తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను గతేడాది జూన్ 2న ప్రారంభించి 21 రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించారు. ఆ ఉత్సవాలకు కొనసాగింపుగానో, లేదా వాటికి సంబంధం లేకుండానో రాష్ట్రం ఏర్పాటై పదేండ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా ఈ ఏడాది జూన్ 2న దశాబ్ది ఉత్సవాలు జరపాలని రాష్ట్ర మంత్రివర్గం బృహత్తర ప్రణాళికను రూపొందించింది. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సోనియాగాంధీని ఆహ్వానించాలని క్యాబినెట్ నిర్ణయించింది. దీంతో నిమిత్తం లేకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మూడు రోజుల పాటు ఉత్సవాల ముగింపు వేడుకలను నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నది.
1956 నుంచి అప్రతిహతంగా సాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం చారిత్రాత్మకమైన ఒక ఎడతెగని అవిశ్రాంత, నిరంతర పోరాటం. ఏ ఒక్క వ్యక్తి కానీ, ఒక్క గ్రూపు కానీ, ఒక్క రాజకీయ పార్టీ కానీ, ఒకరిద్దరు మేధావులు కానీ, ఒకరిద్దరి రచనలు-పాటలు కానీ, కొందరి ఎలక్ట్రానిక్ మీడియా విశ్లేషణలు కానీ, పత్రికా వ్యాసాలు కానీ కాకుండా, వీరందరితో సహా ఆబాల తెలంగాణ గోపాలం, అనేక మంది మరువబడ్డ, మరుగునబడ్డ వీరుల పోరాట కారణంగానే 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. ఈ మహనీయులందరి గురించి సమకాలీన వర్తమాన తెలంగాణ చరిత్రలో అదెప్పుడు నిష్పాక్షికంగా రాస్తే అప్పుడే సువర్ణాక్షరాలతో లిఖించడం సమంజసం. కానీ, ఎంపిక చేసిన ఏ ఒకరిద్దరినో ప్రభుత్వ పరంగానో, కొన్ని ప్రభుత్వేతర సంస్థల పరంగానో సన్మానించడం బహుశా అంతగా సబబు కాదేమో!
అయితే, తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎంతోమంది ఎన్నో విధాలుగా కారణభూతులైనప్పటికీ అత్యున్నత నాయకత్వ స్థాయికి చెందిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మలిదశ ఉద్యమంలో తనదైన శైలిలో, మహాత్మాగాంధీ చూపించిన సంపూర్ణ శాంతియుత పోరాట నమూనాలో రాష్ట్ర సాధన ఉద్యమానికి సారథ్యం వహించారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి నడిపించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు దిశగా దేశంలోని 36కు పైగా రాజకీయ పార్టీలను ఒప్పించారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీకి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం మినహా గత్యంతరం, ప్రత్యామ్నాయం లేకుండా చేశారు. అందువల్ల లిఖించబోయే సమకాలీన వర్తమాన తెలంగాణ చరిత్రలో, ముఖ్యంగా ‘తెలంగాణ ఆవిర్భావం, తెలంగాణ అభివృద్ధి’ అధ్యాయాలలో కేసీఆర్ పేరు అగ్రభాగాన, సవివరంగా ఉండటం అత్యంత సమంజసం.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజల అభీష్టం మేరకు తొలి, మలి ముఖ్యమంత్రిగా ఎన్నికై తొమ్మిదిన్నరేండ్ల పాటు పదవిలో ఉన్న కేసీఆర్.. జార్జ్ బెర్నార్డ్ షా ఒకానొక ప్రబోధానికీ ప్రతిరూపంగా ఉన్నారని చెప్పవచ్చు. ‘సాధారణ ప్రజలు ప్రపంచానికి అనుగుణంగా మారుతారు. అసాధారణ వ్యక్తి ప్రపంచాన్నే తనకు అనుగుణంగా మార్చడానికి ప్రయత్నిస్తాడు. ప్రపంచ పురోగతి, బహుళార్థ అభివృద్ధి, వైవిధ్య భరితమైన మార్పు అసాధారణ వ్యక్తుల ద్వారా మాత్రమే జరుగుతుంది’ అని బెర్నార్డ్ చెప్పిన వాక్యాలు కేసీఆర్ విషయంలో అక్షర సత్యాలు. అటువంటి అసాధారణ వ్యక్తి అయిన కేసీఆర్.. తన పదవీకాలంలో వినూత్నమైన ఆలోచనలతో (ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్), పకడ్బందీ వ్యూహాలతో, సృజనాత్మకతతో సమస్యలకు పరిష్కారాలను కనుగొన్నారు. పాలనలో అద్భుతమైన కనీవినీ మార్పును తీసుకువచ్చారు. ‘సంక్షేమం, అభివృద్ధి అంటే ఇదీ’ అని సోదాహరణంగా, త్రికరణశుద్ధిగా చేసి చూపించారు. ‘తినబోయే పదార్థం రుచి తినడంలోనే ఉంది’ అన్న నానుడి ప్రకారం.. కేసీఆర్ తరహా తెలంగాణ అభివృద్ధి నమూనాను యావత్ దేశం ముందు సగర్వంగా ఉంచారు. దేశ చరిత్రలోనే ఈ నమూనా ఒక చెరిగిపోని, చెరపలేని ముద్రను వేసింది.
కేసీఆర్లో గాంధీయ విలువలు, నెల్సన్ మండేలా విధానం, విన్స్టన్ చర్చిల్ వ్యూహం, జవహర్లాల్ నెహ్రూ సిద్ధాంతం, లీ కువాన్ యూ నిబద్ధత, పీవీ నరసింహారావు ప్రగతిశీల సంస్కరణలు, డాక్టర్ ఎం.చెన్నారెడ్డి ఉద్యమ స్ఫూర్తి ప్రస్ఫుటంగా దర్శనమిస్తాయి. ఉదాహరణకు తన మొట్టమొదటి విదేశీ పర్యటనలో సింగపూర్ను సందర్శించినప్పుడు అక్కడి అసాధారణమైన, అద్భుతమైన అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయిన కేసీఆర్.. తెలంగాణ అభివృద్ధి విషయంలో అప్పటికే ఒక స్థిరాభిప్రాయానికి వచ్చినప్పటికీ సింగపూర్ అభివృద్ధి నమూనాను కూడా ఆదర్శంగా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. సింగపూర్ మొదటి ప్రధాని లీ కువాన్ యూ లాగా కేసీఆర్ కూడా తెలంగాణ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై తదేక దృష్టిని సారించారు. సింగపూర్ జాతిపితగా పేరొందిన లీ కువాన్ యూ ఆ దేశాన్ని ధనిక దేశంగా, ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మార్చినట్టే.. కేసీఆర్ కూడా తెలంగాణ పితగా రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలను పొందడమే కాకుండా రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధిలో, తలసరి ఆదాయం పెరుగుదలలో గణనీయమైన ఫలితాలు సాధించారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలిపారు. లీ కువాన్ రాసిన ‘సింగపూర్: ఫ్రం థర్డ్ వరల్డ్ టు ఫస్ట్’ పుస్తకం గురించి కేసీఆర్ ఎప్పుడూ మాట్లాడేవారు.
భారతదేశప్రప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు కేసీఆర్కు కొన్ని ప్రాముఖ్యతాంశాలలో, ముఖ్యంగా పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేసే విషయంలో సమీప సారూప్యత ఉన్నది. అనేక సందర్భాలలో నెహ్రూ, ‘ఎస్ కె డే’ల ప్రథమ కలయిక జరిగిన నేపథ్యం దరిమిలా ఆ అపురూప కలయిక మన దేశంలో గ్రామీణాభివృద్ధి దిశగా, పంచాయతీరాజ్ స్థానిక సంస్థల, సహకార సంస్థల ఆవిర్భావానికి, సమాజాభివృద్ధికి ఎలా తోడ్పడిందో వివరించేవారు కేసీఆర్.
వాస్తవానికి నెహ్రూ ప్రధాని అయిన కొత్తలో ప్రథమ పంచ వర్ష ప్రణాళిక రూపుదిద్దుకునే దశలో ఒక పర్యాయం అమెరికా పర్యటనలో ఉండగా.. ఆ దేశ అధ్యక్షుడు ఐసెన్ హోవర్ సూచనల మేరకు అతని సలహాదారుడు ఎస్ కె డేను కలిశారు. తొలుత స్వదేశానికి రావాలని నెహ్రూ ఆహ్వానించగా ఎస్ కె డే సున్నితంగా తిరస్కరించారు. అయితే భారత్లో నెహ్రూ నాయకత్వంలో జరుగుతున్న మార్పులను గమనించిన ఎస్ కె డే.. అమెరికాలో పెద్ద ఉద్యోగాన్ని వదులుకొని మరీ భారత్కు వచ్చారు. ఆ విధంగా పంచాయతీరాజ్, సహకార సంస్థల, కమ్యూనిటీ అభివృద్ధికి డే చేసిన కృషిని, నెహ్రూకు అందించిన సహకారాన్ని కేసీఆర్ స్ఫూర్తిగా తీసుకునేవారు.
నెహ్రూ ఆలోచనా సరళిలోనే పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం కోసం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని ఒక ఆదర్శ వేదికగా అభివృద్ధి చేశారు. ప్రతి గ్రామాన్ని సుసంపన్నంగా, దేనికదే ఒక ఆదర్శ గ్రామంగా, పచ్చదనంతో, పరిశుభ్రతతో పాటు స్థానిక స్వపరిపాలన పటిష్ఠపరించేందుకు ఉద్దేశించిన పంచాయతీరాజ్ చట్టం దేశానికే ఒక నమూనా చట్టం. దీని రూప కల్పనలో అలనాటి నెహ్రూ నిబద్ధత కేసీఆర్లో ప్రతిబింబిస్తుంది. భూ రికార్డుల ప్రక్షాళన, సమగ్ర సర్వే, ధరణి పోర్టల్ రూపకల్పన చేపట్టినప్పుడు కేసీఆర్ను చాలామంది పీవీ నరసింహారావుతో పోల్చారు. భూసంస్కరణల పునఃప్రారంభ మార్గదర్శకుడిగా కేసీఆర్ మన్ననలను పొందారు. అంతేకాకుండా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి స్ఫూర్తిని తనలో నింపుకొని మలి దశ రాష్ట్ర మహోద్యమాన్ని విజయవంతంగా నడిపించారు.
మరో విషయంలో కూడా నెహ్రూతో కేసీఆర్ను దగ్గరగా పోల్చవచ్చేమో! ఏ విధంగానైతే గ్రామీణాభివృద్ధిలో నిపుణుడైన ఎస్ కే డేను దేశానికి ఆహ్వానించి దేశాబివృద్ధికి నెహ్రూ బాటలు వేశారో.. అలాగే కేసీఆర్ సైతం తెలంగాణ అభివృద్ధి కోసం వివిధ రాష్ర్టాలు, దేశాల్లో కీలక పదవుల్లో ఉన్న పలు రంగాల నిపుణులను స్వయంగా ఆహ్వానించారు. ఉదాహరణకు ప్రపంచ బ్యాంకు కన్సల్టెంట్గా సేవలందించిన ఆర్థిక రంగ నిపుణుడు డాక్టర్ జీఆర్ రెడ్డిని రాష్ట్ర ఆర్థిక సలహాదారుడిగా నియమించారు. కోల్ ఇండియా చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి ఎస్.నర్సింగ్రావును సీఎం ముఖ్య కార్యదర్శిగా నియమించారు. రాష్ర్టాభివృద్ధిలో వారిద్దరి సహకారం గణనీయమైనది.
చైనాలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఎమర్జింగ్ మార్కెట్స్ ఎట్ క్రాస్ రోడ్స్’ అనే అంశంపై కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయనలో ఒక రాజనీతిజ్ఞుడిని, మహా పాలనాదక్షుడిని, సంపూర్ణ భారతీయుడిని ఆవిష్కరించింది. సర్వత్రా ప్రశంసలు అందుకున్నది. ఆర్థిక వ్యవస్థలపై సంపూర్ణ అవగాహనతో దేశాభివృద్ధి ప్రణాళికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చక్కని ఆలోచనతో నాడు కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో పారిశ్రామిక, సమగ్రాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూనే ప్రపంచ దేశాలకు భారతదేశం మార్గదర్శిగా నిలుస్తున్నదనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ సదస్సుతో కేసీఆర్ మహోన్నత వ్యక్తిత్వం గురించి ప్రపంచానికి తెలిసింది. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర సాధకుడిగా మాత్రమే తెలిసిన కేసీఆర్ వీటన్నిటిని మించి గొప్ప దేశభక్తుడని, విశాల భావాలున్న పౌరుడని, భవిష్యత్తు జాతీయ (భారత) నాయకుడని రుజువైంది.
సర్ విన్స్టన్ చర్చిల్తో కూడా పోల్చదగ్గ వ్యక్తి కేసీఆర్. ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిగా, రచయితగా, వక్తగా, నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సర్ విన్స్టన్ చర్చిల్ ప్రణాళికా సరళి, వ్యక్తిత్వం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రెండవ ప్రపంచ యుద్ధం తీవ్రతరమైనప్పుడు 1940 మే నెలలో బ్రిటన్ ప్రధాని నెవిల్ చాంబర్లెయిన్ రాజీనామా చేయగా.. ఆయన స్థానంలో చర్చిల్ నియమితులయ్యారు. బ్రిటన్ ప్రధానిగా బిగ్ త్రీ (బ్రిటన్, రష్యా, యూఎస్) సఖ్యతను బలోపేతం చేయడం ఆయన వ్యూహంలో అతి ముఖ్యమైనది. ఆయన వ్యూహం ఫలించింది. తద్వారా జర్మనీ పరాజయం పాలైంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ప్రపంచంలోని అత్యంత ప్రముఖ రాజనీతిజ్ఞుడిగా, ప్రభావితం చేసే వ్యక్తిగా విన్స్టన్ చర్చిల్కు అరుదైన గుర్తింపు వచ్చింది.
అయినప్పటికీ బ్రిటన్ ఓటర్లు ఆయనను యుద్ధ కాల ప్రధానిగా మాత్రమే చూశారు. ఫలితంగా యుద్ధానంతరం 1945 ఎన్నికల్లో చర్చిల్ ఘోర పరాజయం పాలయ్యారు. ఆరేండ్ల విరామం తర్వాత తిరిగి 1951లో చర్చిల్ విజయం సాధించి రెండవ పర్యాయం ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అందుకు భిన్నంగా కేసీఆర్ రాష్ట్ర సాధన ఉద్యమంలో, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించారు.
సమస్యలను వినూత్న, విభిన్న, తనదైన శైలిలో కేసీఆర్ పరిష్కరించేవారు. రాష్ట్ర ప్రజల సమగ్ర సంక్షేమం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కేసీఆర్కు ప్రధానాంశం. రాజకీయాలను ఒక వికృత క్రీడలా చూసే వెకిలి మనస్తత్వం కాదాయనది. ఆయనకు అదొక టాస్క్, పవిత్రమైన కార్యం. తాను సాధించిన తెలంగాణ విషయంలో, రాష్ట్ర సమస్యలకు సంబంధించినంతవరకు పొరుగు రాష్ర్టాల విషయంలో, కేంద్ర దృక్పథం విషయంలో సుస్పష్టమైన, బలీయమైన అవగాహన, ఆలోచన ఆయనకు ఉన్నాయి. వీటన్నింటిలో తన స్వరాష్ట్ర ప్రాధాన్యతే ఆయనకు సర్వస్వం. తెలంగాణ స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక అవసరాల కోసం కఠినంగా ఉండాల్సినప్పుడు కఠినంగానూ, వెనక్కు తగ్గాల్సిన సందర్భాల్లో వెనక్కితగ్గేలా ఆయన వ్యవహరించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమం కోసం అవసరమైతే ఒక అదనపు మైలు నడవడం ఆయన నిబద్ధతకు ప్రబల తార్కాణం.
ఎమ్మెల్యే నుంచి కేంద్ర మంత్రి వరకు పని చేసిన కేసీఆర్కు అపారమైన అనుభవం ఉంది. పాలనాపరమైన అనుభవంతో, ఉద్యమం నేర్పిన పాఠాలతో రాష్ట్ర, అవసరాలను అర్థం చేసుకున్న కేసీఆర్.. ముఖ్యమంత్రిగా పలు సమీక్షా సమావేశాల్లో అధికారుల అనుభవాన్ని, విజ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. వారి విలువైన ఆలోచనలను గౌరవించారు. అవసరమైన సమయంలో మార్గనిర్దేశనం చేశారు. అంతేకాని తన ఆలోచనలను వారిమీద బలవంతంగా రుద్దేవారు కాదు.
మార్పు తేవడం, మార్పులకు అనుగుణంగా పథకాల రూపకల్పన చేయడం, వాటిని అమలు పరచడం కేసీఆర్ విశిష్టత. ఎన్ని చేసినా, ఎంత చేసినా ప్రజలు మార్పు కోరుకున్నారు. అతి స్వల్ప ఓట్ల తేడాతో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఓటమి పాలైంది. రాజకీయ నాయకుడికి గెలుపే ప్రధానం. కానీ, రాజనీతిజ్ఞుడికి జయాపజయాలు రెండూ సహజ పరిణామాలే. అలెగ్జాండర్ డ్యూమాస్ చెప్పినట్టు.. ‘విజయాన్ని మించిన విజయం లేదు’ అనేది వందశాతం సరైనది కాదేమో! బహుశా వైఫల్యాలు భవిష్యత్తు విజయాలకు మూల స్తంభాలు కావచ్చేమో! వాస్తవానికి అపజయం అనేది తాత్కాలికంగా రద్దు అయిన విజయమే. అందుకే కేసీఆర్ నాయకత్వానికి అపజయం లేదనేది అసలుసిసలు వాస్తవం.
– వనం జ్వాలా నరసింహారావు