Telangana | రాజు సరిగా లేకపోతే రాజ్యం చీకట్లో మగ్గుతుందట! ప్రస్తుతం తెలంగాణ నీటిపారుదల రంగం దుస్థితి ఇలాగే తయారైంది. కఠోరంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. తెలంగాణ ఉద్యమ భూమికల్లో నీళ్లు ప్రధానమైనవి. కృష్ణా జలాల్లో అంతులేని అన్యాయం తెలంగాణ సమాజం కడుపు రగిలించింది. అందుకే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలో సాగునీటి రంగాన్ని గాడినపెట్టుకున్నాం. అయినా ఆంధ్రప్రదేశ్తో ఉన్న నీటిముళ్లు మాత్రం విడిపోలేదు. కేంద్రం సాగదీత ధోరణితో కృష్ణాజలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా ఇంకా దక్కలేదు. ఒకవైపు బ్రిజేష్ ట్రిబ్యునల్ కొనసాగుతున్న ఇలాంటి కీలక తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్న తప్పటడుగులు మళ్లీ పాత రోజులను గుర్తు చేస్తున్నాయి. ఆరు గ్యారెంటీలే కాదు, 420 హామీల అమలుపై ప్రశ్నించినప్పుడు.. ‘నిన్న మొన్ననే వచ్చినం కదా!’ అని పాలకులు సుతిమెత్తగా తప్పించుకోవచ్చు. ప్రజలూ అర్థం చేసుకోవచ్చు. కానీ అంతర్రాష్ట్ర అంశాలు వచ్చినప్పుడు… అందునా ఆంధ్రప్రదేశ్తో నదీజలాల వివాదం వంటివి తలెత్తినపుడు మాత్రం ‘పసిగుడ్డులం కదా..’ అనే డొల్ల వాదనలు నిలబడవు. పైగా ఈ పరిణామాలు ఏకంగా తెలంగాణ పుట్టినే ముంచుతాయి.
లక్షలాది మంది రైతుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తాయి. ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు ధారాదత్తం చేసేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం అంగీకరించడం ఇలాంటిదే. ‘మేం అంగీకరించడం లేదు…’ అంటూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మొదలు డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు మీడియా ముందు ఎన్ని డాంభికాలు పలికినా ‘చారిత్రక తప్పిదం’ జరిగిపోయింది. జనవరి 17న ఢిల్లీ వేదికగా తెలుగు రాష్ర్టాల ఇంజినీర్లతో కేంద్ర జల్శక్తి శాఖ నిర్వహించిన సమావేశంలోనే ‘సమర్పయామి’ కథ ఒడిసిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎన్ని లేఖలు రాసినా… ఒప్పుకోలేదంటూ ఎన్ని లీకులు ఇచ్చినా… ఆంధ్రప్రదేశ్ మూడడుగులు ముందుకేస్తే! ఆ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఆరడుగులు ముందుకు తీసుకుపోయింది. ఇదేదో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం-ఏపీ వ్యూహాత్మకంగా వేసిన అడుగులు కావు. రాష్ట్ర విభజన సమయం నుంచి రెండువైపులా ఇంతకు మించిన వ్యూహాలు పన్నిన దాఖలాలున్నాయి. కాకపోతే కేసీఆర్ ప్రభుత్వం కాలానుగుణంగా వాటిని తిప్పికొడుతూ తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకుంటూ వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే… రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో కలిసి కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకువెళ్లేందుకు చేయని ప్రయత్నం లేదు, వేయని పాచిక లేదు. ఎప్పటికప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఒకవైపు సాంకేతికంగా వాదనలు వినిపిస్తూనే మరోవైపు తెలంగాణ ప్రయోజనాల కోసం మొండిగా నిలబడటంతో ఎవరెన్ని ఎత్తులు వేసినా అవి ఫలించలేదు. తొమ్మిదిన్నరేండ్ల పాటు కృష్ణా బోర్డు చేతుల్లోకి ప్రాజెక్టులు పోకుండా కాపాడటం కంటే పెద్ద నిదర్శనం ఇంకేం కావాలి?
ఎన్నికల కోలాహలంలో తెలంగాణ మునిగినప్పుడు సరిగ్గా ఇదే అదనుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుపైకి ఏపీ పోలీసు బలగాలు చొచ్చుకొచ్చి డ్యాంలోని కొంత భాగంతో పాటు కుడి కాల్వను తమ చేతుల్లోకి తీసుకున్నది. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఈ విధానాన్ని ఎవరూ సమర్థించరు. జగన్ ప్రభుత్వం దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు చేయొచ్చునేమో! ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోణంలో అక్కడి ప్రజలకు ఆ పరిణామం దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగిస్తుంది. కానీ అదే సమయంలో తెలంగాణ ప్రయోజనాలకు అది శాశ్వత విఘాతం కలిగిస్తుంది. రోజులు గడిచేకొద్దీ దాని తాలూకు ప్రతికూల పరిస్థితులు ప్రజలు.. ప్రధానంగా తెలంగాణ రైతుల అనుభవంలోకి వస్తాయనడంలో సందేహం లేదు. మరి… అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా పూర్తికాని రేవంత్ ప్రభుత్వం ఈ పాపాన్ని తన ఖాతాలో వేసుకోక తప్పదు. ఎందుకంటే ఇది చరిత్రలో లిఖితమైంది. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సి ఉండేది. కానీ అప్పుడే కాదు, ఇప్పటికీ ప్రభుత్వ పెద్దల్లో ఆ సోయి కనిపించడం లేదు. ‘నిన్న మొన్ననే వచ్చాం కదా’ అనే సాకు ఇలాంటి అంతర్రాష్ట్ర జల వివాదాల్లో ఆమోదయోగ్యమైనది కాదు.
తెలంగాణలో గతేడాది డిసెంబర్ 7న అధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరవచ్చు. కానీ తొమ్మిదిన్నరేండ్లుగా ఉన్న అధికార యంత్రాంగం అలాగే ఉంది. కాకపోతే ఆ యంత్రాంగానికి తగిన సూచనలు, ఆదేశాలు ఇచ్చే వాళ్లు కరువయ్యారు. ఒకవైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే ప్రమాణ స్వీకార ఏర్పాట్ల కోసం పోలీసు బాస్ను పిలిపించుకున్నవాళ్లు, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లపై అధికార యంత్రాంగానికి ప్రణాళికను బోధించినవాళ్లు ఈ అంశంపైనా కాస్త దృష్టిపెట్టి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే నాగార్జునసాగర్ను తిరిగి కచ్చితంగా తెలంగాణ చేతుల్లోకి తీసుకువచ్చేవారని సామాన్య రైతు నుంచి ఇంజినీరింగ్ నిపుణుల వరకు బలంగా నమ్ముతున్న సత్యం.
నాగార్జునసాగర్ వివాదంపై కేంద్ర జల్శక్తి గత డిసెంబర్లో నిర్వహించిన సమావేశంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తొలి తప్పటడుగు వేసింది. ఉమ్మడి రాష్ట్రంలో నాగార్జునసాగర్ నల్లగొండ ఇరిగేషన్ సర్కిల్ పరిధిలోకి రావడం.. శ్రీశైలం కర్నూల్ జిల్లా ఇరిగేషన్ సర్కిల్ పరిధిలోకి రావడం కారణాలతో కావచ్చు.. రాష్ట్ర విభజన తర్వాత సాగర్ నిర్వహణ పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ పరిధిలో ఉంటే, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఏపీ ప్రభుత్వ చేతుల్లో కొనసాగింది. అందుకే కేంద్ర జల్శక్తి సమావేశంలో రేవంత్ ప్రభుత్వం తరపున హాజరైన ప్రతినిధులు ఈ విషయాన్ని సమావేశం ముందు ఉంచి తొలుత ఆ పూర్వ స్థితిని తీసుకురావాలని పట్టుబట్టి ఉండాల్సింది. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నపుడు ఏకపక్షంగా, దౌర్జన్యంగా ప్రాజెక్టును అధీనంలోకి తీసుకోవడం తప్పని కేంద్ర జల్శక్తి సైతం సమావేశంలో అంగీకరించింది. ఈ క్రమంలో తొలుత పూర్వ స్థితిని తీసుకువచ్చాక.. ఇతర అంశాలపై మాట్లాడుదాం! అని తెలంగాణ భీష్మించుకు కూర్చుంటే కచ్చితంగా ఏపీ దిగి వచ్చేది. కానీ స్టేటస్ కో (యథాతథస్థితి) అనే అర్థం పర్థం లేని ఒక పదాన్ని కేంద్రం తెరపైకి తీసుకురాగానే అందుకు తెలంగాణ తలూపింది. అసలు యథాతథస్థితి అంటే ఏంది? అని కూడా ప్రశ్నించలేకపోయింది. దీంతో సీఆర్పీఎఫ్ బలగాలను అక్కడ ఏర్పాటుచేస్తే ఏపీ పోలీసు బలగాలను ఉపసంహరించుకుంటామని ఏపీ ప్రభుత్వం చాకచక్యంగా తన చేతుల్లో నుంచి కేంద్రం చేతుల్లో పెట్టింది. ఎందుకంటే తొమ్మిదిన్నరేండ్లుగా ఏపీ ప్రయత్నం కూడా ఇదే. కాకపోతే కేసీఆర్ ప్రభుత్వం ఆ పాచికలను పారనివ్వలేదు. రేవంత్ సర్కారు ఏపీ ప్రభుత్వ వ్యూహాన్ని గుర్తించడంలో ఆదిలోనే విఫలమైంది. దాని ఫలితమే సాగర్ తెలంగాణ చేతుల్లో నుంచి వయా ఏపీ… కృష్ణా బోర్డు పరిధిలోకి పోయింది.
ఇక్కడో విషయాన్ని గుర్తుచేసుకోవాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా యథేచ్ఛగా నీటిని తరలించుకుపోతుంది. దీనిపై కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసి, నిలువరించాలని కోరింది. కృష్ణా బోర్డు సైతం ఏపీకి లేఖ రాసి… తమ అనుమతులు లేకుండా ఎలా తరలిస్తారంటూ ప్రశ్నించింది. అయినా ఏపీ ప్రభుత్వం ససేమిరా అన్నది. ఈ క్రమంలో అటు కృష్ణా బోర్డు, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు చేతులెత్తేసి.. నిస్సహాయస్థితిలో పడిపోయారు. ఈ సమయంలోనే అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రంలో గరిష్ఠ స్థాయి ఉత్పత్తిని ప్రారంభించాలని తెలంగాణ జెన్కోను ఆదేశించారు.
ఇప్పుడు ఇదెందుకు? అని కారణాలు తెలియక ఇంజినీర్లు సైతం ఆశ్చర్యపోయారు. విద్యుత్తు ఉత్పత్తి ద్వారా శ్రీశైలం నుంచి దాదాపు 45 వేల క్యూసెక్కుల కృష్ణా జలాలు ఉవ్వెత్తున నాగార్జునసాగర్ వైపు పరుగులు తీస్తుంటే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉలిక్కిపడింది. వెంటనే తెలంగాణను నిలువరించాలంటూ కృష్ణా బోర్డుకు ఆగమేఘాలపై లేఖల మీద లేఖలు రాసింది. కృష్ణా బోర్డు కూడా తపాలా బట్వాడాను వేగవంతంగానే చేపట్టింది. కానీ సీఎం కేసీఆర్ ‘నథింగ్ డూయింగ్… పోతిరెడ్డిపాడు వరద ఆగితే తప్ప ఇక్కడ ఆగదు’ అని తేల్చిచెప్పారు. దీంతో ఏపీ సర్కారు దిగి రాక తప్పలేదు. రాజు కంటే మొండే గొప్ప అంటారు! తెలంగాణ ప్రయోజనాల కోసం రాజే మొండిగా మారిన సందర్భాన్ని అప్పుడు ఇంజినీర్లు స్వయంగా చూశారు. రేవంత్ ప్రభుత్వం కూడా మొన్న ఇలా గట్టిగా నిలబడితే తెలంగాణ పట్టు సడలేది కాదు.
శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రంలో గరిష్ఠ స్థాయి ఉత్పత్తిని ప్రారంభించాలని తెలంగాణ జెన్కోను ఆదేశించారు. ఇప్పుడు ఇదెందుకు? అని కారణాలు తెలియక ఇంజినీర్లు సైతం ఆశ్చర్యపోయారు. విద్యుత్తు ఉత్పత్తి ద్వారా శ్రీశైలం నుంచి దాదాపు 45 వేల క్యూసెక్కుల కృష్ణా జలాలు ఉవ్వెత్తున నాగార్జునసాగర్ వైపు పరుగులు తీస్తుంటే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉలిక్కిపడింది. వెంటనే తెలంగాణను నిలువరించాలంటూ కృష్ణా బోర్డుకు ఆగమేఘాలపై లేఖల మీద లేఖలు రాసింది. కృష్ణా బోర్డు కూడా తపాలా బట్వాడాను వేగవంతంగానే చేపట్టింది. కానీ సీఎం కేసీఆర్ ‘నథింగ్ డూయింగ్… పోతిరెడ్డిపాడు వరద ఆగితే తప్ప ఇక్కడ ఆగదు’ అని తేల్చిచెప్పారు.
ఎన్నికలప్పుడు రాజకీయాలు చేయాలి. కానీ రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే రాజకీయాలు మొదలుపెట్టారు. కిరణ్కుమార్రెడ్డి హయాంలో ప్రగతిభవన్ ముందు ఏర్పాటు చేసిన కంచెను తొలగించి దానిని గొప్పగా చెప్పుకొనే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత శ్వేతపత్రాలు అంటూ అసెంబ్లీలో హడావుడి సరేసరి. ఇక… కాళేశ్వరం ప్రాజెక్టులోని చిన్న లోపాన్ని అడ్డం పెట్టుకొని నిత్యం రేవంత్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయం అంతా ఇంతా కాదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేయడమే పనిగా సీఎం, మంత్రులు పెట్టుకున్నారే గానీ, పొంచి ఉన్న అంతర్రాష్ట్ర జల వివాద ముప్పును ఏ మాత్రం పసిగట్టలేకపోయారు. అందుకే నాగార్జునసాగర్ డ్యాం వివాదంలో ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ డొల్లతనాన్ని అటు ఏపీ ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇద్దరూ ఇదే అదనుగా చకచకా పావులు కదిపారు. అందులో భాగంగానే కొన్నిరోజుల కిందట కేంద్ర జల్శక్తి శాఖ కృష్ణా బోర్డుకు సంబంధించి సమావేశాన్ని నిర్వహించింది. వ్యూహాత్మకంగా ప్రాజెక్టులను చెరబట్టింది. అసలు ఈ సమావేశానికి ముందు ప్రభుత్వస్థాయిలో ఇంజినీర్లతో సీఎంగానీ, సంబంధిత మంత్రిగానీ సమావేశమై వ్యూహాన్ని రూపొందించకపోవడం తెలంగాణ ప్రయోజనాలపై ఈ ప్రభుత్వంలో ముందుచూపు కొరవడిందనేందుకు నిదర్శనం. అసలు సమావేశ ఎజెండాలు ఏమున్నాయి? ఆయా అంశాలపై మన విధానమేంది? అని నిర్ణయించలేదు. దీంతో ఆ సమావేశంలోనే కృష్ణా ప్రాజెక్టులపై మన హక్కులు, స్వేచ్ఛ కృష్ణార్పయామి అయ్యాయి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఈ సమావేశం జరిగిన రెండు రోజుల్లోనే మాజీ మంత్రి హరీశ్రావు మీడియా సమావేశాన్ని నిర్వహించి.. ‘కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు ఎలా అప్పగిస్తారంటూ’ ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెంటనే దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు. ఇందుకు ప్రతిస్పందనగా ‘కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేంద్రం-కృష్ణా బోర్డుతో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను తోడండి’ అని సమాధానం వచ్చినట్టు తెలిసింది. అంటే ఇక్కడ తెలంగాణ ప్రయోజనాల కోణంలో ఆలోచించాల్సిన ముఖ్యమంత్రి… కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో తవ్వి బదనాం చేసేందుకు ప్రణాళిక రూపొందించమని పురిగొల్పినట్టుగా ఉందే తప్ప ఇంకేమీ లేదు.
ఢిల్లీలో జరిగిన కృష్ణా బోర్డు సమావేశంలో కేంద్ర జల్శక్తి ముందుగా నాలుగు ఎజెండా అంశాలు నిర్ణయించి, సమాచారం ఇచ్చింది. నాగార్జునసాగర్ డ్యాం వివాదం… కృష్ణా ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రోటోకాల్… ప్రాజెక్టులపై ఉన్న 15 ఔట్లెట్లను కృష్ణా బోర్డుకు అప్పగించడం… కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించడం… ఇందులో సాగర్ డ్యాంను ఏపీ దౌర్జన్యంగా అధీనంలోకి తీసుకోవడం తప్పే అని కేంద్ర జల్శక్తి కార్యదర్శి తెలంగాణకు ఊరట కలిగించేలా వ్యాఖ్యానించి, తదుపరి 15 ఔట్లెట్లను బోర్డుకు అప్పగించే ఎజెండాపై చర్చ మొదలుపెట్టారు. వాస్తవానికి రెండో ఎజెండాగా ఉన్న ‘ఆపరేషన్ ప్రోటోకాల్’ అంశాన్ని చర్చకు తీసుకురాలేదు. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఈ అంశం తెరపైకి వచ్చినా సుదీర్ఘ చర్చలు మినహా తుది నిర్ణయం అనేది జరగలేదు. ఇప్పటికీ జరగడం లేదు కూడా. అందుకే వ్యూహాత్మకంగా ఔట్లెట్ల అంశాన్ని తెరపైకి తెచ్చి రెండు రాష్ర్టాల ఒప్పందాన్ని రికార్డు చేశారు. ఇక్కడ తెలంగాణ నుంచి వ్యూహం కరువైంది. ఆపరేషన్ ప్రోటోకాల్ ఖరారు కానిది… ఔట్లెట్ల అప్పగింత ఎందుకు? అని ప్రశ్నించి ఉంటే కృష్ణా బోర్డు, ఏపీ దూకుడుకు అక్కడే కళ్లెం పడేదని ఇంజినీరింగ్ నిపుణులు చెప్తున్నారు.
ఈ సమావేశం జరిగిన రెండు రోజుల్లోనే మాజీ మంత్రి హరీశ్రావు మీడియా సమావేశాన్ని నిర్వహించి.. ‘కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు ఎలా అప్పగిస్తారంటూ’ ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెంటనే దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు. ఇందుకు ప్రతిస్పందనగా ‘కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేంద్రం-కృష్ణా బోర్డుతో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను తోడండి’ అని సమాధానం వచ్చినట్టు తెలిసింది. అంటే ఇక్కడ తెలంగాణ ప్రయోజనాల కోణంలో ఆలోచించాల్సిన ముఖ్యమంత్రి… కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో తవ్వి బదనాం చేసేందుకు ప్రణాళిక రూపొందించమని పురిగొల్పినట్టుగా ఉందే తప్ప ఇంకేమీ లేదు.
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలని అటు కేంద్రం, ఇటు ఏపీ అడిగిన ప్రతిసారీ కేసీఆర్ ప్రభుత్వం ఒక సహేతుకమైన వాదనను తెరపైకి తెచ్చేది. ‘శ్రీశైలంలోగానీ, నాగార్జునసాగర్లోగానీ ఏ రాష్ర్టానికి ఎన్ని టీఎంసీల కేటాయింపు ఉందనేది తేలితే అప్పుడు బోర్డు రెండు రాష్ర్టాల మధ్య జలాలను పంపిణీ చేయడం సమంజసం. కానీ, అది తేలనిది బోర్డు చేతుల్లోకి తీసుకొని ఏం చేస్తుంది?’ అని వాదించేవారు. దీంతో అది ఎలాగూ తేలే అంశం కాకపోవడంతో ప్రాజెక్టుల అప్పగింత అనేది కూడా తెగేది కాదు. కానీ రేవంత్ ప్రభుత్వం అంతకంటే మించిన వాదనను రూపొందించకపోగా, ఆ స్ఫూర్తిని కొనసాగించలేదు. ఇటీవల జరిగిన కేంద్ర జల్శక్తి సమావేశంలో తెలంగాణ తరఫున ఈ వాదనకు బదులుగా 50:50 దామాషాన జలాలు పంపిణీ చేస్తే అప్పగింతకు అభ్యంతరం లేదనే నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో జలాల పంపిణీని నిర్ధారించే అధికారం తమకు లేదంటూ కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. పైగా ఇది కేంద్రం, ట్రిబ్యునల్ చూసుకోవాల్సిన అంశమంటూ కొట్టిపారేసింది. ఇది మినహా ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ వద్ద ఎలాంటి అభ్యంతరాలు లేవనే అభిప్రాయానికి వచ్చింది. అదే సమావేశ మినిట్స్లో ప్రస్ఫుటించింది.
సమావేశ మినిట్స్లో ప్రాజెక్టుల అప్పగింతకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయంటూ కేంద్ర జల్శక్తి శాఖ అధికారికంగా పొందుపరిచింది. ఆ తర్వాత రేవంత్ ప్రభుత్వం ‘తూచ్’ అంటూ కేంద్రానికి లేఖలు రాస్తున్నది. ఒకసారి నిర్ణయం జరిగిపోవడం ఒకవంతైతే… తొమ్మిదిన్నరేండ్లుగా కేంద్రం, ఏపీ ఎదురుచూస్తున్న అవకాశం వచ్చిన తర్వాత వెనకడుగులు పడతాయని ఆశించడం అత్యాశే. ఎందుకంటే నిన్నటిదాకా మన చేతుల్లో ఉన్న ‘సాగర్’ను కూడా రేవంత్ ప్రభుత్వం చేజార్చుకున్నది. ఒకవేళ సాగర్ నిర్వహణ తెలంగాణ చేతుల్లో ఉంటే… అటు కేంద్రం, ఇటు కృష్ణా బోర్డు, మరోవైపు ఏపీ ఏమీ చేయలేని పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు తెలంగాణ నిస్సహాయస్థితిలో ఉందనేది నిపుణులు చెప్తున్న వాస్తవం.
ఒక్కసారి కాగితంపై నిర్ణయాలు జరిగిపోయాయంటే అదెంతవరకు వెళ్తుందనేందుకు గతానుభవం కూడా ఉంది. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో ఒక ఏడాది కృష్ణాజలాలను మనం పూర్తిస్థాయిలో వాడుకోలేకపోయాం. దీంతో ఆంధ్రప్రదేశ్ తమకు కావాలని కోరింది. ఎలాగూ మనం వాడుకోలేదు కదా… రెండు రాష్ర్టాల మధ్య సత్సంబంధాలు ఉండాలని, మానవతా దృక్పథంతో కేసీఆర్ ప్రభుత్వం అందుకు అంగీకరించింది. నీటిపారుదల శాఖ లేఖ రాసింది. అప్పుడు నీటిని వాడుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ కాగితాన్ని బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందుంచి ‘చూడండి… తెలంగాణ పూర్తిస్థాయిలో తన నీటిని వాడుకోలేకపోతుంది’ అని నమ్మించే ప్రయత్నం చేసింది. కాకపోతే ట్రిబ్యునల్ ముందు కేసీఆర్ ప్రభుత్వం సహేతుకమైన కారణాలు చూపి ఆ వాదనను తిప్పికొట్టింది. అంతేకాదు తదనంతరం ఎక్కడా ఏపీకి చిన్నపాటి అవకాశాన్ని కూడా ఇవ్వకుండా అడుగులు వేసింది. అంటే… రికార్డుల్లో ఒకసారి నమోదైన అంశం తదుపరి ఎలాంటి పరిణామాలకు కారణమవుతుందనేది మన చేతుల్లో ఉండదు అనేందుకు ఇదొక ఉదాహరణ. నిన్నటివరకు బోర్డు చేతిలో అధికారంలో లేకుండా రెండు రాష్ర్టాల మధ్య తాత్కాలిక ఒప్పందం ప్రాతిపదికన పంపిణీ, నిర్వహణ, ఇతర అంశాలు కొనసాగుతున్నాయి. కానీ, ఇప్పుడు కృష్ణా బోర్డు వేసే ప్రతి అడుగు రెండు రాష్ర్టాల పరిధిలోని ప్రాజెక్టులపై అధికారిక ముద్రలా మారతాయి. బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ జరుగుతున్న ఇలాంటి కీలక సమయంలో అవి మన వాదనలకు ప్రతిబంధకంగా మారే ప్రమాదమూ లేకపోలేదు.
గోదావరికి పుష్కలమైన ఇన్ఫ్లోలు ఉంటాయి. కానీ కృష్ణా పరిస్థితి భిన్నం. విస్తారంగా వర్షాలు కురిసినప్పుడు సైతం ఆంధ్రప్రదేశ్ పెన్నా బేసిన్ను నింపుకొనేందుకు శ్రీశైలం నుంచి నదినే మళ్లించే ప్రయత్నం చేస్తుంది. నిన్నటిదాకా నాగార్జునసాగర్ మన చేతుల్లో ఉండటంతో పాటు శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రం నిర్వహణ కూడా మనకే ఉంది. కానీ కృష్ణా బోర్డు చేతుల్లోకి వీటి నిర్వహణ వెళ్లినపుడు పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. అసలు ఆంధ్రప్రదేశ్ వ్యూహం కూడా అదే.
నాగార్జునసాగర్ కుడి కాల్వ నుంచి కాకపోయినా కృష్ణా డెల్టాకు పోలవరం కుడి కాల్వతోగానీ, పట్టిసీమతోగానీ సాగునీటిని అందిస్తుంది. ఎలాగూ సాగర్ దిగువన పులిచింతల ఉంది. అందుకే సాగర్పై ఏపీకి పెద్దగా ఆశలు లేవు. కేటాయింపులకు అనుగుణంగా జలాలను తరలించుకోవాలనే ఉద్దేశంతో నీటిని తరలించుకుపోతుంది. కానీ, ఆ రాష్ట్ర లక్ష్యం.. శ్రీశైలం జలాశయం. పోతిరెడ్డిపాడు ద్వారా పెన్నా బేసిన్లోని 340 టీఎంసీలకు పైగా సామర్థ్యంతో ఉన్న రిజర్వాయర్లను ఏటా నింపుకోవాలనే వ్యూహంతోనే పావులు కదుపుతుంది. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత ద్వారా శ్రీశైలంలో 851 అడుగుల మేర నీటి నిర్వహణను అధికారికం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. తద్వారా 841 అడుగుల స్థాయిలో ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు నీటి లభ్యత ఉండేలా చూసుకుంటుంది. దీంతో ఇప్పుడు మనం శ్రీశైలంలో 830 అడుగుల వరకు కూడా ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రంలో కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం. ముఖ్యంగా గత పదేండ్లలో ఎగువ నుంచి ఇన్ఫ్లోలు ఉన్నప్పుడు వెంటనే ఎడమ గట్టు కేంద్రంలో కరెంటు ఉత్పత్తి చేయడంతో అత్యంత చౌకగా హైడల్ పవర్ వచ్చేది. కరెంటు కొనుగోలు చేయకుండా ప్రభుత్వ ఖజానాపై ఆర్థికంగా భారం తగ్గేది. కానీ, బోర్డు చేతిలోకి వెళ్లిన తర్వాత శ్రీశైలంలో 851 అడుగుల నిర్వహణ పేరుతో కరెంటు ఉత్పత్తికి కూడా అడ్డుకట్ట పడుతుంది. మరోవైపు తరచూ కృష్ణా బేసిన్లో సంక్షోభం తలెత్తి… శ్రీశైలం వరకు మాత్రమే ఇన్ఫ్లోలు అందుతున్నాయి. అయినా విద్యుత్తు ఉత్పత్తి ద్వారా నీటిని సాగర్కు విడుదల చేసి ఇక్కడ నీటి అవసరాలు తీర్చుకుంటున్నాం. కానీ బోర్డు చేతిలోకి వెళ్లిన తర్వాత వచ్చే నీటిని వాటా పేరిట ఏపీ ఎగువనే వాడుకుంటే దిగువన ఉన్న సాగర్కు ఇన్ఫ్లోలు ఉండవు. దీంతో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు ఈ ఏడాది లెక్కనే ఎండిపోక తప్పదు.
– గుండాల కృష్ణ