నల్లగొండ ప్రజలది ఎప్పటికీ ధిక్కార స్వరమే. అదీ 1952కు ముందు సాయుధ పోరాటమైనా, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలైనా ప్రజాస్వామ్యవాదులు, పార్టీలకు మాత్రమే పట్టం గట్టే ఒరవడి నల్లగొండ ప్రజలు కొనసాగిస్తున్నారు. దేశంలో రాజకీయాలు ఎట్లా ఉన్నా, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా, పెత్తనం చెలాయించేది ఎవరైనా సెక్యులర్, లౌకిక స్పృహ ఉన్నవారినే గెలిపించే బుద్ధిజీవులు నల్లగొండ బిడ్డలు. నల్లగొండ ప్రజలు ఏ పోరాటం చేసినా, ఏ త్యాగం చేసినా అది చరిత్రనే.
నిజాంకు వ్యతిరేకంగా మహోన్నత పోరాటాన్ని నడిపిన నల్లగొండ ప్రజలు ఆ తర్వాత కూడా అదే స్ఫూర్తిని కొనసాగించారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక అనుభవం, ప్రజల పట్ల బాధ్యత ఉన్నవారినే ఎన్నుకున్నారు. 1947 తర్వాత భారతదేశం బ్రిటిషు వారి పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్న సందర్భంలో తెలంగాణ మాత్రం నిజాం రాజును వదిలించుకునేందుకు సాయుధ పోరాటం చేస్తున్నది. ఆ పోరాటం సుదీర్ఘంగా సాగి తెలంగాణ ప్రాంతం విముక్తి చెందడంతో పాటు భారతదేశంలో భాగమైంది. ఇక ఆ తర్వాత 1952లో దేశంలో జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని అందరూ భావించారు. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లబ్భాయ్ పటేల్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి జాతీయ నేతలు కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపిస్తున్నారు.
దేశమంతా కాంగ్రెస్ గాలి వీచి తొలి ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీనే ఏర్పరిచింది. కానీ తెలంగాణలో మాత్రం పీడీఎఫ్ అభ్యర్థులుగా పోటీలో నిలిచిన ఉభయ కమ్యూనిస్టు అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని స్థానాలను పీడీఎఫ్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా భువనగిరి నుంచి పీడీఎఫ్ తరఫున పోటీ చేసిన రావి నారాయణరెడ్డి భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కంటే అత్యధిక మెజారిటీ సాధించడం పార్లమెంటు చరిత్రలో ఒక రికార్డుగా నిలిచింది. దేవరకొండలో అనంతరావు, పెద్దవూర (చలకుర్తి)లో పర్వతరెడ్డి, మిర్యాలగూడలో ఎ.వెంకట్రామారావు, హుజూర్నగర్లో టి.నర్సింహులు, మగ్దూం మొహియుద్దీన్, జయసూర్య, సూర్యాపేటలో ఉప్పల మల్సూర్, ధర్మభిక్షం, భీమిరెడ్డి నర్సింహా రెడ్డి, నల్లగొండలో లక్ష్మయ్య, రమారెడ్డి, మునుగోడులో కె.వెంకట్రామారావు, భువనగిరిలో రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, నకిరేకల్లో నర్రా రాఘవరెడ్డి, రామన్నపేటలో కె.రామచంద్రారెడ్డి, తుంగతుర్తిలో మల్లు స్వరాజ్యం, ఆలేరులో ఆరుట్ల కమలాదేవిల వంటి పోరాట స్పృహ, సామాజిక బాధ్యత ఉన్నవారిని గెలిపించిన చరిత్ర నల్లగొండ జిల్లా ప్రజల సొంతం.
అరువై ఏండ్ల పరాయి పాలనలో తెలంగాణలో జరిగిన అకృత్యాలకు బలైనవారిలో ఎక్కువమంది నల్లగొండ జిల్లాకు చెందినవారే. సాగునీరు లేక నెర్రలుపడ్డ నేలల్లో వ్యవసాయం చేయలేక అరిగోస పడుతున్న నల్లగొండ బిడ్డల బతుకులను మార్చాలనే సోయి కాంగ్రెస్, బీజేపీలకు ఏనాడూ రాలేదు. ఫ్లోరోసిస్ భూతం ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంటే.. పెద్ద పెద్ద నేతలుగా చెలామణి అయినవాళ్లు చోద్యం చూశారు. ఆ క్రమంలోనే తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి- నల్లగొండ బిడ్డలకు వారి ఆకాంక్షలను నెరవేర్చే పార్టీగా కనిపించింది. అందుకే పద్నా లుగేండ్ల మలిదశ ఉద్యమంలో యావత్ నల్లగొండ ప్రజలు టీఆర్ఎస్ పార్టీతో కలిసినడిచారు. ఆ పోరాటంలో అనేకమంది తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరుగని పోరాటం చేసిన కేసీఆర్కు ప్రతి సందర్భంలో నల్లగొండ ప్రజలు అండగా నిలిచారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా, తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్కు అవకాశం ఇవ్వకుండా తెలంగాణను తెచ్చిన టీఆర్ఎస్కు ఇక్కడి ప్రజలు పట్టం గట్టారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ అవకాశం కల్పించిన గుంతకండ్ల జగదీశ్రెడ్డి, గ్యాదరి కిశోర్ కుమార్, గొంగిడి సునీత, వేముల వీరేశం, పైళ్ల శేఖర్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి వంటి సాధారణ వ్యక్తులను నల్గగొండ ప్రజలు అసెంబ్లీకి పంపారు.
ఆ తర్వాత నోముల నర్సింహయ్య, బొల్లం మల్లయ్యయాదవ్, కంచర్ల భూపాల్రెడ్డి, సైనంపూడి సైదిరెడ్డి, నోముల భగత్కుమార్ లను కూడా అసెంబ్లీకి పంపిన చరిత్ర నల్లగొండ జిల్లా ప్రజలది. ఇక కాంగ్రెస్లో పెద్ద పెద్ద లీడర్లుగా చెలామణి అవుతున్న జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాంరెడ్డి దామోదర్రెడ్డి వంటి నేతలను మట్టికరిపించిన చరిత్ర కూడా నల్లగొండ బిడ్డలదే. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో కూడా నల్లగొండ ప్రజలు తమ విజ్ఞతను చాటుకున్నారు. ఎక్కడ కూడా మతోన్మాద పార్టీలు దరిచేరకుండా చావుదెబ్బ కొట్టారు. వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో నల్లగొండను పిశాచంలా పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది.
దేశంలో ఒక విప్లవాత్మక మార్పు రావాలి. మతం పేరుతో దేశాన్ని పాలించే పార్టీలు కూలాలంటే.. మునుగోడు ఉప ఎన్నికల్లో దేశ సమగ్రాభివృద్ధిని కాంక్షించే టీఆర్ఎస్ (బీఆర్ఎస్) గెలవాలి. బీజేపీ ఆగడాలకు అడ్డుకట్ట పడాలి. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల పాటు ఉచిత కరెంటు, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, దళితబంధు, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్ వంటి అద్భుత పథకాలు దేశమంతా అమలుకావాలంటే మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధించాలి. ఆ విజయం దేశాభివృద్ధికి ఒక మైలురాయిగా నిలువనున్నది. కేసీఆర్ ఆలోచన, పాలన దేశ ప్రజలందరికీ అందితే దేశం సుభిక్షంగా అభివృద్ధి పథం వైపు నడుస్తుందని ఆశిద్దాం.
– బండారు జితేందర్ 93935 41667
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)