ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఉచితాల ప్రచారం జోరందుకున్నది. నాయకుల్లో అధికార దాహం ఎక్కువైపోయింది. గంటల్లోనే పార్టీలు మారిపోవడం, క్షణాల్లోనే నాలుకలు మడతపెట్టి నిన్నటి వరకు తానున్న పార్టీని తిట్టడం షరా మామూలైపోయింది. తమను ఎన్నుకున్న ప్రజల అభిప్రాయాలకు నాయకులు కనీసం విలువ ఇవ్వడం లేదు. ఉచితాలను ఎరగా వేసి సులువుగా అధికారంలోకి రావచ్చని పార్టీలు, అభ్యర్థులు భావిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం.
కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీతో ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ అదే వ్యూహాన్ని అనుసరించింది. ఆరు గ్యారెంటీల పేరిట ఉచితాల వల విసిరి అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆరు గ్యారెంటీల్లో భాగంగా పలు హామీలను ప్రకటించిన కాంగ్రెస్ వాటి అమలుకు నిధులను ఎలా సమకూర్చుకుంటుందో తెలియడం లేదు. వాటి అమలు సంగతి అటుంచితే వాటి వల్ల రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడుతుందనేది అక్షర సత్యం. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా పలు పార్టీలు ఉచితాలను ప్రకటిస్తూ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ముందుకొస్తున్నాయి. ఉచితాల మాయలో పడి మనం ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వాలే.. గద్దెనెక్కాక ఆ భారాన్ని మనపై వేస్తున్నాయనే విషయాన్ని ప్రజలు మరువవద్దు.
అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. దాన్ని సాకుగా చూపి సంక్షేమం పేరిట ఉచితాలు ప్రకటించడం సరికాదు. ప్రజలకు ఉచితాలే సరిపోతాయా? సాగు, తాగునీటి ప్రాజక్టులు, పరిశ్రమలు, ఉపాధి, రహదారులు, దవాఖానలు, పాఠశాలలు, కళాశాలలు, మౌలిక వసతుల అవసరం లేదా?
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే శాశ్వత పథకాలను అమలు చేసినప్పుడే వారి జీవితాలు మారుతాయి. అదే సమ యం లో ఉచితాలను చూసి ఓట్లు వేసే విధానానికి ప్రజలు స్వస్తి పలకాలి. శాశ్వత అభివృద్ధి కోసం పాటు పడే నాయకులను ఎన్నుకోవాలి.
– కన్నోజు మనోహరాచారి
79950 89083