రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు పూర్తయ్యాయి. ‘డిసెంబర్ 9నే హామీలన్నీ అమలు చేసి తీరుతాం’ అని నాడు ప్రచారం లో ఊదరగొట్టిన కాంగ్రెస్ నేతలు.. పాలకులుగా మారాక కనీసం వాటి ఊసే ఎత్తకపోవడం శోచనీయం. పిం ఛన్లు పెరుగుతాయని ఆశించిన వృద్ధు లు, వితంతువులు, దివ్యాంగులను కాంగ్రెస్ నిండాముంచింది. పింఛన్ల పెంపు సంగతి దేవుడెరుగు.. కేసీఆర్ సర్కార్ ఇచ్చిన విధంగా ఆసరా పింఛన్ను సమయానికి ఇస్తే చాలనే దుస్థితి ఏర్పడటం ఆందోళనకరం.
కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మిన పింఛనుదారులు ఆ పార్టీకి పట్టం గట్టారు. అయితే నమ్మినవారిని నట్టేట ముంచే హస్తం పార్టీ తన పేరు ను సార్థకం చేసుకున్నది. నాడు గప్పా లు కొట్టిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి మూడు నెలలైనప్పటికీ రూ.2 వేలే ఇస్తున్నారు. కొత్త పింఛన్ల మంజూరుపై కూడా సప్పుడు చేయడం లేదు. ఆరు గ్యారెంటీల దరఖాస్తుల్లో భాగంగా గతంలో తీసుకు న్న దరఖాస్తులు ఏ మూలన పడ్డా యో తెలియదు. వాటిని పరిశీలిస్తా రో? తిరస్కరిస్తారో? తెలియడం లే దు. ‘కుటుంబంలోని ఒక్క వృద్ధునికే కేసీఆర్ సర్కార్ పింఛన్ ఇస్తున్నది. కాంగ్రెస్ ఇద్దరికీ ఇస్తుంది’ అని నాడు గప్పాలు కొట్టి, ఇప్పుడు ఆ సంగతే మర్చిపోవడం విడ్డూరం.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ప్రజా పాలన అని చెప్తున్నారే తప్ప ఆచరణలో ఎక్కడా ప్రజాపాలన కనిపించడం లేదు. దరఖాస్తుల పరిశీలన పేరిట కాలయాపన చేస్తుండటం తో అర్హులైన పేదలు నష్టపోతున్నారు. మా ఊరు సంస్థాన్ నారాయణపురానికి చెందిన ఓ ఒంటరి మహిళ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నది. వాస్తవానికి ఆమె రెండు విధాలా అర్హురాలు. అయినా నాయకుల అలసత్వంతో ఆమెకు పింఛను రావడం లేదు. దరఖాస్తుల పేరిట కాలయాలన చేయకుండా వెంటనే కొత్త పింఛన్లు మంజూరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పత్రికల ద్వారా వెలుగులోకి వచ్చిన సమస్యలపై కూడా స్పందించి, వాటిని పరిష్కరించినప్పుడే ప్రజాపాలన అవుతుంది. పాలకులు, అధికారులు స్పందించి అర్హులకు పింఛన్లు అందించాలి. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలి. అంతేకానీ మాటలతో మార్పు జరుగుతుందనుకోవడం పొరపాటు.
– గుండమల్ల సతీష్ కుమార్