New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో ఎండలతోపాటు కూరగాయల ధరలు కూడా మండిపోతున్నాయి. ఆటోలు, ట్యాక్సీ వాలాలు సమ్మె చేస్తుండటంతో ఈ ప్రభావం కూరగాయలపై పడింది. గురువారం ప్రారంభమైన సమ్మె శుక్ర, శనివారాల్లో కూడా కొనసాగనుంది. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం కమర్షియల్ వాహనాలపై పర్యావరణ సెస్ పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని క్యాబ్లు, ఆటోలు, ట్రాలీ యాజమాన్యాలు బంద్ నిర్వహిస్తున్నారు.
దీంతో రవాణాకు ఆటంకాలు ఏర్పడటంతో మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏకంగా హోల్సేల్ మార్కెట్లలోనే కూరగాయల ధరలు రెండు, మూడు రెట్లు పెరిగిపోయాయి. ఇంతకుముందు కొత్తిమీర కేజీ రూ.40 ఉండగా, ఇప్పుడు అది రూ.100కు పైగా చేరింది.ఢిల్లీలోని పెద్ద మార్కెట్లలో ఒకటైన ఆజాద్పూర్ మండిలో కూడా కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఢిల్లీ వాసులు కూరగాయలు కొనేందుకు జంకుతున్నారు. సామాన్యుల్ని ఈ ధరలు ఇబ్బంది పెడుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో కేజీ అల్లం రూ.130, కేజీ నిమ్మకాయలు రూ.100 పలుకుతున్నాయి.
అయితే, ఎక్కువ రోజులు నిల్వ చేసుకోగలిగే ఉల్లి, ఆలూ, వెల్లుల్లి వంటి వాటి ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ అందుబాటులో ఉన్నాయి. సమ్మె కారణంగా మార్కెట్లో వీటి రాక కూడా తగ్గిపోయింది. ఇంకా ఒకట్రెండు రోజులకు సరిపడా మాత్రమే కూరగాయల నిల్వ ఉన్నాయని మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు. కూరగాయల ధరలతోపాటు ఢిల్లీ ప్రజలు రవాణాకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఢిల్లీ ప్రజలు ఎక్కువగా ప్రభుత్వ రవాణా సౌకర్యాలైన బస్సులు, మెట్రో, లోకల్ ట్రైన్లలోనే ప్రయాణిస్తున్నారు. దీంతో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో విపరీత రద్దీ నెలకొంది.