ఎన్నికలు సమీపించిన కొద్దీ ప్రతిపక్షాల విమర్శలు సహజంగానే పెరుగుతున్నాయి. వాటిని గమనిస్తున్న ప్రజలు ఒక విషయం గుర్తిస్తున్నారు. ప్రతిపక్షాలు ఏమేమి చెప్పినా రెండు ప్రశ్నలపై పూర్తిగా మౌనం పాటిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమాలకు సంబంధించి తాము ప్రస్తావిస్తున్న అంశాలను లోగడ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అమలు చేయలేదన్నది మొదటి ప్రశ్న. వాటిని తాము ప్రస్తుతం అధికారంలో గల రాష్ర్టాల్లో ఎందుకు అమలు పరచడం లేదన్నది రెండో ప్రశ్న. ఈ ప్రశ్నలను ఎవరెన్నిసార్లు వేసినా ప్రతిపక్షాల నుంచి మౌనమే సమాధానమవుతున్నది. 2018లోనూ సరిగ్గా ఇదే జరిగింది.
గ్రామాల్లోనైనా, పట్టణాల్లోనైనా సాధారణ ప్రజలకు వారి పనులు వారికి ఉంటాయి. టీవీలను కొందరే చూస్తారు. పత్రికలు చదివే అలవాటు అంతకన్నా తక్కువ. అయితే కొందరు కలిసి కూర్చున్నప్పుడు, ఆ రోజు టీవీ లేదా పత్రికలు చూసినవారి నుంచి ఆనాటి విశేషాలు అందరికీ చేరతాయి. అప్పుడు వారంతా తమలో తాము ముచ్చటించుకుంటారు. ఆ ముచ్చట్లలో భాగంగా ఆనాటి విశేషాలతో పాటు తమ అనుభవాలు, ఆలోచనలు ప్రస్తావనకు వస్తాయన్నది మనమిక్కడ ప్రత్యేకంగా గుర్తించాల్సిన విషయం. ప్రతిపక్షాల వారు పైన పేర్కొన్న రెండు ప్రశ్నలు వారి మధ్య ముందుకు వస్తున్నది ఆ విధంగానే. అట్లా వారి మధ్య వేర్వేరు అంశాలపై చర్చలు, వాదనలు సాగిన తర్వాత వారి దృష్టి, మాటలు పదును తేలుతాయి.. ఎవరైనా బయటివారు తమను కదిలించినప్పుడు అవి ఎటువంటి అరమరికలు లేకుండా స్పష్టంగా ముందుకు వస్తాయి. 2018 ఎన్నికల సందర్భంగా సగం తెలంగాణ తిరిగినప్పుడు ఇది నేను గమనించాను. ఈసారి కూడా ఇదే క్రమం జరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మొదట పేర్కొన్న రెండు ప్రశ్నలు అందులో భాగమే. ప్రతిపక్షాలవారు మాట్లాడే అన్ని మాటలను ప్రజలు విని ఆనందిస్తూనే, చివరకు తమ జీవితానుభవాలను బట్టే నిర్ణయాలు తీసుకుంటారన్నది తెలిసిందే. దానినే వారి స్పందన అంటున్నాము.
ఇప్పుడు నిర్దిష్టంగా కొన్ని విషయాల్లోకి వెళ్దాము. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోనే గాక మొత్తం దేశంలోనే ఎవరూ ఎప్పుడూ చేయని విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాన్ని పేదల కోసం ప్రకటించింది. దీని కింద గతంలో ఇచ్చిన ఇండ్లు గాక కేవలం రెండు రోజుల క్రితం ఇంకా అనేక వేల ఇండ్లను పంపిణీ చేసింది. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి ఉచితంగా ఇవ్వడం కేసీఆర్ కన్న ఒక అద్భుతమైన కల. ఇంతకుముందు దేశంలోనే ఎవరూ ఎప్పుడూ కనని కల. ఇటువంటి ఇండ్లు లక్షలాది మందికి అవసరం గనుక, అన్నింటినీ ఒకేసారి నిర్మించడం కష్టం గనుక, ఈ నిర్మాణం దశల వారీగా జరుగుతుందని, అర్హులందరికీ ఇస్తామని కేసీఆర్ మొదటే ప్రకటించారు. అదే ప్రకారం జరుగుతున్నది కూడా. ఇలాంటి ఇండ్లలో నివాసం ఎట్లా ఉన్నదో ఇంతకు ముందు ప్రభుత్వాలు ఇచ్చిన సింగిల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉంటున్నవారిని, అది కూడా ఉచితం కాని స్థితిలో, అడిగినట్లయితే, ఆ ఇండ్లను చూస్తున్న మిగిలిన వారినీ అడిగినట్లయితే, వారందరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుంది. క్రమక్రమంగా తామందరికీ ఈ అవకాశం లభిస్తుందనే నమ్మకంతో పేదలున్నారు.
కానీ, ఇటువంటి గొప్ప కలలు ఎన్నడూ కనని, తమ దశాబ్దాల పాలనలో ఎక్కడా అమలు పరచని పార్టీలు చేస్తున్నదేమిటి? అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ‘తక్షణమే’ ఇవ్వాలంటూ అతి చవకబారు రాజకీయంతో నినాదాలు, కొందరిని రెచ్చగొట్టే ప్రదర్శనలు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని, ప్రస్తుతం పాలిస్తున్న చోట ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నలకు మాత్రం మౌనమే సమాధానం. ఇదంతా 2018 ఎన్నికల సమయంలోనూ జరిగింది.
వీరి తీరుని గమనించిన ప్రజలు తమ స్పందన ఏమిటో అపుడు చెప్పారు. ఇప్పుడు 2023 ఎన్నికలు సమీపిస్తుండగా, గతం నుంచి పాఠమేమీ నేర్వని ప్రతిపక్షాలు తిరిగి అదే పని చేస్తున్నాయి. పైన అన్నట్టు, జరుగుతున్న దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ప్రజలు ఈసారి కూడా గమనిస్తున్నారు.
సరిగా ఇదే చిత్రం కార్బన్ కాపీ వలె ఇంకా అనేక విషయాల్లో కనిపిస్తున్నది. వాటిలో కొన్ని మాత్రం చూద్దాం. అవి దళితబంధు, రైతుబంధు, రైతు బీమా, కంటి వెలుగు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, లక్షలాది పోడు భూముల పట్టాల పంపిణీ వంటివి. ఇలాంటివి ఇతర పార్టీలేవీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో గానీ, ఉమ్మడి రాష్ట్రంలో గానీ, ఇతర రాష్ర్టాల్లో గానీ అమలు చేయనివి. వీటివల్ల కోట్లాది ప్రజలు లాభపడుతుండటం కళ్లెదుట కనిపిస్తున్నదే. ఆ ప్రజలు స్వయంగా మాట్లాడుకుంటున్నదే. అయినప్పటికీ విచిత్రమేమిటంటే.. ప్రతిపక్షాలు ఇటువంటి పథకాలకు అది ఇది అంటూ వంకలు పెట్టడం, ఏదో ఒక పేరిట కొద్ది మందిని తప్పు దారి పట్టించి రోడ్లపైకి తీసుకు రావడం మినహా, మొదట పేర్కొన్న రెండు ప్రశ్నలకు మౌనం వహించడం మినహా సమాధానాలను ఎప్పుడూ ఇవ్వలేదు. ఈ రోజు కూడా ఇవ్వటం లేదు.
ఈ పథకాల్లో కొన్నింటి వల్ల కలుగుతున్న విప్లవాత్మక ప్రయోజనాలను ప్రజలు అనుభవిస్తుండటం వల్ల వారి జీవితాలు మారిపోతున్నాయి. ఉదాహరణకు బహుశా అన్నింటి కన్నా ఘనమైనది దళితబంధు. ఈ వర్గాలు వేల సంవత్సరాలుగా సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ప్రపంచంలోనే ఎక్కడా లేనంత భయంకరమైన అణచివేతకు గురవుతున్నారు. వీరికి ఇతర పార్టీల ప్రభుత్వాలు చట్టం ప్రకారం అమలు పరిచే రిజర్వేషన్లు సైతం పాక్షికంగా అమలు కావటం తప్ప, ఈ వర్గాలను యథాతథంగా పైకి తెచ్చి నిలబెట్టే దళితబంధు తరహా పథకాన్ని గత 75 సంవత్సరాల కాలంలో ఏ పార్టీ ప్రభుత్వం కూడా ఎక్కడా తలపెట్టలేదు.
వ్యవసాయం రంగం కోసం తీసుకుంటూ వస్తున్న అనేక చర్యలతో పాటు, ఇతరత్రా ఎవరూ ఎక్కడా రూపొందించని రైతు బంధు, రైతు బీమా పథకాలతో తెలంగాణ వ్యవసాయం, దానితోపాటు రైతాంగం, వ్యవసాయ కూలీలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు మరెవరి పాలనలో, మరెక్కడా లేని విధంగా అతి వేగంగా, అద్భుతంగా మారిపోతున్నాయి. ఈ మార్పులు లక్షలాది మంది చిన్న, సన్నకారు రైతుల జీవితాలలోనూ చోటు చేసుకుంటున్నాయి.
శుద్ధి జరగని మంచి నీటి ద్వారా 70 శాతం వ్యాధులు సంక్రమిస్తాయన్నది ఆరోగ్య సంస్థల నిర్ధారణ కాగా, వందకు వంద శాతం కుటుంబాలకు శుద్ధి చేసిన మంచి నీటిని ఉచితంగా ఇస్తున్న ఏకైక పెద్ద రాష్ట్రంగా మారిన తెలంగాణ మన ప్రతిపక్షాలకు మాత్రమే కనిపించదు. పైగా వారు సాకులేవో వెతుకుతుండగా, పైన పేర్కొన్న రెండు ప్రశ్నలకు జవాబివ్వలేకపోవడాన్ని సామాన్య ప్రజలు గుర్తించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. మౌలికంగా ప్రతిపక్షాలు అవి అధికారంలో ఉన్నప్పటి వైఫల్యాలే అనేక దశాబ్దాలుగా ఆ విధంగా ఉన్నప్పుడు జవాబేమీ ఇవ్వగలరు కనుక!
పైన అన్నట్టు ఇవి కొద్దిపాటి ఉదాహరణలు మాత్రమే. చెప్పేందుకు మరెన్నయినా ఉన్నాయి. అయినా, ప్రతిపక్షాలు అధికారంలో ఉండినప్పటి గత కాలం గురించి, వారు ప్రస్తుతం పాలిస్తున్న ఇతర రాష్ర్టాలు లేదా కేంద్రం గురించి తెలంగాణ సామాన్య ప్రజలకు 2018లోనే అర్థమైన పరిస్థితి ఈ సరికి మరింతగా అర్థమైంది. కేవలం రెండే ప్రశ్నలకు వారు జవాబ్వివలేకపోవడం పరిస్థితిని మరింత స్పష్టం చేస్తున్నది వారికి. కనుక తమ స్పందన ఏమిటో వారికి తెలుసు.