ఇక్కడ పుట్టిన పాపానికి జానెడు పొట్టకోసం వేల మైళ్లు వలస పోయిందెవరు..’ అడిగాడు ఉదయ్
వెయ్యెకురాలు పారే చెరువులున్నా ఎండిన కొబ్బరి చిప్పోలె నోర్లు తెరిచి ఆకాశం వైపు చూపు అని అన్నాడు వనపట్ల సుబ్బయ్య
రైతులు వానకోయిలలై మబ్బులు కురిసే తొలకరి చినుకులకోసం ఎన్నాళ్లు ఎదురు చూడాలి.’ అని ప్రశ్నించాడు జలజం
సద్దిమూట కట్టుకున్నంత సుతారంగా శవం మూట కట్టుకున్నాడు నా రైతు తండ్రి’ అని విలపిస్తాడు జనజ్వాల.
కాలుకింది మట్టి, నెత్తి మీది నింగి. పండిన నాలుగిత్తులతో మార్కెట్లో శవ జాగరణ’ అంటాడు కోట్ల వెంకటేశ్వర్రెడ్డి
పాలమూరుకు జరిగిన అన్యాయం మీద, పాలమూరు రైతుల దుస్థితి మీద ఒకనాడు పాలమూరు కవుల వలపోత ఇది. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాకు అడుగడుగునా అన్యాయమే. ఓట్ల కోసం ఎన్నికల ముందు హామీలు .. ఎన్నికల తర్వాత బడ్జెట్లో కనీసం ఎత్తిపోతల పథకాల సర్వేకు కూడా నిధులు కేటాయించని దుస్థితి. పాలకుల వివక్ష, నాయకుల నిర్లక్ష్యానికి ఈ నేల నుండి ఏటా 14 లక్షల మంది వలసపోయిన పరిస్థితి. పాలమూరు కరువును చూపి ప్రపంచబ్యాంకు నిధులు తెచ్చి దారిమళ్లించారు. 60 ఏండ్ల సమైక్య రాష్ట్రంలో పాలమూరు ప్రజలకు కరువు, కన్నీళ్లు, ఆకలిచావులు, వలస చావులు, ఆత్మహత్యలే శరణ్యమయ్యాయి.
అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా పాలమూరు జిల్లాకు 174 టీఎంసీల నీళ్లివ్వాలని ఆనాడు నిజాం తలపెట్టారు. ఆ తర్వాత వెల్లోడి ప్రభుత్వంలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదించి వీటి కోసం అనుమతులు కూడా సాధించడం జరిగింది. ఆ తర్వాత భాషాప్రయుక్త రాష్ర్టాల పేరుతో రాష్ర్టాల పునర్విభజన చేయడం 1956 నవంబరు 1 నాడు హైదరాబాద్ను ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేయడంతో పాలమూరు ప్రజల నోట్లో మట్టిపడింది. పాలమూరు ప్రజలకు అన్యాయానికి బీజం పడింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో ఈ మూడు ప్రాజెక్టులు రద్దయ్యాయి.
పాలమూరులో 42 లక్షల ఎకరాల భూమి ఉన్నది. ఇందులో సాగుకు యోగ్యమయిన 35 లక్షల ఎకరాల భూమి ఉన్న నేపథ్యంలో పాలమూరుకు కనీసం 100 టీఎంసీల నీళ్లతో అయినా ఆనాడు ప్రాజెక్టు తలపెట్టి ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు తలరాత మరోవిధంగా ఉండేది. పాలకుల నిర్లక్ష్యం, వివక్షల పర్యవసానం కరువు, వలసలు, దుర్భిక్షం, ఆకలిచావులు, ఆత్మహత్యలు వంటి అత్యంత అమానవీయ పరిస్థితులు.
ఉమ్మడి రాష్ట్రంలో లేక లేక.. ఊరిస్తూ ఊరిస్తూ జూరాల ప్రాజెక్టు ఒకటి కట్టారు. 1976కు ముందే ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు రాగా 1976 ఆగస్టు 4న ఇక్క డ ఉత్పత్తి అయ్యే విద్యుత్తు సగం, సగం వాడుకోవాలని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత 1981లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి దాని పరిధి, పరిమాణం కుచించుకుపోయి దశాబ్దంన్నర తర్వాత 1996 నాటికి కేవలం మొదటిదశ పూర్తయింది. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందింది కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే. నిజాం కాలంలో నిర్మించిన ఆర్డీఎస్ గద్వాల, అలంపూరు నియోజకవర్గాలలో సాగునీరు అందించాల్సి ఉండగా దానిని 15, 20 వేల ఎకరాలకు పరిమితం చేశారు. ఆ నీళ్లను కేసీ కెనాల్ ద్వారా ఆంధ్రాకు తరలించుకుపోయారు. కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాల సర్వే కోసం 1984లో అప్పటి ప్రభుత్వం జీవో నంబరు 270ని విడుదల చేసింది. ఆ తర్వాత సర్వే పనులకు నాలుగు డివిజన్లతో ఒక సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఐదేండ్ల సమయం పట్టింది. 1984లో సర్వేకు జీవో విడుదలయితే, 1989లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తే ఈ సర్వేల కోసం 1997 డిసెంబరులో రూ.50 లక్షల నిధులు మంజూరు చేశారు. ఆ తర్వాత రెండేండ్లకు సర్వే పూర్తి చేసి రూ.1,271 కోట్లకు ప్రాజెక్టు నివేదిక తయారయ్యింది. 25 టీఎంసీల నీటిని ఎత్తిపోసి 22 జలాశయాల్లో నిల్వచేసి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి ప్రతిపాదన ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అనంతరం 1999 జులై 5న మొదటిదశ పనులకు రూ. 233.72 కోట్ల పరిపాలనా అనుమతులతో పనులకు శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత పనులు అటకెక్కాయి.
ఈ పరిస్థితుల పర్యవసానాల మూలంగా తెలంగాణ ఉద్యమానికి పాలమూరు ప్రాతిపదిక అయింది. పాలమూరుకు జరిగిన సాగునీటి అన్యాయం మీద చర్చ మొదలయిన నేపథ్యంలో ప్రజల ఒత్తిడి తట్టుకోలేక వైఎస్ హయాంలో భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను జలయజ్ఞంలో తిరిగి మొదలుపెట్టారు.
వైఎస్ జలయజ్ఞం కింద టెండర్లు చేపట్టే నాటికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ఉన్న 17 రిజర్వాయర్లను ఎత్తేసి నాలుగు టీఎంసీల నిలువ సామర్థ్యం మాత్రమే గల ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లికి పరిమితం చేశారు. ఇందులో భాగంగానే సింగోటం చెరువును రిజర్వాయరుగా చేశారు. 25 టీఎంసీలని నోటిమాటలు తప్ప తెలంగాణ వచ్చే నాటికి ఏ ప్రభుత్వమూ ఒక జీవోను విడుదల చేయలేదు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ను పక్కదోవ పట్టించడానికి, పలుచన చేయడానికి చేసిన కుటిలయత్నమే జలయజ్ఞం.
అందుకే రాజశేఖర్రెడ్డి, ఆ తర్వాత రోశయ్య, ఆ తర్వాత కిరణ్కుమార్రెడ్డి వచ్చినా ఆ నీళ్లు ప్రజలకు అందలేదు. పెండింగ్ ప్రాజెక్టు పూర్తయ్యి వాటి ద్వారా సాగునీళ్లు వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 40 టీఎంసీల నీటిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేయడం జరిగింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల మీద ప్రత్యేకశ్రద్ధ పెట్టి పీటముడులు పడిన ప్రతి పనిని పర్యవేక్షించి, ఒక్కొక్క పనిని పురమాయించి, వరసబెట్టి చేసుకుంటూ వస్తూ, పనులు పూర్తయితా ఉంటే సాగునీళ్లు అందించుకుంటూ వచ్చారు. కృష్ణమ్మ నీళ్లు రైతుల పొలాలకు పారింది తెలంగాణ రాష్ట్రంలోనే. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి పూర్తిగా వినియోగంలోకి తెచ్చుకున్నా పాలమూరు జిల్లాలో 8 నుండి 10 లక్షల ఎకరాలకు మించి సాగునీరు అందదు అని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపడతామని ప్రకటించారు. ఈ విషయాన్ని గమనించిన అప్పటి ప్రభుత్వం ఆగమేఘాల మీద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల బ్యారేజీ నుండి చేపట్టి నీటిని ఎత్తిపోసే విధంగా రూపొందిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కానీ ఇక్కడే పాలమూరు ప్రజలకు మరోసారి అన్యాయం చేసే కుట్రలకు తెరలేపారు. జూరాల బ్యారేజీ సామర్థ్యం కేవలం ఆరు టీఎంసీల లైవ్ స్టోరేజీ. అప్పటికే ఆ బ్యారేజీ మీద కోయిల్సాగర్, నెట్టెంపాడు, భీమా లిఫ్టులతో పాటు భీమా లిఫ్టుల కింద 4.50 లక్షల ఎకరాల ఆయకట్టు, జూరా ల ఆయకట్టు కింద ఒక లక్ష ఎకరాలు కలిపి మొత్తం 5.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఆధారపడి ఉన్నది.
ఇంత చిన్న జూరాల జలాశయం మీద రోజుకు రెండు టీఎంసీలు లిఫ్ట్ చేయాల్సిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రతిపాదించడం, దాని ద్వారా పది లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించడం అసాధ్యం. అది కేవలం ప్రజలను మభ్యపెట్టడం, మోసం చేయడమే. ఈ ప్రతిపాదనలో 47 గ్రామాలు, 15 వేల ఇండ్లు, 80 వేల ఎకరాల భూమి ముంపునకు గురవుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి క్యాబినెట్ సమావేశంలో సాగునీటి మీద జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టాలి. అదీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అని ఒక వ్యూహాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. దానికి అనుగుణంగా నిపుణులతో కలిసి కేసీఆర్ స్వయంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఈ కొత్త ప్రతిపాదనల ప్రకారం ఆరు కొత్త రిజర్వాయర్లను నిర్మించేందుకు కేవలం మూడు గ్రామాలు, 2300 ఇండ్లు, 26 వేల ఎకరాల భూమి మాత్రమే ముంపునకు గురవుతున్నాయి. దీంతో పాటు 215 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్వాటర్ ఏర్పాటు చేయడం మూలంగా కృష్ణానదిలో నిరంతరం పాలమూరు ఎత్తిపోతల పంపులను నడుపుకునే అవకాశం ఉంటుందని, దీంతో పాటు తుంగభద్ర జలాలు కూడా అందుబాటులో ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకానికి రీడిజైన్ చేశారు. ఈ పథకానికి 2015 జూన్ 11న భూత్పూరు మండలం కరివెన వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
ఆ తర్వాత ప్రాజెక్టు కోసం 27 వేల ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. దీనిలో భాగంగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్లలో రిజర్వాయర్లు, పంపుహౌస్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో పంపుల సామర్థ్యం 139 మెగావాట్లు కాగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపుల సామర్థ్యం 145 మెగావాట్లు, ఒక మోటరు సామర్థ్యం ఒక లక్ష 96,500 హార్స్పవర్ కావడం గమనార్హం. రోజుకు 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసే విధంగా పనులు చేపట్టారు. నార్లాపూర్ అంజనగిరి రిజర్వాయర్ వద్ద 10 పంపులు ఏర్పాటు చేయగా ఆ రిజర్వాయర్ ఆనకట్ట పొడవు 11 కిలోమీటర్లు. తెలంగాణలో 60 మీటర్ల ఎత్తయిన ఆనకట్ట ఇదే కావడం విశేషం. ఈ రిజర్వాయర్ సామర్థ్యం 6.5 టీఎంసీలు. ఇక 10 పంపులు గల ఏదుల వీరాంజనేయ రిజర్వాయర్ ఆనకట్ట పొడవు 7.5 కిలోమీటర్లు కాగా సామర్థ్యం 6.55 టీఎంసీలలు. కేవలం 24 నెలల రికార్డు సమయంలో దీని నిర్మాణం పూర్తయింది. దీని నుండి వనపర్తి నియోజకవర్గం కాలువలను అనుసంధానం చేయడం జరుగుతున్నది. ఆ తర్వాత నాగర్కర్నూలు నియోజకవర్గం బిజినేపల్లి మండలం వట్టెం వద్ద నిర్మించిన వెంకటాద్రి రిజర్వాయర్ ఆనకట్ట పొడవు 15.23 కిలోమీటర్లు. కాగా దీని కింద లక్ష 39 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీళ్లు అందనున్నాయి. దీని తర్వాత దేవరకద్ర నియోజకవర్గం భూత్పూరు మండలం కరివెన వద్ద నిర్మించిన కురుమూర్తిరాయ రిజర్వాయర్ సామర్థ్యం 19 టీఎంసీలు. ఆనకట్ట పొడవు 15 కిలోమీటర్లు. దీని కింద లక్ష 50 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఆ తర్వాత జడ్చర్ల మండలం ఉద్దండాపూర్లో నిర్మించిన రిజర్వాయర్ ఆనకట్ట పొడవు 15.8 కిలోమీటర్లు కాగా నీటిసామర్థ్యం 16.03 టీఎంసీలు. దీని కింద 9.36 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నది. ఇప్పటివరకు దాదాపు 85 శాతం ప్రాజెక్టుల పనులు పూర్తయ్యాయి. ఈ నెలాఖరుకు వెట్న్ నిర్వహించనుండడం గర్వకారణం.
ప్రాజెక్టును అత్యంత వేగంగా నిర్మించే క్రమంలో ఇంటిదొంగలు బయటి దొంగలతో కలిసి పన్నాగాలు పన్ని కేసులు వేశారు. తెలంగాణ నుండి విడిపోయిన తర్వాత అసూయ అక్కసుతో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం ఆటంకాలు కల్పించడం జరిగింది. మరోవైపు కృష్ణా జలాలలో తెలంగాణ నీటి వాటా తేల్చకుండా కేంద్ర ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తూ వస్తున్నది.
ఈ కేసులు, సహాయ నిరాకరణల మధ్య ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ వస్తున్న క్రమంలో పర్యావరణ అనుమతులు, గ్రీన్ ట్రిబ్యునల్, నీటివాటా కేసులు అంటూ అనేకరకాల కారణాలను చూపి అనేక కేసులు వేశారు. వాటన్నింటిని ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటూ పనులు చేసుకుంటూ ఒకదశలో 1500 పై చిలుకు గ్రామాలకు పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండలలో తాగునీళ్లు ఇవ్వాల్సి ఉన్నదని వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రభుత్వం దానికి అవసరమైన పనులను చేపట్టింది. ఎట్టకేలకు తెలంగాణ వాదనకు తలవంచి నిపుణుల కమిటీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులను ఇచ్చింది.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు సాధించడం అనేది తెలంగాణ సాధించిన విజయం. పాలమూరు చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఈ ఎత్తిపోతల పథకం మూలంగా పాలమూరు జిల్లా తలరాత మారబోతున్నది. ఇప్పటికే పెండింగ్ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన సాగునీటితో వ్యవసాయరంగ స్వరూపం మారింది. ఈ ప్రాజెక్టు మూలంగా భవిష్యత్ లో పాలమూరు మరింత సస్యశ్యామలం కానున్నది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు తెచ్చి పాలమూరు ప్రజల కాళ్లు కడుగుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన మాటను త్వరలోనే నిలబెట్టుకోనున్నాం. ఎందుకోసం తెలంగాణ అంటే ఇందుకోసమే తెలంగాణ.
ప్రముఖ కవి వల్లభాపురం జనార్ధన చెప్పినట్టు…
్ర‘పకృతి సరిగమలను పలికించునిప్పుడు
వాగు, చెరువు, నదులు, బావి నీళ్లు
మలుపుకొనెడు నేర్పు తెలుసుకొన్నదిపుడు
ఎదుగు పాలమూరు ఎదురు లేక
ఎదుగు పాలమూరు ఎదురు లేక ’