రాజకీయ నిర్ణయాల్లో నూతన అంశాలను తెరమీదికి తెస్తూ, వేగంగా పావులు కదపడంలో కేసీఆర్ ముందుంటారు. అందుకే ఇప్పటికే బీఆర్ఎస్ తరపున లోక్సభకు పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేసి బీఫామ్స్ కూడా అందజేశారు. నామినేషన్ల పర్వం ప్రారంభమై ఇప్పటికే మూడు రోజులవుతున్నా ఇంకా బీజేపీ, కాంగ్రెస్లలో డైలమా కనిపిస్తున్నది.
తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ తన మార్క్ను ఇప్పటికీ చూపిస్తూనే ఉన్నారు. రెండు ప్రధాన పార్టీలు ఆయన రాజకీయ చతురతతో పోటీ పడలేకపోతున్నాయి. ఆ పార్టీలు జాతీయ పార్టీలు కావడం, నిర్ణయాలు ఢిల్లీలో జరగాల్సి ఉండటంతో తీవ్ర గందరగోళం ఏర్పడుతున్నది. కానీ, కేసీఆర్ ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ పార్టీ నేతలను బీజేపీ, కాంగ్రెస్లు పంచుకున్నప్పటికీ ఏ మాత్రం ఒత్తిడికి గురికాకుండా అభ్యర్థులను ఖరారు చేసి బీఫామ్స్ కూడా ఇచ్చేశారు. ప్రచారానికి రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. తాజాగా రాష్ట్రంలో బస్సుయాత్రను చేపట్టేందుకు అనుమతివ్వాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అనుమతి రావడమే ఆలస్యం ఆయన రణరంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నారు.
అభ్యర్థుల ఎంపికలోనూ కేసీఆర్దే పైచేయి: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందే తన పార్టీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ దేశవ్యాప్తంగా కొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. నిజానికి అప్పుడు టిక్కెట్ల కోసం పార్టీ నేతల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నది. అప్పట్లో అధికార పార్టీ బీఆర్ఎస్ మూడో సారి కూడా అధికారంలోకి వస్తుందన్న బలమైన నమ్మకంతో ఉన్నారు. అయినా అసంతృప్తిని లెక్కచేయకుండా.. ‘ఉండేవారు ఉంటారు, పోయేవారు పోతారు’ అని అన్ని పార్టీల కంటే ముందే బీఫాంలను అందజేశారు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నదని ప్రచారం జరిగినా తాను చేసిన ప్రకటనకే కట్టుబడి ఉన్నారు. ఈ కారణంగా చాలామంది కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. అయినా, కేసీఆర్ భయపడలేదు, పట్టించుకోలేదు. లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి.. టిక్కెట్ ఇస్తామన్నా కూడా నేతలు వేరే పార్టీలకు వెళ్లిపోయారు. అయినా కేసీఆర్ పోయిన వారి స్థానంలో వెంటనే ప్రత్యామ్నాయాన్ని చూసుకున్నారు. అభ్యర్థులను ఎంపిక చేసి బీఫాంలు మాత్రమే కాదు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల కోసం రూ.95 లక్షలు కూడా ఇచ్చారు.
కీలక నేతలు పార్టీని వీడినా పట్టించుకోని గులాబీ బాస్..: లోక్సభ ఎన్నికల టిక్కెట్లు ఇచ్చిన తర్వాత కూడా పలువురు నేతలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరిపోయారు. వీరిలో కడియం శ్రీహరి, గడ్డం రంజిత్రెడ్డి, కే.కేశవరావు వంటి సీనియర్లు కూడా ఉన్నారు. ఖైరతాబాద్, భద్రాచలం ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకటరావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పార్టీని వీడారు. ఇలాంటి సమయంలో పార్టీలో నైరాశ్యం పోగొట్టి, క్యాడర్లో నూతనోత్సాహాన్ని నింపేందుకు కేసీఆర్ వివిధ వ్యూహాలు రచించారు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తు దారి తప్పిందన్న అభిప్రాయం వినిపిస్తున్నది. బీజేపీ ఎంపీ అభ్యర్థుల మార్పు అంశం కూడా మరోమారు చర్చనీయాంశం అవుతున్నది. పెద్దపల్లిలో గోమాస శ్రీనివాస్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేశ్ను బరిలోకి దింపాలని యత్నిస్తున్నది. ఆ దిశగా ఢిల్లీ నాయకత్వం వడివడిగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది. అభ్యర్థుల ప్రచారంపై నిఘా పెట్టిన నాయకత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కేంద్రమంత్రి కిషన్రెడ్డి కూడా తన నియోజకవర్గాన్ని, హైదరాబాద్ను విడిచి ఎక్కడకు వెళ్లడం లేదు. పెద్దపల్లి నుంచి ఆ పార్టీ తరపున బరిలో దిగిన శ్రీనివాస్ బలమైన అభ్యర్థి కారనీ, ప్రచారంలోనూ వెనుకబడుతున్నారని అమిత్ షా టీమ్ గుర్తించిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి అభ్యర్థి మార్పుపై రెండు, మూడు రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశమున్నది. నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలిచిన సైదిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆ జిల్లా క్యాడర్ అంగీకరించే పరిస్థితి లేదు. రాష్ట్ర నాయకత్వంలోని కొందరు కీలక నేతలు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని నేటికీ బలంగా వ్యతికిస్తున్నారనే ప్రచారమున్నది. ఆర్థిక హంగూ అర్భాటాలున్న తేరా చిన్నపురెడ్డిని గానీ, నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బలమైన ఓటుబ్యాంకు ఉన్న బీసీ సామాజికవర్గానికి చెందిన రామరాజు యాదవ్ను గానీ బరిలో దింపాలనే ఒత్తిడి రాష్ట్ర నాయకత్వంపై ఉన్నది. ఈ డైలమాలు ఇలా కొనసాగుతున్నాయి.
మూడు ప్రధాన పార్టీలలో ఒక్క కేసీఆర్ మాత్రమే తొట్రుపాటు లేకుండా రాజకీయాలు చేస్తున్నారు. ఆయన అందరి కంటే ముందున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గెలిచినప్పుడు అపర చాణక్యుడంటారు.. ఓడిపోతే ఇదేం వ్యూహం అంటారు. అందుకే… ఫలితాలతో సంబంధం లేకుండా చూస్తే కేసీఆర్ చాలా వేగంగా ఉన్నట్లే లెక్క.
– వి.వి.వెంకటేశ్వరరావు
63008 66637