భారతదేశం ఆహార నూనెల వినియోగంలో మూడింట రెండు వంతుల దిగుమతికి ఏటా సుమారు రూ.70వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. ఈ నూనెల దిగుమతిలో ప్రధానమైనది పామాయిల్. ఎందుకంటే ఇది ప్రపంచ మార్కెట్లలో చౌకైనది. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుంచి దిగుమతి అవుతున్నది. సాధారణంగా వేరుశెనగ నూనె వంటి వంట నూనె ధర కంటే సగం ధర పామాయిల్కు ఉంటుంది. ఇప్పుడు దేశంలో మొత్తం తినదగిన నూనె వినియోగంలో దాదాపు 25 మిలియన్ టన్నులలో పామాయిల్ 30శాతం వాటా కలిగి ఉన్నది. ఇది బేకరీలు మొదలు గృహాల్లో వినియోగం వరకు అన్ని రకాల ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 11,040 కోట్ల నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ పామ్ (NMEO-OP) ద్వారా ఈ దిగుమతిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నది. దేశంలో విస్తారమైన విభిన్న భూ, వాతావరణ పరిస్థితులు పామాయిల్ తోటల పెంపకానికి చాలా అనుకూలంగా ఉన్నా యి. ప్రస్తుతం, దేశంలో ‘ఆయిల్ పామ్’ కేవలం 8.25 లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతుండగా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్, అస్సాం, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు.., ఇతర ఈశాన్య రాష్ర్టాల్లో 48.25 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు సంభావ్యతను గుర్తించారు.
ఆయిల్-పామ్ మిషన్తో 48.25 లక్షల ఎకరాల్లో గుర్తించిన సంభావ్య విస్తీర్ణంలో నాటినట్లయితే, మనదేశం పామాయిల్ ఉత్పత్తిని ప్రస్తుతం ఉన్న 2.81 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 9.65 మెట్రిక్ టన్నులకు పెంచవచ్చు. ఇది మన ప్రస్తుత దిగుమతులకు సమానం. పామాయిల్ సాగు కొన్ని స్వాభావిక ప్రయోజనాలను కలిగి ఉన్నది. ఒకసారి పామాయిల్ సాగుచేస్తే.. ఆ నాటిన మొక్క 30 ఏండ్ల వరకు నిరంతర ఉత్పత్తి ఇస్తుంది. ప్రధాన పంటగా పామాయిల్తో పాటు ఇతర అంతర పంటలు వేసే అవకాశం ఉన్నది. పామాయిల్ తోటలు ఇతర నూనెగింజల పంటల కంటే 5నుంచి 8 రెట్లు ఎక్కువ దిగుబడి ఇస్తాయి. ప్రపంచంలోని కూరగాయల నూనె డిమాండ్లో పామాయిల్ 35శాతం ఉన్నది.
పామాయిల్ తోటలున్న గ్రామీ ణ ప్రాంతాల్లో ఆయిల్ మిల్లులు, ఆ ప్రాంతాల చుట్టూ ప్యాకేజింగ్ కేంద్రాల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పుట్టుకొస్తాయి. దట్టమైన పచ్చదనం ద్వారా పామాయిల్ వాతావరణ మార్పులను అరికడుతుంది. బహుళ పంటలు పండించడంలో సాయపడుతుంది. ఒక అంచనా ప్రకారం.. ఒక ఎకరా ఆయిల్ పామ్ 8 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది. ఏడాదికి 9 టన్నుల ఆక్సిజన్ విడుదల చేస్తుంది.
ఏదేమైనప్పటికీ, దీనికి కొద్దిమేర నీటిపారుదల సౌకర్యాలే అవసరం. ఇది వరిలో నాల్గవ వంతు నీటిని మాత్రమే వినియోగిస్తుంది. కాబట్టి కనీస సాగునీరు సౌకర్యం ఉన్నా విస్తృతంగా సాగు చేయవచ్చు. కార్పొరేట్ కంపెనీల ప్రవేశంతో, పామాయిల్ సాగు అటవీ భూములకు విస్తరించవచ్చనీ, అటవీ నిర్మూలన జీవవైవిధ్య నష్టానికి దారితీస్తుందనే ప్రచారం ఉన్నది. దేశంలోని కఠినమైన అటవీ చట్టాలు అడవులను ప్లాంటేషన్గా మార్చడానికి అనుమతించవు. అందువల్ల జీవవైవిధ్యం హాట్స్పాట్లను సంరక్షించడానికి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది.
పామాయిల్ తోటల సాగుకు ప్రధాన అవరోధం ప్రారంభ పెట్టుబడి. దీని సాగుకోసం ఎకరాకు రూ.4,800 నుంచి రూ.11,600 వరకు నాటడం కోసం అయ్యే ఖర్చు, పెరిగిన సబ్సిడీతో భారం తప్పుతుంది. పామ్ శాశ్వత పంట కావడంతో, అంతర్జాతీయ ధరలలో హెచ్చుతగ్గుల నుంచి రైతులు నష్టాలకు గురవుతారు. దీంతో ప్రతిపాదిత పథకంతో రైతుల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేసి రైతులను ఆదుకునేందుకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ను అందించడం లక్ష్యంగా పెట్టుకోవటం ఆహ్వానించదగినది.
పామాయిల్ తోటలతో సమస్య ఏమంటే, పంట కోసిన 24 గంటలలోపు గుత్తులను ప్రాసెస్ చేయాలి. గుర్తించిన ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న మిల్లుల ద్వారా బై-బ్యాక్ ఏర్పాట్ల కోసం దీర్ఘకాలిక ఒప్పందాలను ప్రోత్సహించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. మరో ప్రధాన సమస్య.. ఆయిల్ మిల్లుల నుంచి వచ్చే వ్యర్థాలు. ఆయిల్ పామ్ తాజా పండ్ల గుత్తుల ప్రాసెసింగ్ వివిధ రకాల అవశేషాల ఉత్పత్తికి దారితీస్తుంది. ఉత్పత్తి అయిన వ్యర్థాలలో, పామాయిల్ మిల్లు ఎఫ్లూయెంట్ (POME) శుద్ధి చేయకుండా విడుదల చేస్తే పర్యావరణానికి తీవ్ర హాని చేస్తుంది. సరైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే ఈ వ్యర్థాలను సేంద్రియ ఎరువులుగా మార్చవచ్చు.
పామాయిల్ మిషన్తో సమీప భవిష్యత్తులో ఎడిబుల్-ఆయిల్ విషయంలో గుణాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. పామాయిల్ కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి రైతుల ఆదాయాలను పెంచే అవకాశం ఉంది.
కార్పొరేట్ కంపెనీల ప్రవేశంతో, పామాయిల్ సాగు అటవీ భూములకు విస్తరించవచ్చనీ, అటవీ నిర్మూలన జీవవైవిధ్య నష్టానికి దారితీస్తుందనే ప్రచారం ఉన్నది. దేశంలోని కఠినమైన అటవీ చట్టాలు అడవులను ప్లాంటేషన్గా మార్చడానికి అనుమతించవు. అందువల్ల జీవవైవిధ్యం హాట్స్పాట్లను సంరక్షించడానికి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది.
– డాక్టర్ ఎ. అమరేందర్ రెడ్డి
70423 61439
(వ్యాసకర్త: ప్రధాన శాస్త్రవేత్త (వ్యవసాయ ఆర్థిక శాస్త్రం), సెంటర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్- హైదరాబాద్)