– ఐకాస్ ఆస్పత్రిలో విజయవంతంగా వంద బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలు
– వివరాలు వెల్లడించిన ఆస్పత్రి ఎండీ డా.శశాంక్ కోడే
నీలగిరి, జూన్ 11 : నల్లగొండ జిల్లా ప్రజలకు కార్పోరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ఐకాన్ ఆస్పత్రి పని చేస్తుందని ఆస్పత్రి ఎండీ డా.శశాంక్ కోడే అన్నారు. ఆస్పత్రిలో విజయవంతంగా వంద బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలు చేసిన సందర్భంగా గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఒకప్పుడు మెదడు కణితి (బ్రెయిన్ ట్యూమర్) అని నిర్ధారణ అయిన వెంటనే నల్లగొండ జిల్లా ప్రజలు హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. కుటుంబ సభ్యులను వదిలి, నెలల తరబడి అక్కడ ఉండాల్సి రావడం, లక్షల రూపాయల వైద్య ఖర్చులు భరించడం అనేక కుటుంబాలకు తీవ్రమైన ఆర్థిక, మానసిక భారంగా ఉండేదన్నారు. ఆ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో నల్లగొండలోనే అత్యాధునిక న్యూరో సర్జరీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఐకాన్ హాస్పిటల్ మరో అరుదైన మైలురాయిని చేరుకుందని తెలిపారు. నల్లగొండ వైద్య రంగంలో మరో చారిత్రాత్మక అడుగు ముందుకువేసి ఐకాన్ హాస్పిటల్లో 100 మెదడు కణితుల శస్త్రచికిత్సలు విజయవంతం చేసినట్లు వెల్లడించారు.
ఈ వంద కేసులో సాధారణ శస్త్ర చికిత్సలతో పాటు అత్యంత క్లిష్టమైన, ప్రాణాపాయ స్థితిలో ఉన్న మెదడు కణితి కేసులు కూడా ఉన్నాయన్నారు. హైదరాబాద్లో ఇలాంటి చికిత్సలకు దాదాపు రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు అయ్యే సందర్భాలు ఉన్నప్పటికీ, ఐకాన్ హాస్పిటల్లో అది చాలా తక్కువ ఖర్చుతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఆస్పత్రి యాజమాన్యంగా కేవలం శస్త్రచికిత్సలు చేయడమే కాదని గ్రామీణ, పట్టణ ప్రజల మధ్య ఉన్న వైద్య అసమానతలను తగ్గించడం, ప్రపంచ స్థాయి సాంకేతికత, ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు అందించమే లక్ష్యమన్నారు. భవిష్యత్లో కూడా మరింత అధునాతన న్యూరో సర్జరీ సేవలు, అత్యవసర మెదడు, వెన్నెముక చికిత్సలు, అత్యుత్తమ వైద్య ప్రమాణాలతో నల్లగొండ ప్రజలకు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు ఆలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ సాయి మౌనిక చెరుకూరి, డాక్టర్ సాయి లావణ్య కడిమి, సిబ్బంది తదితరులు ఉన్నారు.