మాటల ఉచ్చులో పడని మునుగోడు జనం కుబేరుల కుట్రలను కూల్చేశారు. ప్రగతి పోరును బలపరుస్తూ, జన సర్కార్కు జై కొట్టారు. ఎన్నికలను విన్యాసాలుగా మార్చి, ఓటర్లను ఏమార్చలేమని కమలనాథులు తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు పౌరులే దానికి రక్షకులుగా నిలుస్తారని బీజేపీ గ్రహించాలి.
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ తాను నమ్ముకున్న మాయోపాయాలన్నీ ఆచరణలో పెట్టినా, అసహ్యకర అస్ర్తాలన్నింటినీ సంధించినా, ప్రజలు మాత్రం ప్రగతి ఫలాలు అందించిన గులాబీ పార్టీకే పట్టం కట్టారు. దీంతో ఉపఎన్నికను మునుగోడు జనం మీద బీజేపీ రుద్దడం వెనక జుగుప్సాకరమైన ఎత్తుగడ ఉన్నదనేది తేటతేల్లమైంది. రాజగోపాల్రెడ్డి రాజీనామాకు అహంకారం, ఆధిపత్యం, ధన మోహంతో పాటుగా కమలం పార్టీ దురాక్రమణ పన్నాగం కూడా కారణమైంది. ఇంకా అంతకుమించి కేసీఆర్ అమలు పరుస్తు న్న అభివృద్ధి నమూనా ఢిల్లీ పెద్దలకు గాఢ నిద్ర లో కూడా వెంటాడే పీడ కలగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేండుగా అమలుపరుస్తున్న అభివృద్ధి పథకాలన్నీ, మా రాష్ర్టాల్లో కూడా కావాలనే డిమాండ్లు దేశం నలుమూలల మొదలవ్వడం మోదీ పరివారానికి నచ్చలేదు. వీటన్నింటికీ మించి జాతీయ రాజకీయాల్లో కేసీఆర్కు పెరుగుతున్న ప్రాధాన్యం, దేశాన్ని దారి తప్పిస్తున్న మోదీ సర్కారీ విధానాలపై కేసీఆర్ సూటిగా నిలదీయడం కాషాయ పెద్దల పగకు కారణమైంది.
పోరాట నేపథ్యం, పాలనానుభవం కలిగిన కేసీఆర్, దేశ రుగ్మతల నిర్మూలనకు నడుం బిగించడం మోదీ, షాలకు పుండు మీద కారం చల్లినట్లయింది. బీజేపీ ఇప్పటిదాకా ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసింది. ఇదే విధానాన్ని తెలంగాణలోనూ అమలుచేయాలని కుట్ర పన్నింది. కానీ పగబట్టిన వాడెవడో, పరాయి వాడెవడో తెలంగాణ పసి గట్టలేదా? ‘ఏమరుపాటుకు లోనైతే మళ్లీ గోసపడతామని’ బంగారి గడ్డలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ సూటిగా ఇచ్చిన సందేశాన్ని ప్రజ లు అర్థం చేసుకున్నారు.
సుదీర్ఘకాలం పాటు కన్నీళ్లు ఒడబోసుకొని తాగిన మునుగోడు ప్రజలకు కష్టాల బతుకులు ఎంత దుర్లభంగా ఉంటాయో తెలుసు. అందుకే మంచినీళ్లు అందించడంతో పాటు అన్నివిధాలుగా అండగా నిలిచిన కేసీఆర్ సర్కార్ను ఎవరైనా ఎందుకు వద్దనుకుంటారు? అభివృద్ధిలో అద్భుత ఫలితాలు సాధించడం వల్లే నేడు తెలంగాణ అభివృద్ధి దేశవ్యాప్త నినాదంగా మారింది. కండ్ల ముందటి వాస్తవాలను విశ్లేషించుకోలేని దుస్థితిలో మునుగోడు ప్రజలు లేరు. అందుకే బీజేపీని బండకేసి కొట్టారు. ఆ పార్టీ ప్రచారం చేసిన అబద్ధాలను నమ్మలేదు. ఎన్నికల్లో గెలవడం కోసం బీజేపీ శ్రేణులు పలివెల గ్రామంతో పాటు అనేకచోట్ల హింసాత్మక దాడులకు దిగాయి. డబ్బులు, మద్యం, బెదిరింపులను ఆసరాగా చేసుకొని గెలవాలనుకున్నారు. కానీ వారు ఎత్తులను ప్రజలు తిప్పికొట్టారు.
చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అయినా ప్రశంసనీయ స్థానం సంపాదించుకొనేందుకు తాపత్రయపడుతుంది. కానీ బీజేపీ పెద్దలు మాత్రం విషం కుమ్మరించి విస్తరణను కోరుకుంటున్నారు. ఏం ఆశించి, ఏ గమ్యానికి దేశాన్ని నడిపేందుకు ఇంత పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారో? ఇటీవల సీఎం కేసీఆర్ ఆవేదనతో అడిగినట్లు ప్రజాస్వామ్యాన్ని తగలబెట్టాక భారత దేశంలో బతికుండేదేముందని? కాబట్టి.. అందరం మోదీ ముఠాను నిలదీయాల్సిన సం దర్భం వచ్చింది.
దర్యాప్తు సంస్థలను వేటకుక్కల్లా ఉసిగొల్పి, మఠాధిపతులకు వలలిచ్చి, చివరికి ఎన్నికల సంఘం అధికారులనూ బెదిరించిన బీజేపీ నాయకుల ఫ్యాక్షనిజం తీరును చూసిన తర్వాత దేశానికి అతిపెద్ద ప్రమాదకారుల గుంపు బీజేపీ పరివారమేనని అందరికీ అర్థమైంది. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక కమలం పార్టీ కుట్రలను నగ్నంగా ప్రజల ముందు నిలబెట్టింది. తెలంగాణను చెరబట్టేందుకు, కేసీఆర్ను నిలువరించేందుకు మోదీ, షా ఎంతటి పశుత్వాన్నైనా ప్రదర్శిస్తారనే విషయం తెలంగాణ సమాజానికంతటికీ అర్థమైంది. కుట్రదారులకు ఎలా బుద్ధి చెప్పాలో చైతన్యశీలమైన తెలంగాణనే చూసుకుంటుంది. దేశంలోని గుప్పెడు మంది కుబేరులకు కల్ప తరువుగా మారిన కేంద్ర సర్కార్ రూపాయికి రంధ్రం చేసి దేశాన్ని దివాళా తీయిస్తున్నది. దేశ ప్రజలందరినీ అరిగోస పెడుతూ, సకల సంపదల దేశానికి దరిద్రాన్ని బహూకరిస్తున్న బుద్ధి మాంద్య బీజేపీని గద్దె దింపే పోరాటం నేడు చారిత్రక అవసరం. యువత, రైతులు, జర్నలిస్టులు, బుద్ధిజీవులం తా కాలం కల్పించిన బాధ్యతను దేశం కోసం తలకెత్తుకోవాలి. దేశంలో పడ్డ దొంగలను తరిమేటందుకు కేసీఆర్ చెయ్యందుకుని ముందు కుకదలాలి.
– డాక్టర్ ఆంజనేయ గౌడ్
98853 52242