హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ( Future City ) పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ( Harish Rao ) ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని వందశాతం రద్దు ( Cancel ) చేస్తామని వెల్లడించారు. విదేశి పర్యటనలో ఉన్న ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. కేంద్ర పర్యావరణ శాఖ ఫార్మా సిటీకే అనుమతి ఇచ్చిందని వివరించారు. వీటిలో 75 శాతం ఫార్మా సిటీ ఉండి, 25 శాతం మిగతావి ఉండాలని సూచించిందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 75 శాతం వ్యాపారం, కేవలం 25 శాతమే ఫార్మా వచ్చేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇది చట్ట ప్రకారం చెల్లదని పేర్కొన్నారు. ఫార్మా సిటీ వస్తే దానికి అనుబంధంగా కనీస సౌకర్యాలు ఎడ్యుకేషన్, హౌసింగ్ రావాలని తెలిపారు. హై కోర్టులోఒక కేసులో తాము ఫార్మా సిటీని కంటిన్యూ చేస్తున్నామని రేవంత్ ప్రభుత్వం చెప్పి డ్రామా ఆడుతుందని విమర్శించారు. డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని పార్లమెంట్ చట్టంలో ఉందని గుర్తు చేశారు.
ఫార్మా సిటీని రీస్టోర్ చేస్తామని, ఇది నా మాట కాదు, పార్లమెంట్ చట్టమని తెలిపారు. ఫార్మా సిటీ వస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించామని, మన దగ్గర నుంచి ఒక్క ఫార్మా కంపెనీ బయటికి వెళ్లొద్దని చేశామని వివరించారు. ఇప్పటికే రెండున్నర ఏళ్లు గడిచిపోయింది. చివరి సంవత్సరం ఎన్నికలు ఉంటాయి.
రేవంత్ సర్కార్ ఏమీ చేయలేదు. భూములు పంచి పెట్టి బ్యాక్ ఎండ్ ఏదో లబ్ది పొందాలని ప్లాన్ చేశారని ఆరోపించారు. ఫార్మా సిటీ అభివృద్ది చెందితే బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుందని గ్రహించి ఫార్మాసిటీని వ్యాపారానికి వాడుకుంటున్నారని వెల్లడించారు. కచ్చితంగా బీఆర్ఎస్ ఉన్నది, ఉన్నట్టుగా అక్కడ ఫార్మా సిటీనే వస్తుందని స్పష్టం చేశారు.