తెలంగాణ ఉద్యమాల గడ్డ. ఎన్నో పోరాటాలు, త్యాగాలకు నిలయం. తన అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి గెలిచి నిలిచింది. తెలంగాణ విముక్తికోసం ఎంతోమంది నాయకులు ప్రయత్నించారు. కానీ ప్రత్యర్థులను తట్టుకోలేక కొందరు, ప్రలోభాలకు లొంగి కొందరు ఉద్యమాన్ని మధ్యలోనే వదిలేశారు. అడుగడుగున తెలంగాణ ప్రజలు వంచించబడడాన్ని జీర్ణించుకోలేక ఉద్యమబాట పట్టారు కేసీఆర్. పదవులను తృణప్రాయంగా వదిలేసి తెలంగాణ సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ను స్థాపించి గులాబీ జెండా ఎత్తారు.
ఉద్యమ సమయలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, అవాంతరాలు ఎదురైనా, అవహేళనలు చేసినా కేసీఆర్ వెనుకాడలేదు. ప్రత్యర్థుల కుట్రలను ఛేదించి, బలమైన సీమాంధ్ర లాబీయింగ్ను తట్టుకొని 14 ఏండ్లపాటు ఉద్యమాన్ని నడిపారు. నాడు స్వరాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, సబ్బండ జాతిని ఏకం చేసి పోరాడారు. తెలంగాణ కోసం చావు నోట్లో తల పెట్టడానికి కూడా వెనుకాడలేదు. ఆమరణ దీక్షతో ఢిల్లీ పీఠాన్ని ఒప్పించి తెలంగాణ సాధించారు కేసీఆర్. ఉద్యమ సమయంలోనూ ‘మాకు ఏపీ ప్రజలెప్పుడూ శత్రువులు కారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న పెత్తందారులతోనే మా పోరాటం’ అని అనేకసార్లు కేసీఆర్ స్పష్టం చేశారు. అన్నట్లుగానే స్వరాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలోని ఆంధ్ర ప్రజలను తెలంగాణ వారితో సమానంగా ఆదరిస్తున్నారు.
స్వరాష్ట్ర కాంక్షను నిజం చేసిన ఉద్యమనేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాసంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అలాంటి నాయకుని కాళ్లల్లో కట్టెలు పెడుతూ, తెలంగాణ అభివృద్ధ్దికి అడ్డం పడుతూ దుష్టగ్రహ కూటమొకటి తెలంగాణాలో మోపైంది. వారు పదే పదే ముఖ్యమంత్రి కేసీఆర్పైనా, ఆయన కుటుంబం పైనా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.
రాజకీయాల్లో విలువలు మరిచి చిల్లర కూతలు కూస్తున్నారు. తెలంగాణ బద్ధ వ్యతిరేకి వై.ఎస్.రాజశేఖర్రెడ్డి బిడ్డనంటూ ఒకరు, ఏక్బార్, దోబార్ అంటూ ఒకరు, మీడి యా ముసుగులో ఒకరు, ఉన్నత ఉద్యోగం చేసి విలువలు మరిచిన మరొకరు అంతా మోపై జుగుప్సాకరమైన వ్యా ఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులను అసభ్యకరంగా విమర్శిస్తున్నారు. ఒక ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చిన యోధుడు, తెలంగాణ బతుకులను మార్చి దేశంలోనే ముందువరుసలో నిలిపిన మహా నాయకుడు కేసీఆర్. అలాంటి నేతపై చిల్లర కూతలు కూస్తున్నారు.
అసలు ఎవరు వీరంతా? తెలంగాణ ఉద్యమంలో వీళ్లెక్కడున్నారు? తెలంగాణ అభివృద్ధిలో వీళ్ళ పాత్ర ఏమిటి? వీళ్ళ అల్లరి చేష్టలు, చిల్లర కూతల వెనుక ఎవరున్నారు? వీళ్ళు మోసే జెండాలు ఏంటి..ఎత్తుకున్న ఎజెండా లేంటి.. వైఎస్ రాజశేఖర్రెడ్డి తెలంగాణలో ఒక ముగిసిపోయిన అధ్యాయం. ఉద్యమ సమయంలో ఎన్నికలకు ఒకరోజు ముందు తెలంగాణకు మద్దతిచ్చినట్టు నమ్మించి ఓట్లు కొల్లగొట్టాడు. పోలింగ్ కాగానే ఏపీకి వెళ్లి ‘తెలంగాణ వస్తే మనం హైదరాబాద్కు వెళ్లాలంటే వీసా కావాలి’ అంటూ ఆంధ్రుల ను రెచ్చగొట్టిన వ్యక్తి వైఎస్. ఉద్యమకారులను జైళ్లలో పెట్టి ముప్పుతిప్పలు పెట్టిన తెలంగాణ ద్రోహి వైఎస్ఆర్. అలాం టి వైఎస్ఆర్ పార్టీ పేరుతో పదే పదే రాజశేఖర్రెడ్డి బిడ్డనంటూ షర్మిల తెలంగాణలో తిరుగుతున్నది. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ తండ్రి వయసున్న కేసీఆర్ను,ఉద్యమంలో భాగమైన ఆయన కుటుంబాన్ని దుర్బాషలాడుతున్నది. తెలంగాణ ఉద్యమకారులను తాలిబన్లు, తీవ్రవాదులతో పోల్చుతూ ఈ ప్రాంతంలో నాటకాలు చేయడం దేనికి సంకేతం? ఆమె వెనక ఉన్నదెవరు? అసలు ఆమెతో తెలంగాణకు ఒరిగేదేమిటి? ఉద్యమ సమయంలో ‘జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ తెలంగాణను పాకిస్థాన్తో పోల్చిన షర్మిలకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత ఉన్నదా? కేసీఆర్ కుటుంబాన్ని,ఉద్యమకారులను విమర్శించే స్థాయి ఉన్నదా? ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ప్రతి తెలంగాణబిడ్డ గర్జిస్తాడు. అందుకు సాక్ష్యమే నర్సంపేటలో జరిగిన ఘటన.
దేశానికి పట్టిన దుష్టశక్తి బీజేపీ. రాజకీయ వ్యవస్థలను, ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ అధికారం కోసం అడ్డగోలు రాజకీయం మొదలుపెట్టింది. ఇప్పుడు సీఎం కేసీఆర్పై తమ అక్కసునంతా వెళ్లగక్కుతూ దుష్టరాజకీయం చేస్తున్న ఈ అల్లరి చిల్లర మూకలన్నీ బీజేపీ గూటి పక్షులే. బీజేపీ ఆడించే ఆటలో వీళ్లంతా కీలుబొమ్మలు. వీళ్ళ జెండా వేరైనా ఎజెండా మాత్రం బీజేపీదే. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో హత్యలు, అల్లర్లు, మత విద్వేషాలు ఉన్నట్టే తెలంగాణను సైతం అదే దారిలోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఇక్కడ అల్లర్లు సృష్టించి లబ్ధిపొందాలని చూస్తున్నారు. కానీ ఇది తెలంగాణ. దెబ్బతిన్న బెబ్బులి. పోరాటాల నేల. తనకు ఆపదొస్తే ఏకతాటిపైకి వచ్చి పోరాడుతుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులు కేటీఆర్, హరీష్రావు, కవిత గాలివాటంగా రాలేదు. నేడు వారసత్వం అని కూసేవారు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. స్వరాష్ట్ర ఉద్యమంలో 2001 నుంచి హరీష్రావు కేసీఆర్ వెంట ఉద్యమంలో నడిచారు. విదేశాల్లో ఉన్నత ఉద్యోగం వదులుకొని కేటీఆర్ ఉద్యమం కోసం ముందు కొచ్చారు. తెలంగాణ సంస్కృతి చిహ్నమైన బతుకమ్మ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తూ, తెలంగాణ ఉద్యమంలో ఆడబిడ్డలను కవిత ముందుండి నడిపించారు. వారు నిఖార్సయిన ఉద్యమబిడ్డలు. వారితో పాటు నేడు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉద్యమకారులు వివిద హోదాల్లో ఉన్నా రు. వారి కృషిని పక్కనపెట్టి, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంది మాత్రం ఈ దుష్టగ్రహాలే. బీజేపీ చేస్తున్న ఈ వికృత రాజకీయ క్రీడను తెలంగాణ సమాజం గమనిస్తున్నది. ప్రజాక్షేత్రంలో వీళ్ళకు శిక్ష తప్పదు.
ఎవరెన్ని నిరాధార, అసభ్య ఆరోపణలు చేసినా సహి స్తూ పోరాడి సాధించుకున్న రాష్ట్రం నష్టపోవద్దనే ఆశయం తో, గరళం మింగిన శివుని వలే చాలా ఓపికతో వ్యవహరి స్తున్నారు కేసీఆర్. కానీ, దేశంలో జరుగుతున్న అన్యాయాలను, బీజేపీ అకృత్యాలను ప్రశ్నించి పోరాడే విషయంలో మాత్రం రాజీలేకుండా ముందుకు వెళ్తున్నా రు. దానికి కక్ష సాధింపుగా ఈడీ, ఐటీ సోదాల రూపంలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. కొందరితో పార్టీలు పెట్టించి వికృత మాటలతో ఉసిగొల్పుతున్నారు. రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించి తద్వారా, అభివృద్ధిలో అద్భుతంగా ముందుకు సాగుతూ, ప్రశాంతతకు నెలవుగా మారిన తెలంగాణను ఆగం చేయాలని ఈ దుష్టశక్తులు చూస్తున్నాయి. కానీ ఆత్మగౌరవం కలిగిన తెలంగాణ సమాజం వారి చేష్టలను తిరస్కరించింది. అసత్య ప్రచారాలను ధిక్కరించింది. కేసీఆర్ పై, తెలంగాణ పై అసత్య వెకిలి కూతలు కూస్తే ఉద్యమంలోలాగే గర్జించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ను తెలంగాణాను వేరు చేసి చూడదు తెలంగాణ సమా జం. రాజకీయాల్లో విలువలు మరిచిన కుసంస్కారులకు తెలంగాణ మర్చిపోలేని గట్టి గుణపాఠం నేర్పిస్తుంది. వాళ్ళను పొలిమేరల దాకా తరుముతుంది. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష.
-తెలంగాణ విజయ్
94919 98702