‘పల్లె పల్లెన పల్లేర్లు మొలిచే పాలమూరులోన నా తెలంగాణలోనా’ అనే గోరటి వెంకన్న పాట నాటి పాలమూరు దుస్థితికి నిదర్శనం.అటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఒక పక్క ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చుతూనే మరోపక్క దాశరథి కలలు కన్న కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను మార్చే పనిలో పడ్డారు సీఎం కేసీఆర్. ఉత్తర తెలంగాణ వరప్రసాదిని కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపాదికన పూర్తి చేశారు. మరోపక్క దక్షిణ తెలంగాణ వరప్రసాదిని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సెప్టెంబర్ 16న ప్రారంభిస్తున్నారు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలో జూరాల నుంచి ప్రారంభించాలనుకున్నారు. కానీ నిర్దేశిత నీటి లభ్యత సాధ్యం కాదని భావించిన కేసీఆర్ శ్రీశైలం బ్యాక్ వాటర్ అందుబాటులో ఉండే ఎల్లూరు నుంచి ప్రారంభించాలని రీ డిజైనింగ్ చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి వరద సమయంలో రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీలు ఎత్తిపోసే విధంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రీ డిజైన్ చేశారు కేసీఆర్. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామం (240 మీ. ఎత్తున) వద్ద శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నుంచి రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం కేపీ లక్ష్మీదేవిపల్లి (670 మీ.ఎత్తున) రిజర్వాయర్కు 5 దశల లిఫ్టింగ్తో నీటిని ఎత్తిపోసి, ఆపై దక్షిణ తెలంగాణలో ఎక్కడికైనా గ్రావిటీ ద్వారా నీటిని వినియోగించుకోవాలన్నది పీఆర్ఎల్ఐఎస్ లక్ష్యం.
పీఆర్ఎల్ఐఎస్లో భాగంగా మొత్తం ఐదు లిఫ్టులు, ఐదు రిజర్వాయర్లు డిజైన్ చేశారు. ఎల్లూర్, ఏదుల, వట్టెం, ఉద్దండాపూర్, కేపీ లక్ష్మిపల్లి లిప్టుల ద్వారా అంజనగిరి, వీరాంజనేయ, వెంకటాద్రి రిజర్వాయర్, కురుమూర్తిరాయ, ఉదండాపూర్ రిజర్వాయర్లను నింపి ప్రతిపాదిత జిల్లాలకు నీరందిస్తారు.
సమైక్య పాలనలో పల్లేర్లు మొలిచిన పాలమూరు నేడు ఆకుపచ్చని చీరకట్టుకున్నది. ఈ మార్పంతా అపర భగీరథుడు కేసీఆర్ ఘనతే.