రాష్ర్టాభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించడంలో, వాటిని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటున్నది. భవిష్యత్ అవసరాలను గమనిస్తూ అవకాశాలున్న రంగాలను ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలోనే వైద్య పరికరాల ఉత్పత్తిని విశేషంగా ప్రోత్సహిస్తున్నది. రాష్ర్టాన్ని వైద్య పరికరాల ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ సారథ్యంలో మంత్రి కేటీఆర్ తీసుకుంటున్న చొరవ చెప్పుకోదగ్గది. 2017లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘మెడికల్ డివైజెస్ పార్క్’ అంతర్జాతీయంగా పెట్టుబడులను అమితంగా ఆకర్షిస్తున్నది. నాలుగేండ్లలోనే అనేక సంస్థలకు ఈ పార్కు నెలవైంది. డిసెంబరు 15న ఒకేరోజు ఏడు సంస్థలు ఇక్కడ ప్రారంభం కావటం గమనార్హం.
ఔషధ ఉత్పత్తి రంగంలో మన దేశానిది ప్రపంచంలో మూడో స్థానం. జెనెరిక్ మందులు, వ్యాక్సిన్లను ఎగుమతి చేయడంలో ప్రపంచంలోనే ముందున్నది. దేశంలోని ఔషధ ఉత్పత్తిలో 40 శాతానికి పైగా వాటా తెలంగాణదే. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో హైదరాబాద్లోనే మూడో వంతు ఉత్పత్తి అవుతుండటం తెలంగాణకే గర్వకారణం. అయితే, వైద్య పరికరాల విషయంలో మాత్రం దిగుమతులపై ఆధారపడుతున్నది. దేశానికి అవసరమైన వైద్య పరికరాల్లో 80 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. గత మూడేండ్ల నుంచి వైద్య పరికరాల దిగుమతులు మరింత పెరిగాయి. 2018-19లో 570 కోట్లడాలర్ల విలువైన వైద్య పరికరాలను దిగుమతి చేసుకున్నాం. కరోనా నేపథ్యంలో వీటి దిగుమతి మరింత పెరిగింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. వ్యాక్సిన్ల ఉత్పత్తికి కేంద్రంగా ఉన్న తెలంగా ణ రాష్ట్రం, ఇక వైద్య పరికరాల ఉత్పత్తికి కేరాఫ్ అడ్రస్గా మారాలని సంకల్పించింది.
ఇందులో భాగంగానే 2017లో హైదరాబాద్ నగరానికి సమీపంలోని సుల్తాన్పూర్లో 302 ఎకరాల్లో ‘మెడికల్ డివైజెస్ పార్కు’ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే దీనిలో సుమారు 50కి పైగా కంపెనీలు, ఉత్పత్తి కేంద్రా లు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఇది దేశంలోనే అతి పెద్ద మెడికల్ డివైజెస్ పార్కు. దేశానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు అంతర్జాతీయ సంస్థలు కూడా ఇక్కడ కంపెనీలను స్థాపిస్తున్నాయి.ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ దారైన ఎస్ఎంటీ సంస్థ రూ.250 కోట్ల పెట్టుబడితో ఇక్కడ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తున్నది. ఈ మధ్యనే అనేక ప్రముఖ సంస్థలు ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్ మెడికల్ డివైజెస్ పార్కులో కార్డియాక్ డయాగ్నోస్టిక్ టూల్స్, అల్ట్రాసౌండ్ పరికరాలు, మొబైల్ వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల ఉత్పత్తిని ప్రభు త్వం ప్రోత్సహిస్తున్నది. త్రీడీ ప్రింటెడ్ బయోనిక్ ఆర్మ్స్, ఇమేజింగ్ సిస్టమ్స్, మొబైల్ డయాలసిస్ యూనిట్లు, స్టెంట్లు, ఇంప్లాంట్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నది. వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులో వైద్య పరికరాల వాటా ఎక్కువగా ఉంటుంది. మన దగ్గరే ఉత్పత్తులు ప్రారంభమై అందుబాటులోకి వస్తే నాణ్యమైన వైద్య పరికరాలు, డయాగ్నోస్టిక్ సాధనాలు తక్కువ ధరలకే లభిస్తాయి. దీంతో ప్రజలకు వైద్య చికిత్స ఖర్చు కూడా తగ్గి మేలు జరుగుతుంది.
వైద్య పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఏడా ది వ్యవధి గల వైద్య పరికరాల తయారీ పీజీ కోర్సును ఓయూ ప్రారంభించనున్నది. ‘డివైజ్ అండ్ పేషెంట్ సెఫ్టీ’ అనే ఈ కోర్సుకు మెడ్ట్రానిక్ అనే సంస్థ సహకారాన్ని అందిస్తున్నది. ఈ సంస్థ అమెరికా బయట తమ అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్లో ప్రారంభించింది. ఇప్పటికే ‘లైఫ్ సైన్సెస్ హబ్ ఆఫ్ ఇండియా’గా ఎదిగిన మన హైదరాబాద్, మెడికల్ డివైజెస్ ఉత్పత్తికి కూడా కేంద్రంగా మారడం ముదావహం.
డాక్టర్ ఎన్.యాదగిరిరావు, 9704405335
(వ్యాసకర్త: అడిషనల్ కమిషనర్, జీహెచ్ఎంసీ)