంటిన సీఎం రమేశ్ మొదలు రూ.70 వేల కోట్ల అవినీతి మరక అంటిన గాలి జనార్ధన్రెడ్డి దాకా 25 మంది కాషాయ కండువా కప్పుకొని తమ మరకల్ని పూర్తిగా చెరిపేసుకున్నారు. అంతేకాదు, హిమంత బిశ్వశర్మ, ఏక్నాథ్ షిండే తదితరులు బీజేపీ, కూటమి ముఖ్యమంత్రులుగా, అజిత్ పవార్ లాంటివారు ఉప ముఖ్యమంత్రులుగా, సుజనా చౌదరి మొదలైనవారు ఎంపీలుగా వెలిగిపోతున్నారు. పాపం! ఈ చిన్న లాజిక్కును తెల్సుకోలేక విజయ్ మాల్యా, నీరవ్ మోదీ తదితరులు విదేశాలకు పారిపోయి, తమ అవినీతి మరకలను తొలగించుకోలేకపోతున్నారు.
తెలంగాణ సహోదరులారా, మేధావులారా ఇప్పటికైనా ఆలోచించండి. ఇప్పటికీ నిరూపణ కాని రూ.100 కోట్ల అవినీతి ఆరోపణలతో కేజ్రీవాల్, కవిత తదితరులను మోదీ వేధించటం వెనుక ఆంతర్యమేమిటో దయచేసి మీ సొంత బుద్ధితో ఆలోచించండి. బుద్ధ భగవానుడు చెప్పినట్టు.. ‘బద్ధం శరణం గచ్ఛామి’. అబద్ధాల మీడియా, సోషల్ మీడియాలను కాదు, మీ సొంత బుద్ధిని నమ్మండి.