దేశంలో ప్రస్తుతం ఉమ్మడి పౌరస్మృతి ఒక ప్రధానమైన చర్చాంశంగా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దీనిని చట్టబద్ధం చేసే యోచనతో ముందుకురావడమే ఇందుకు కారణం. తొమ్మిదేండ్ల పాలనలో దీన్ని పట్టించుకోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి పేరిట హంగామా చేయడం వెనుక గల కారణాలను ఊహించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవంతో ప్రధాని నరేంద్ర మోదీ జనాకర్షణపై సహజంగానే అనుమానాలు మొదలయ్యాయి. అన్నీ తానై ఆయన చేసిన ప్రచారం ఫలితం చూపలేకపోయింది. మతోన్మాదాన్ని బాహాటంగా రెచ్చగొట్టినా, వంగి వంగి దండాలు పెట్టినా ఓటర్లు పట్టించుకోలేదు. ఆర్థిక అంశాలకే వారు ప్రాధాన్యం ఇచ్చారు. మరి బీజేపీకి మతరాజకీయాలు తప్ప మరోటి చేతకాదు. అల్పసంఖ్యాక వర్గాలను బూచిగా చూపి అధిక సంఖ్యాకులను బెదరగొట్టి పబ్బం గడుపుకోవడమే ఆ పార్టీ మొదటినుంచీ అవలంబిస్తున్న విధానం.
ప్రధాని మోదీ అసమర్థ పాలన ఫలితంగా దేశం అన్నిరంగాల్లో కుదేలైపోయింది. జాతీయ, అంతర్జాతీయ నివేదికలు, గణాంకాలు ఈ విషయాన్ని ఎలుగెత్తి చాటుతున్నాయి. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన వైఫల్యాల మీద నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి బిల్లును తెరపైకి తెసున్నది. వర్తమానంలో ఉమ్మడి పౌరస్మృతి కేవలం ముస్లింలకు సంబంధించిన సమస్య అన్నట్టుగా చాలామంది భావిస్తుండటం గమనార్హం. ఉమ్మడి పౌరస్మృతితో దళిత, బహుజన, గిరిజన వంటి వెనుకబడిన వర్గాల ఆచార వ్యవహారాలే కాదు, వారికున్న ప్రత్యేక రక్షణలూ గల్లంతవుతాయనే వాదనను ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి.
నిజానికి విభిన్న మతాలు, జాతుల సమ్మేళనమైన భారతదేశంలో ఉమ్మడి పౌరస్మృతి ఉండాలా, వద్దా? అనే చర్చ రాజ్యాంగ రచనాకాలం నుంచీ నలుగుతున్నది. వివిధరకాలైన ఆచార వ్యవహారాలను రద్దుచేసి ఏకరీతి పౌరనీతిని తేవాలనే డిమాండ్పై ఏకాభిప్రాయం ఆనాడూ లేదు, ఈనాడూ లేదు. విస్తృతస్థాయిలో ఆమోదయోగ్యత వచ్చిన తర్వాతనే దీన్ని చేపట్టాలని అప్పట్లో తీర్మానించారు. ఆచరణలో ఎదురయ్యే సమస్యల దృష్ట్యా రాజ్యాంగ నిర్మాతలు దీన్ని ప్రాథమిక హక్కుల్లో చేర్చకుండా ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. నిజానికి ఏకాభిప్రాయం కుదిరిన పలు అంశాలపై ఇదివరకే ప్రత్యేక చట్టాలు కూడా వచ్చాయి. అలాంటప్పుడు గుండుగుత్తగా అందరినీ ఒకే గంప కిందకు తోసి కొత్తగా చట్టం తేవాల్సిన అవసరం ఏమున్నదని కొందరు అంటున్నారు. కానీ బీజేపీ ఆలోచన వేరుగా ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ అంశంపై ఆవేశకావేశాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చనేదే ఆ పార్టీ ఎజెండా. ఈ నేపథ్యంలో దేశ ప్రజలను నిలువునా చీల్చేందుకు తెస్తున్న ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రతిఘటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ సూత్రబద్ధమైన వైఖరి ప్రకటించడం సరైన సమయంలో సరైన నిర్ణయం!