పక్కనే కృష్ణమ్మ పరుగులు తీస్తున్నా కరవు కాటకాలతో సతమతమయ్యే పాలమూరు జిల్లా కష్టాలు తీరే రోజులు వచ్చాయి. పాలమూరు జిల్లావాసుల దశాబ్దాల కల సాకారం కానుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఫలితాలు ఇప్పుడు ప్రజలందరికీ అందనున్నాయి. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు అనేక అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ప్రభుత్వం పట్టువిడవకుండా ఈఏసీ కోరిన విధంగా సమగ్రంగా ప్రాజెక్టు వివరాలను సమర్పించింది. దీంతో ఎట్టకేలకు అడ్డంకులన్నీ తొలగిపోయి ప్రాజెక్టు పూర్తయింది.
ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఈ జిల్లాకు సాగునీరు అందించడంలో నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు బతుకు దెరువు కోసం వలస బాట పట్టారు. దీంతో భూములు బీడు పడ్డాయి. వారు అవలంబించిన విధానాల వల్ల భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చలేదు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మనకు దక్కాల్సిన న్యాయమైన నీటి వాటాను ఒడిసి పట్టుకోవాల్సిందేనని, అందు కు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల సహా కృష్ణా నది మీద ఉన్న అన్ని పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ముందుచూపుతో మూడు నెలల్లోనే సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించి పాలమూరు-రంగారెడ్డి నిర్మాణానికి అనుమతి సాధించారు.
తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు 2005లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసి ఇచ్చిన నివేదికను అప్పటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. 2009 ఎన్నికల ముందు ప్రాజెక్టు సర్వేల గురించి జీవో ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత అనేక సాకులు చెప్పి ముఖం చాటేసింది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తుంగభద్రపై గండ్రేవుల జలాశయంతో పాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సర్వే నిమిత్తం 2013 ఆగస్టులో జీవో ఇచ్చినా తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు టెండర్ల ప్రక్రి య పూర్తి కాకుండా అడ్డుకున్నది. పాలమూరు జిల్లాలో వ్యవసాయ యోగ్యమైన భూమి దాదాపు 35 లక్షల ఎకరాలు. కానీ సాగునీటి సౌక ర్యం ఉన్న భూమి 4.5 లక్షల ఎకరాలు మాత్రమే.
అయితే జిల్లాలో నికరంగా దాదాపు 2 లక్షల ఎకరాలకే సాగునీరు అందుతున్నది. అత్యధిక చెరువులున్న పాలమూరు జిల్లా గోస తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నడుం బిగించారు. మిషన్ కాకతీయ కింద మహబూబ్ నగర్ జిల్లా చెరువులను పునరుద్ధరించారు. వాటిని ఎత్తిపోతల పథకాలతో అనుసంధానం చేయడంతో వాటికి పూర్వ వైభవం వచ్చింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం కిందకు ప్రవహిస్తున్న కృష్ణా జలాల నుంచి 70 టీఎంసీల నీటిని 25 రోజుల్లో ఎత్తిపోసి 3 జలాశయాల్లో నింపి వ్యవసాయానికి, పరిశ్రమలకు వినియోగించడం. ఇలా నిల్వ చేసిన నీటిని మహబూబ్ నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షల ఎకరాలకు, నల్లగొండ జిల్లాలో 30 వేల ఎకరాలకు అందిస్తారు. అలాగే జంట నగరాలకు, దారి పొడవునా ఉండే గ్రామాలకు మంచి నీరు అందిస్తారు.
ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సిద్ధమైంది. వెట్ రన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 16న ప్రారంభించనున్నారు. ఈ పథకంతో దక్షిణ తెలంగాణలోని ప్రతి పల్లెకు తాగునీరు, సాగునీరు అందనుంది. సీఎం కేసీఆర్ సాగునీటి రంగంపై దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమైంది. దీని వల్ల బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానున్నది.