ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగబాకినట్టు సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని రాష్ట్ర విపక్షాలు అధికారం గురించి పగటి కలలు కంటుండటం మనం చూస్తున్నాం. కప్పల తక్కెడ లాంటి కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కుమ్ములాటలు కొత్త కావు. అసమ్మతి అనేది పార్టీ అనాది ఆచారంగా వస్తున్నది. టీడీపీ నుంచి జంప్ కొట్టి పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్రెడ్డి హయాంలో ఈ జాడ్యం పరాకాష్ఠకు చేరుకున్నది. సీనియర్ల రుసరుసలు, సొంత కుంపట్ల చిటపటలు పార్టీకి కునుకులేకుండా చేస్తున్నాయి. పార్టీ సమావేశాలకు రానివారు కొందరైతే సభలకే డుమ్మా కొట్టేవారు ఇంకొందరు. అగ్రనేతల సభల్లోనే తగాదాలు, తన్నులాటలు. ఈ ముష్టియుద్ధాలతో ముందుకువెళ్లేదెలా అని ద్వితీయస్థాయి నాయకత్వంలో నైరాశ్యం. ఎక్కడా దిక్కులేక పార్టీలో చేరే పొంగులేటి వంటివారికి కాంగ్రెస్ మార్కు తిట్లు, సిగపట్లు స్వాగతం పలుకుతున్నాయి. క్రమశిక్షణ కోసం కొరడా ఝళిపింపులు, బుజ్జగింపులతో అధిష్ఠానం కాలక్షేపం చేయడం షరామామూలే అయ్యింది. నలుగురు సీఎం అభ్యర్థులున్నారంటేనే ఆ పార్టీలో ఐక్యత ఎంత ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
ఇక క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పుకొనే బీజేపీకి కూడా కాంగ్రెస్ తరహాలో అసమ్మతి సంస్కృతి తగులుకున్నది. పాతవాళ్లు, కొత్తగా పార్టీలో చేరినవాళ్ల మధ్య సయోధ్య సున్నా. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అసమ్మతి దెబ్బకు ఎల్లెలుకల పడక తప్పలేదు. ఆత్మరక్షణ కోసం పార్టీలో దూరిన ఈటల రాజేందర్ చేరిన మరుసటి రోజునుంచే బండి సంజయ్ను ను అధ్యక్ష పదవి నుంచి సాగనంపేం దుకు పొగపెట్టారనేది బహిరంగ రహస్యం. అయితే బండి మార్పుపై ఆరెస్సెస్ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఆయన స్థానంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన కిషన్రెడ్డికి పార్టీని నడిపించడం కత్తిమీద సామే. అందుకే ఆయనలో అంతగా ఉత్సాహం కనిపించడం లేదు. ఇక పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు నాలుగు దిక్కులు చూస్తుంటారు. ఇక ఎమ్మెల్యేలు ఎడమొగం పెడమొగం పెడుతుంటారు. తెలంగాణలో గెలిచేంత సీన్ బీజేపీకి లేదని వాళ్ల పార్టీ అగ్రనేతల్లో ఒకరైన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గాలి తీయడం గమనార్హం.
ఈ రెండు జాతీయ పార్టీలకు రిమోట్ కంట్రోల్స్ ఢిల్లీలో ఉంటాయి. అక్కడినుంచి ఆడించినట్టల్లా ఆడటమే రాష్ట్ర నాయకుల పని. కానీ మంత్రి కేటీఆర్ చెప్పినట్టు బీఆర్ఎస్ను రిమోట్ కంట్రోల్ చేసేది రాష్ట్ర ప్రజలే. సీఎం కేసీఆర్ సుస్థిర నాయకత్వంలో ఎదురులేకుండా ముందుకు సాగుతున్నది బీఆర్ఎస్. అభివృద్ధి, సంక్షేమంలో అద్వితీయ ఖ్యాతి సంపాదించి ఇరుగుపొరుగు రాష్ర్టాల ప్రజలనే కాకుండా యావత్తు భారతదేశం దృష్టిని ఆకర్షిస్తున్న నేపథ్యం ఉన్నది. జలకళతో సాగు బాగుపడింది. ప్రగతి పరుగులతో పల్లెలు, పట్టణాలు మురిశాయి. పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. ఉపాధి అవకాశాలు ఉగ్గడిస్తున్నాయి. దశాబ్ది ఉత్సవాలు అందించిన ఉత్సాహంతో ‘మూడోసారీ కేసీఆరే’ అనే మాట బలంగా వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో విపక్షాల ఆశలు మళ్లీ అడియాసలయ్యేట్టుగానే కనిపిస్తున్నాయి.