గత మూడేండ్లలో మోదీ గుజరాత్కు 15 సార్లు వెళ్లారు. వెళ్లిన ప్రతిసారి వరాలు జల్లులు కురిపించారు. కానీ ఎనిమిదేండ్లుగా తెలంగాణకు 8 సార్లు కూడా రాలేదు. వచ్చిన ఏడు సార్లయినా రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారు తప్ప తెలంగాణ అభివృద్ధికి ఎటువంటి ఇవ్వలేదు. అంటే దీని అర్థం మోదీ గుజరాత్కే ప్రధానమంత్రా? లేకుంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అంతర్భాగం కాదా?
1. మోదీ 2016 ఆగస్టు 7న రాష్ర్టానికి మొదటిసారి వచ్చారు. తొలి పర్యటన కాబట్టి రాష్ర్టానికి ఏం వరాలిస్తాడోనని ప్రజలు ఆసక్తిగా చూశారు. కానీ ఆయన మాటల తో మాయ చేసి రాష్ట్ర ప్రజల్ని నిరాశపరిచారు.
2. 2017లో అంతర్జాతీయ జీఈఎస్ సమావేశానికి మోదీ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మియాపూర్ నుంచి నాగోల్ వరకు మెట్రో సదుపాయాన్ని మోదీ ప్రారంభించారు. అప్పుడూ ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో ఉన్న హామీలు, బీజేపీ ఎన్నికల ప్రచారంలో మోదీ ఇచ్చిన హామీల గురించి మాట కూడా మాట్లాడలేదు.
3. 2018లో ప్రధాని మోదీ రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్నగర్లలో పర్యటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. నిజామాబాద్లో పసుపు రైతులు, పసుపుబోర్డు గురించి కూడా మాట్లాడలేదు. మహబూబ్నగర్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి మాట్లాడలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ను మాత్రం విమర్శించారు. అందుకు గాను 118 నియోజకవర్గాల్లో బీజేపీకి దక్కింది ఒక్క సీటు.
4. 2019లో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగం గా మోదీ మహబూబ్నగర్, హైదరాబాద్లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. తెలంగాణకు కేంద్రం చేయాల్సిన అభివృద్ది పనులను మరిచి, అప్పుడూ కేసీఆర్ను విమర్శించారు. నారాయణపేట్ టెక్స్టైల్ ప్రాజెక్టుకు కేంద్రం నిధులిస్తుందని మాటిచ్చి ఇప్పటివరకూ ఇచ్చిందిలేదు.
5. 2020, నవంబర్ 28న జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు భారత్ బయోటెక్ సంస్థకు వచ్చారు. ఎక్కడ ఫొటోలో సీఎం కేసీఆర్ పడుతారో అనే భయంతో ఆయన్ను రావొద్దని ప్రధాని కార్యాలయం చెప్పింది. 2021లో తెలంగాణ మొహమే మోదీ చూడలేదు. 2017, 21లో గుజరాత్లో వరదలు వస్తే తన విమానం నుంచి సర్వే చేసిన మోదీ, 2020లో హైదరాబాద్లో భీభత్సమైన వరదలొస్తే మాత్రం పైసా సాయం చేయలేదు.
6. 2022లో రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చారు. అప్పుడూ తెలంగాణకు ఇచ్చిన హామీలపై నోరు మెదపలేదు.
7. మే 26న మోదీ తెలంగాణకు వచ్చి, ‘ఐఎస్బీ’ ఇరవై ఏండ్ల సభలో పాల్గొన్నారు. విమానాశ్రయం వద్ద బీజేపీ నిర్వహించిన సభలో మళ్లీ రాజకీయాలే మాట్లాడారు. గత ఎనిమిదేండ్ల పాలనలో, రానున్న రెండేండ్లలో తాను ఏం చేస్తారో చెప్పకుండా మళ్లీ కేసీఆర్నే విమర్శించి తన స్థాయిని దిగజార్చుకున్నారు. 8 బడ్జెట్లలో, ఏ ప్రకటనల్లో తెలంగాణ ప్రస్తావన లేదు. ఈ ఎనిమిదేండ్లలో మోదీ తెలంగాణకు 8 సార్లు కూడా రాలేదు. ఇదిపోను ఎన్నో వేదికలపై తల్లిని చంపి పిల్లకు జన్మనిచ్చారని తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కారు. గుజరాత్కు వెళ్లిన ప్రతిసారి వేల కోట్లతో కార్యక్రమాలు మొదలుపెట్టి, తెలంగాణకు వచ్చిన కొన్నిసార్లూ కేవలం ఉపన్యాసాలే ఇచ్చిన మోదీని తెలంగాణ ప్రజలు రాజకీయ పర్యాటకుడిగానే చూస్తారు.
(వ్యాసకర్త: రీసెర్చ్ స్కాలర్, ఓయూ)