శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళే బరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిః
కృశించిపోయే లక్షణం గల, వ్యాధిగ్రస్థమైన ఈ శరీరానికి నిజమైన ఔషధం గంగా జలం. వైద్యుడు నారాయణుడైన శ్రీహరి అన్నది దీని అర్థం.
నేనో డాక్టర్ని. నా దగ్గరికి వచ్చే రోగుల ఆరోగ్య సమస్యలేంటి? వాటికి ఎలాంటి మందులివ్వాలి?
అన్నదే నేను ఆలోచిస్తాను. కానీ కొంత కాలంగా నా ఆలోచనలో మార్పు వచ్చింది. మన దేశాన్ని కూడా ఓ మొండి రోగం పట్టి పీడిస్తున్నదని తేలిపోయింది. ఇది నా ఒక్కడి మాట కాదు. నా దగ్గరకు వచ్చే రోగుల్లో చాలా మంది ఇదే విషయాన్ని నాతో పంచుకున్నారు. దేశానికి పట్టిన వ్యాధిని నయం చేయడమెలా అని ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నలకు సమాధానం – తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అవును… దేశానికి పట్టిన రాజకీయ రోగానికి మందు వేసే వైద్యుడు ఆయనే.
మనిషిని బాధించేవన్నీ రోగాలు కాదు. మనలో అనవసరంగా ఉన్నవాటిని బయటకు పంపేయాలి. మధుమేహం అలాంటి వ్యాధే. దాన్ని తగ్గించుకోకపోతే మిగతా రోగాలను మనకు అంటిస్తుంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన మోదీ ప్రభుత్వం.. ఆ విషయాన్ని పట్టించుకోకుండా ‘రాజకీయాలపైనే’ పూర్తి దృష్టి సారించింది. తమ నాయకులను, ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే తప్ప ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం గురించి బీజేపీ అస్సలు పట్టించుకోవడం లేదు. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనం అవుతున్నది. రూపాయి విలువ జీవన కాల కనిష్ఠానికి చేరుకోవడం, స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకోవడం, నిరుద్యోగం పెరిగిపోవడం, ధరల పెరుగుదల… ఇలా ఎక్కడ చూసినా ప్రతికూల సంకేతాలే. పాకిస్థాన్, శ్రీలంక, భూటాన్ వంటి చుట్టుపక్కల దేశాలు అనుభవిస్తున్న ఆర్థిక సంక్షోభాలను చూసి కూడా నీరో చక్రవర్తిలాగే వ్యవహరిస్తున్నారు కేంద్ర పాలకులు.
‘దేహం.. దేశం.. వేర్వేరు పదాలు. ఒకదానికి ఒకటి సంబంధం లేనివి’ అని అందరూ అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. ఈ రెండూ దేహం, ఆత్మ లాంటివి. ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నవి. ఈ రెండింటిలో ఏది లేకపోయినా మరో దానికి పరిపూర్ణత అన్నదే లేదు. తల్లి కడుపు నుండి ప్రతి ప్రాణి దేహంతో బయటపడినా మానవుడు మాత్రమే యుక్తా యుక్త విచక్షణ జ్ఞానం కలిగి ఉంటాడు. ఇది లౌకిక జ్ఞానం. కానీ ఈ శరీరాన్ని రక్షించేది, నిలిపేది ఆత్మ మాత్రమే. దేశం కూడా ఆత్మ లాంటిదే. అలాంటి ఆత్మను రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకోసం ఓ పాలకుడు కదలి వస్తున్నాడు.
దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని ఏదైనను ఒక మేల్
కూర్చి జనులకు చూపవోయ్
గురజాడ చెప్పిన ఈ పద్యం దేశంలో ఇప్పుడు ఉన్న ఇద్దరు పాలకులకు పూర్తిగా వర్తిస్తుంది. వారిలో ఒకరు గొప్పలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నది ప్రధాని మోదీ అయితే మరొకరు రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి, దేశ ప్రగతి కోసం కలలు కంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దేశ ఆదాయంలో గణనీయమైన భాగం తెలంగాణ నుంచి వచ్చే స్థాయికి రాష్ర్టాన్ని తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ది. మోదీ పాలనలో దేశమంతా విద్యుత్ సంక్షోభం తరుముకొస్తుంటే, కేసీఆర్ ముందుచూపు వల్ల తెలంగాణలో 24 గంటలు విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఇక్కడ అమలవుతున్న పథకాలు పక్క రాష్ర్టాల ప్రజల్నీ ఆకర్షిస్తున్నాయి. తమ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలు అమలు చేయాలని వారి నుంచి డిమాండ్లు మొదలయ్యాయి. వాటిని నెరవేర్చేందుకు, దేశాన్ని ముందుండి నడిపేందుకు ఓ నాయకుడు అవసరమయ్యారు.
నాయకులు ఎక్కడో పుట్టరు. ప్రజల్లోంచే వస్తారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఒక్కడిగా మొదలై.. కోట్ల గొంతులకు తోడయ్యారు కేసీఆర్. స్వరాష్ట్ర సాధన నుంచి బంగారు తెలంగాణ వైపు ప్రజలను అడుగులు వేయించిన ఆయన.. ఇప్పుడు దేశానికి దిశా నిర్దేశం చేయాల్సిన అవసరం ఉన్నది.
సొంత లాభం కొంత మానుకు
పొరుగువానికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్..
గురజాడ చెప్పిన ఈ విషయాన్ని కేసీఆర్ ఆచరించి చూపిస్తున్నారు. నేను.. నా రాష్ట్రం.. నా ప్రజలు అని మాత్రమే ఆయన ఆలోచించలేదు. అభివృద్ధి నా రాష్ట్రంతోనే ఆగిపోవాలని అనుకోలేదు. నేను.. నా దేశం.. అని తపన పడ్డారు. అందుకే అధోగతి పాలవుతున్న దేశ గతిని మార్చేందుకు నడుం బిగించారు. సంస్కరణలతో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టేందుకు సమాయత్తమయ్యారు. అవును.. ఇప్పుడు దేశానికి కావాల్సింది ఇలాంటి నాయకుడే. ‘అది చేస్తాం.. ఇది చేస్తాం’ అని గొప్పలు చెప్పుకునే నాయక గణమంతా ఒకవైపు ఉన్నారు. ‘చెప్పడం కాదు.. చేసి చూపించడమే సత్తా’ అని చాటి చెప్పిన కేసీఆర్ మరోవైపు ఉన్నారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఆయన రాక అత్యవసరం. అభివృద్ధిని ఆచరణలో చూపించే నాయకుడు పాలకుడైతే ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఎలా ఉంటుందో ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలు మాత్రమే చూశారు. ఇకపై అలాంటి అద్భుత పాలనను దేశ ప్రజలంతా చూడబోతున్నారు.
చివరగా ఒక్క మాట. మధుమేహాన్ని అదుపు చేయకపోతే అది శరీరంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంది. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బాధ్యతా రాహిత్య ప్రభుత్వాన్ని అదుపు చేయకపోతే దేశం మొత్తం నిర్వీర్యం కావడం ఖాయం. అందుకే తెలంగాణ సాధకుడు.. ప్రజారంజక పాలకుడు కేసీఆర్ దేశ్ కీ నేతగా మారాల్సిందే. దేశ గతిని మొత్తం మార్చాల్సిందే.
– డాక్టర్ఎన్ సుధాకర్ రావు
(వ్యాసకర్త మాజీ ఎమ్మెల్యే, ఎండోక్రైనాలజిస్ట్)