మోదీ సర్కారు రెండోదఫా అధికారంలోకి వచ్చి నిన్నటితో మూడేండ్లు పూర్తయింది. మొత్తంగా మోదీ ప్రభుత్వానికి ఎనిమిదేండ్లు నిండాయి. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ హయాంలో వివిధ కుంభకోణాలు చూసి విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకున్నారు. దురదృష్టం కొద్దీ దేశంలో జాతీయ పార్టీలదే పైచేయి కావడంతో ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారు. కానీ ప్రజల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లు అయింది. ఇంకా చెప్పాలంటే 2014 నుంచి దేశ ప్రజలకు చీకటి రోజులు మొదలయ్యాయి.
ఎలాగైనా అధికారంలోకి రావడానికి ఆచరణ సాధ్యం కాని ఎన్నో హామీలను గుప్పించింది బీజేపీ. విదేశాల్లో ఉన్న నల్లధనం వెనక్కి తెస్తామని.. ప్రజల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.15 లక్షల వంతున జమ చేస్తామని మోదీ స్వయంగా చెప్పారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని ఎన్నికల స్టంట్గా అమిత్ షా కొట్టిపడేయడంతో బీజేపీ మోసాలు మొదలయ్యాయి. గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తామని చెప్పి, నేడు వెయ్యి దాటినా ఇంకా పెంచుతూనే ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలతో నిమిత్తం లేకుండా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వెళ్తున్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ద్రవ్యోల్బణం అదుపు తప్పింది.
బీజేపీ విధానపరమైన నిర్ణయాల విషయానికొస్తే.. 2014 నుంచి మోదీ ప్రభుత్వం తీసుకున్న ఏ ఒక్క నిర్ణయం కూడా దేశ ప్రజలకు మేలు చేయలేదు. పెద్దనోట్ల రద్దు, లాక్డౌన్, జీఎస్టీ, రైతు వ్యతిరేక చట్టాలు, జీడీపీ వృద్ధి రేటు పతనం, నిరుద్యోగిత రేటు పెరగడం వంటివి మొదలుకొని నిన్న మొన్నటి కరోనా విషమ పరిస్థితుల వరకు ఏవీ ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయాయి. దేశంలో ఆక్సిజన్ కొరత ఏర్పడి కరోనా రెండో దశలో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే కేంద్రం చోద్యం చూస్తూ కూర్చున్నది తప్ప.. చేసిందేమీ లేదు. కరోనా వల్ల దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న తర హా పరిశ్రమల పునరుద్ధరణ పేరిట కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ సైతం ఆచరణకు నోచుకోలేదు.
ఎనిమిదేండ్ల పాలనలో ప్రజలకు చేసిందేమిటో చెప్పకుండా.. అభివృద్ధి అనే అంశమే చర్చకు రాకుండా, కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టి బీజేపీ పబ్బం గడుపుకొంటున్న తీరును దేశ ప్రజలంతా గమనిస్తున్నారు. 2014లో యువతకు మోదీ హామీ ఇచ్చినట్లు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన అమలు కాలేదు. మరోవైపు, ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వరంగ సంస్థల ఊపిరి తీస్తోం ది ప్రభుత్వం. కేంద్రం పరిధిలో ఉన్న 16 లక్షల ఖాళీలను భర్తీ చేయకపోగా, రైల్వేలో 70 వేలకు పైగా ఉద్యోగాలను మోదీ సర్కారు రద్దు చేసింది.
బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలతో మోదీ సర్కారు వ్యవహరిస్తున్న తీరు సమాఖ్య వ్యవస్థకే గొడ్డలిపెట్టుగా మారింది. తెలంగాణ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ర్టాల్లో బీజేపీ తీరు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న రైతుబంధు, మిషన్ భగీరథ సహా పలు సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాలను కాపీ కొడుతున్న కేంద్రం ఇక్కడి ప్రభుత్వాన్ని, పాలనా విధానాలను విమర్శించడం సిగ్గుచేటు. కొత్త రాష్ట్రంగా ఎనిమిదేండ్ల కిం దట పొద్దుపొడిచిన తెలంగాణ నేడు అభివృద్ధి విషయంలో దేశానికే స్ఫూర్తినిచ్చే స్థాయికి ఎదిగింది. విద్యుత్ సంక్షోభంతోపాటు ఎన్నో సవాళ్ళను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ, నేడు దేశ ఆర్థికవ్యవస్థకు ఊతం ఇస్తున్న మొదటి ఐదు రాష్ర్టాల్లో ఒకటిగా నిలబడింది.
అభివృద్ధి మీద చర్చ పెడితే తెలంగాణలో తమ పప్పులుడకవని తెలిసి, సం బంధం లేని అంశాలను, కుల మతాలను అడ్డం పెట్టుకొని బీజేపీ తెలంగాణలో లబ్ధి పొందాలని చూస్తున్నది. కానీ తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు అన్న విషయం మర్చిపోతోంది. కేంద్ర ప్రభుత్వం వరుస వైఫల్యాల సాక్షిగా తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో ఆ పార్టీని పూర్తిస్థాయిలో బొందపెట్టడానికి సిద్ధంగాఉన్నారు. నిండు పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అవమానించిన మోదీ వైఖరిని ఇక్కడి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ నాటినుంచి విభజన హామీల అమలు, అభివృద్ధి విషయంలో రాష్ర్టానికి మోదీ సర్కారు మొండి చేయి చూపుతున్న విధానంతోపాటు ప్రతీ అంశాన్ని ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు.
గుడి-మసీదు రాజకీయాలకు కాలం చెల్లింది. ప్రజలు, యువత మార్పు కోరుకుంటున్నారు. మోదీ సర్కారు ఎనిమిదేండ్ల వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్న తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ రూపంలో పురుడు పోసుకున్నది. స్వరాష్ట్రం కోసం నాడు కేసీఆర్ ఒక్కడే బయలుదేరిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. యావత్ తెలంగాణను ఏకం చేసి రాష్ర్టాన్ని సాధించిన విషయం ప్రజల హృదయాల్లో పదిలంగా ఉంది. ఎనిమిదేండ్ల తెలంగాణ పురోగతి సాక్షిగా, కేంద్రంలోని మోదీ సర్కారు వైఫల్యాలను దేశప్రజలకు ఎత్తిచూపడానికి కేసీఆర్ ఢిల్లీ వైపు వేస్తున్న అడుగులు చూసి బీజేపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీనికి నిదర్శనమే, గడిచిన రెండు నెల ల్లో ప్రధాని నరేంద్ర మోదీ, 8 మంది కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణ పర్యటనలు. రాజకీయ కూటముల కోసం కాకుండా, ఒక ప్రత్యామ్నాయ ఎజెండా కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు త్వరలోనే దేశ ప్రజల మద్దతు పెద్ద ఎత్తున లభించబోతున్నది. దేశంలో మార్పు పురుడు పోసుకుంటోంది. బీజేపీ కబంధహస్తాల నుంచి భారతదేశాన్ని రక్షించటమే లక్ష్యంగా ఈ మార్పు చోటుచేసుకోనున్నది.
మోదీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి దేశ అభివృద్ధితో సంబంధం లేని అంశాలను పైకి తీసుకొస్తున్నది. మతం, కులం పేరుతో వైషమ్యాలను రెచ్చగొట్టి, తమ వైఫల్యాలు ప్రజల్లో చర్చకు రాకుండా చూస్తున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఇలాంటి పరిణామాలు శోచనీయం.
– బాల్క సుమన్
(వ్యాసకర్త: ప్రభుత్వ విప్)