ఎర్రుపాలెం, మే 22 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని రాజుపాలెం, తాటిగూడెం రెవెన్యూ గ్రామాల్లో గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో జామాయిల్, మామిడి తోటలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి వేగంగా వ్యాపించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం ఏడుగురు రైతులకు చెందిన ఆరు ఎకరాల ముప్పై గుంటల జామాయిల్ తోటలు, ఒక ఎకరం ముప్పై గుంటల మామిడి తోట మంటల్లో కాలిపోయాయి. ఈ ఘటనలో జామాయిల్ తోటలకు సుమారు రూ.10 లక్షలు, మామిడి తోటకు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోయారు. అగ్నిప్రమాదం కారణంగా పూర్తిగా ఆర్థికంగా దెబ్బతిన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. సంబంధిత అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, నష్టాన్ని అంచనా వేసి తగిన నష్ట పరిహారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు.