టికాయత్ జీ.. మీరు మొక్కవోని దృఢదీక్షతో రైతు ఉద్యమాన్ని నడిపిన నేతగా అభినందనీయులు. పాలకులు ఎన్ని విధాలుగా నిర్బంధాలను ప్రయోగించినా వెరవకుండా రైతులను శాంతియుతంగా నడిపించి ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చిన మీరు ఎంతో పరిణతితో వ్యవహరించాలి. మరెంతో సంయమనం పాటించాలి. ఎవరో చెప్పిన విషయాలపై ఆధారపడి కేసీఆర్ లాంటి రైతు పక్షపాత ముఖ్యమంత్రిని విమర్శించటం సమంజసంగా లేదు.
తెలంగాణలో రైతుల సంక్షేమానికి ఇక్కడి ప్రభుత్వ నేతగా సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలుసుకొని మాట్లాడితే మీకు గౌరవంగా ఉండేది. అలా కాకుండా చెప్పుడు మాటలతో విమర్శలకు దిగటం విషాదం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అనటానికి ఇక్కడ అమలు చేస్తున్న పథకాలను చూస్తే మీకు అర్థమయ్యేది. దీనికి తాజా ఉదాహరణగా ఢిల్లీ సరిహద్దుల్లో మీ నాయకత్వంలో నడుస్తున్న ఉద్యమంలో అమరులైన 750 మంది రైతులకు సాయంగా మూడు లక్షల చొప్పున ప్రకటించిన దేశంలో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. అంతటితో ఆగకుండా.. రైతు ఉద్యమంలో ప్రాణాలు విడిచిన ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల పరిహారం మోదీ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది చాలదా.. కేసీఆర్ ఏ విధంగా రైతుల గురించి ఆలోచిస్తారో, ఎంతటి పక్షపాతో అర్థం చేసుకోవటానికి. కేసీఆర్ ప్రకటన తర్వాతనే దేశవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు కదిలారు. మరణించిన రైతులను ఆదుకోవటానికి ముందుకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికంతటికీ కేసీఆర్ స్పందనే స్ఫూర్తి అని చెప్పవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో మీరు తొందరపడి కేసీఆర్పై విమర్శలు చేయటం బాధాకరం. నాయకత్వ స్థానంలో ఉన్న మీరు, మరో నాయకుని గూర్చి వ్యాఖ్యానించే ముందు, ఆయన పూర్వాపరాలను తెల్సుకోవాలి గదా? ‘విననంతనె వేగపడక, కని, కల్ల, నిజమును తెల్సుకోగల్గిన వాడే..’ గదా సిసలైన నేత?
ఇంకొక వాస్తవమేమంటే ఏడాదిగా మీ రైతు సంఘాలు కొడుతున్న దెబ్బలకు ‘మూడు వ్యవసాయ చట్టాల చట్టుబండ’ బీటలు వారటం ఎంత నిజమో, కేసీఆర్ మరో దెబ్బ వేయగానే అది ముక్కలయ్యిందన్నదీ కూడా అంతే నిజం. మొన్నటి ఉప ఎన్నికల ఫలితాలు, రేపటి ఐదు రాష్ర్టాల, ఎన్నికలతో పాటు, కేసీఆర్ ఉద్యమించి, దక్షిణాది రాష్ర్టాలను కూడగడితే, కనీసం అక్కడ కాలు నిలదొక్కుకోవటానికి కష్టమన్న ఆలోచన గూడా మోదీ వెనుకంజకు కారణమనటం నిస్సందేహం!
ఇక కేసీఆర్ గూర్చి మీరు తెల్సుకోవలసిన అంశాలు.. వ్యవసాయాధారిత దేశంలో వ్యవసాయాభివృద్ధి ద్వారానే, పారిశ్రామికాభివృద్ధి సాధ్యమని గ్రహించిన వాస్తవికవాది, రాజనీతిజ్ఞుడు కేసీఆర్. తెలంగాణ ఆవిర్భావం నుంచే రాష్ట్ర ప్రగతి కోసం, ఆ దిశగా పరిశ్రమిస్తున్న కృషీవలుడు కేసీఆర్. దీనికోసం వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగాలను రాష్ట్ర సమగ్రాభివృద్ధికి రెండు కాళ్లు, కండ్లుగా భావించి అభివృద్ధి చేస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రపంచంలోనే అద్భుత ఆధునిక నిర్మాణంగా కొనియాడబడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ సాగునీటి సమస్యను శాశ్వతంగా రూపుమాపారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువులన్నింటికీ జలాలతో జీవకళ తెచ్చారు. దీంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగి సాగు విస్తీర్ణం పెరగటం, పంట దిగుబడి పెరిగింది. వరి పంట అనూహ్యంగా పెరిగి దేశానికే ధాన్యాగారంగా మారిందంటే కేసీఆర్ చేపట్టిన వ్యవసాయ అనుకూల విధానాలను అర్థం చేసుకోవచ్చు.
వ్యవసాయ, పారిశ్రామికరంగాలకు కీలకం విద్యుత్తు. ఉమ్మ డి రాష్ట్రంలో విద్యుత్ కొరతతో సతమతమైన తెలంగాణను నే డు నిరంతర వెలుగుల తెలంగాణగా రూపొందించారు. అంతేకా దు, వ్యవసాయానికి నిరంతరం ఉచిత విద్యుత్తునందిస్తున్నారు.
దేశానికి వెన్నెముక రైతు అంటారు కానీ ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం రైతులను ఆదుకున్నవారు లేరు.కానీ తెలంగాణలో ‘రైతు బంధు’ పథకం ద్వారా సకాలంలో ప్రతి రైతుకూ పెట్టుబడిని అందించారు. మరణించిన రైతు కుటుంబానికి ‘రైతు బీమా’ ద్వారా రూ.5 లక్షలు అందిస్తూ కేసీఆర్ రైతుల ఆత్మబంధువు అవుతున్నారు.
టికాయత్ జీ.. మీకు ముఖ్య విజ్ఞప్తి! రైతుల సమైక్యతకు, ఉద్యమస్ఫూర్తి కలిగిన కేసీఆర్ వంటి రైతు బంధు నేతలను మీరు కలవండి. కేసీఆర్లాంటి వారు దేశంలో ఎవరున్నా వారందరినీ ఏకతాటిపైకి తెచ్చి విద్యుత్ సంస్కరణల చట్టం రద్దు కోసం పోరాడండి. అలాగే అన్నింటికన్నా ముఖ్యంగా రైతుకు మద్దతు ధర కోసం ఉద్యమించండి. ఇలాంటి ముఖ్యమైన రైతు శ్రేయస్సు కోసం అత్యవసరమైన డిమాండ్ల సాధన కోసం కేసీఆర్ లాంటి నేతకు రైతు ఉద్యమ పగ్గాలను అందింండి. దేశ వ్యవసాయాభివృద్ధిని! తద్వారా పారిశ్రామికాభివృద్ధిని సాధించటం కోసం ఉద్యమాన్ని కొనసాగించండి. ప్రగతి ఫలాలు ప్రజలందరికీ అందే విధానాన్ని రూపొందించండి! కుల, మత, రహితంగా ప్రతి పౌరుడూ ‘భారతదేశం నా మాతృభూమి భారతీయులం తా నా సహోదరులు!’ అని సగర్వంగా చెప్పుకొనేలా భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకు ముందుకుసాగండి.
పాతూరి వేంకటేశ్వరరావు
98490 81889