న్యాయం చేయడం ఆలస్యమైతే అన్యాయం చేసినట్టే అనేది పెద్దల మాట. ఓ విచారణ ఖైదీ తన కేసు కోర్టు ముందుకు రావడానికే పదేండ్ల కాలం ఎదురుచూడాలా? ముదివగ్గులు తమ ఆస్తి తగాదాల పరిష్కారానికి 30-40 ఏండ్లు ఓపిక పట్టగలరా? మన దేశంలో న్యాయవ్యవస్థ ఎదుర్కొనే అతిపెద్ద సమస్య పెండింగ్ కేసులు. ‘న్యాయవ్యవస్థ స్థితిగతులు’ అనే శీర్షికతో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని పరిశోధన, ప్రణాళిక కేంద్రం ఇటీవల వెలువరించిన ప్రత్యేక నివేదిక దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించింది. పెండింగ్ కేసులు గుట్టలుగా పేరుకుపోవడం వెనుక గల కారణాలను కొంత మేర విశ్లేషించింది.
దేశంలోని వివిధ కోర్టుల్లో 2023 అక్టోబర్ నాటికి పెండింగ్ కేసుల సంఖ్య 5 కోట్ల పై చిలుకే. మూడంచెల న్యాయవ్యవస్థలోని సుమారు 20,580 మంది న్యాయమూర్తులు వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది. హైకోర్టు జడ్జి స్థానాల్లో 30 శాతం, జిల్లా జడ్జి పోస్టుల్లో 20 శాతం ఖాళీగా ఉన్నాయి. కేసుల సంఖ్యకు, జడ్జిల సంఖ్యకు మధ్యన పొంతన లేకపోగా అందులో భారీస్థాయిలో ఖాళీలున్నాయని దీనిద్వారా స్పష్టమవుతున్నది. జనాభా ప్రాతిపదికన జడ్జిల సంఖ్యను పెంచాలని వచ్చిన ప్రతిపాదనను సుప్రీంకోర్టు 2002లో సమర్థించింది. కేసుల సంఖ్యను బట్టి జడ్జిలను నియమించాలని 2014లో లా కమిషన్ సూచించింది. ఇలా వేర్వేరు కమిటీలు కొత్త కొత్త ప్రతిపాదనలు ముందుకు తెస్తూనే ఉన్నాయి. ఖాళీల భర్తీలో జరిగే జాప్యం మరో సమస్య. దేశంలో కేవలం 9 రాష్ర్టాలు మాత్రమే నిర్దేశిత సమయంలో భర్తీలు పూర్తి చేయగలుగుతున్నాయని సుప్రీంకోర్టు జరిపించిన అధ్యయనంలో వెల్లడైంది.
ప్రపంచదేశాలతో పోలిస్తే భారతదేశంలో జనాభా-జడ్జి నిష్పత్తి అట్టడుగుస్థాయిలో ఉన్నది. అత్యధిక జనాభా కలిగిన చైనాలో 10 లక్షల జనాభాకు 300 మంది జడ్జిల చొప్పున ఉన్నారు. అదే అమెరికాలో 150 మంది ఉన్నారు. మన దేశంలో పది లక్షల జనాభాకు కేవలం 20-21 మంది జడ్జిలున్నారు. మన దేశంలో పెండింగ్ కేసులను బట్టి చూస్తే జడ్జిల సంఖ్య చాలా చాలా పెంచాల్సి ఉందనేది నిర్వివాదాంశం. ఇక న్యాయ నియామకాల విషయంలోనూ ఒక్కో దేశంలో ఒక్కో పద్ధతి ఉంటుంది. మౌలికంగా చూస్తే రాజకీయ, రాజకీయేతర నియామకాలుంటాయని చెప్పాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన బ్రిటన్లో న్యాయ నియామకాలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన జ్యుడిషియల్ కమిషన్ అజమాయిషీలో స్వేచ్ఛగా జరుగుతాయి. పార్టీ రాజకీయాలకు ఈ నియామకాల్లో ఏ మాత్రం ప్రమేయం ఉండదు. కాగా అమెరికాలో న్యాయ నియామకాలు ప్రభుత్వాధినేతల కనుసన్నల్లో జరుగుతాయి. మన దేశంలో ఉన్నత న్యాయస్థానాల ఖాళీల భర్తీలు, బదిలీలకు సంబంధించిన కొలీజియం వ్యవస్థపై సర్వోన్నత న్యాయస్థానానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నియామకాలు న్యాయ పర్యవేక్షణలో కాకుండా ప్రభుత్వ అజమాయిషీ కింద జరిగేలా చూసేందుకు కేంద్రం తలపెట్టిన న్యాయ నియామకాల చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. తదనంతర కాలంలో కొలీజియం సిఫారసులపై జాప్యం జరుగుతుండటంతో కొంత అస్థిరత నెలకొంటుండటం చూస్తున్నాం. మన దేశంలో ఒక అంచనా ప్రకారం.. సగటున ఒక కేసు విచారణకు హైకోర్టుల్లో మూడేండ్ల ఒక నెల పడుతుంది. అదే జిల్లా కోర్టుల్లోనైతే ఆరేండ్లు పడుతుంది. అమెరికాతో సహా పలు అభివృద్ధి చెందిన దేశాల్లో 6 నెలల నుంచి సంవత్సరం కాలంలో కేసు పరిష్కారమవుతుంది. మనం ఆ స్థాయిని అందుకోవడం ప్రస్తుతానికైతే దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
న్యాయ నియామకాల్లో జాప్యంతో పాటుగా పదే పదే దృష్టికి వచ్చే మరో సమస్య సామాజిక సమగ్ర ప్రాతినిధ్యం. విస్తృత సామాజిక, భౌగోళిక, మతపరమైన వైవిధ్యం కలిగిన దేశం మనది. ఆ సమగ్రత న్యాయ నియామకాల్లో ప్రతిఫలిస్తేనే ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం కుదురుతుంది. మహిళా జడ్జిల సంఖ్యతో పాటుగా వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యాన్ని కూడా నివేదిక విశ్లేషించింది. జడ్జిల నియామకాల్లో సామాజిక వర్గాల వారీగా ప్రాతినిధ్యం గురించిన లెక్కలను ఇటీవల కేంద్ర న్యాయశాఖ పార్లమెంటుకు సమర్పించింది. హైకోర్టు జడ్జిల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు 25 శాతం, సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులు కేవలం ముగ్గురు (8.85 శాతం) మాత్రమే ఉండటం ఆలోచించాల్సిన విషయమే. అయితే హైకోర్టుల్లో ఈ సంఖ్య కాస్త మెరుగ్గా 14.1 శాతంగా ఉన్నది. మన ఉన్నత న్యాయస్థానాల్లో సామాజికవర్గాల వారీగా నియామకాలు జరుగవనేది తెలిసిందే. కేసులకు తగ్గట్టుగా న్యాయమూర్తుల పోస్టులను మంజూరు చేసి, భర్తీ చేయడం, మహిళా ప్రాతినిధ్యం, సామాజిక ప్రాతినిధ్యం తగిన స్థాయిలో కల్పించడం జరిగితే, సకాలంలో న్యాయం జరుగుతుందన్న భరోసా ప్రజలకు ఏర్పడుతుందని చెప్పవచ్చు.