Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ పై రోజురోజుకీ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ క్రీడా ప్రధాన కథా చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను చిత్రబృందం వేగవంతం చేసింది. రేపు భోపాల్లో భారీ స్థాయిలో సంగీత వేడుక జరగనున్న నేపథ్యంలో చిత్రబృందం అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమాలోని ప్రత్యేక గీతం “హెల్లల్లలో” అనే పాటకి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్, శృతి హాసన్ స్టెప్పులకి ఫ్యాన్స్కి మాంచి కిక్ ఇచ్చాయి. ఫుల్ సాంగ్ మార్చి 23న రానుంది.
ఈ పాటకు ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. ఆయన సంగీతం అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అందులోనూ ఇది ప్రత్యేక గీతం కావడంతో ఈ పాటపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రేపు జరగనున్న సంగీత వేడుకలో ఈ పాటను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ పాటలో ఇంకో కథానాయిక కూడా కనిపించనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఆమె ఎవరు అన్న విషయం మాత్రం చిత్రబృందం ఇంకా రహస్యంగానే ఉంచింది. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.
భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం ఇప్పుడు ప్రత్యేక గీతం వార్తతో మరింత చర్చనీయాంశంగా మారింది.