మోదీ ఫాసిస్టు పాలన నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి చరిత్ర సంకల్పించి కేసీఆర్ను నడిపిస్తున్నది. మొన్నటి ప్రెస్మీట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ విద్వేషకుట్రలు, మత రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన ఫాసిస్టుల పాలన ఇంకా ఎంతోకాలం నిలువదని, కూలిపోతుందన్నారు. దేశ ప్రజలకు ‘ఇండియా రియాక్ట్స్’ అని ఒక ప్రజాస్వామిక యుద్ధ నినాదాన్నిచ్చారు.
వివక్షకు గురవుతూ అణచివేతను మౌనంగా భరిస్తున్న ప్రజాతంత్రవాదులకు, సామాజిక కార్యకర్తలకు ఆయన మాటలు భయాన్ని జయించే వజ్రాయుధాలుగా ప్రేరణనిస్తున్నాయి. ఇటలీ నియంత, ఫాసిస్టు పాలకుడు ముస్సోలినీని భావజాల యుద్ధంలో ఎదుర్కొన్న తత్వవేత్త అంటానియో గ్రాంసీని, జర్మనీ నియంత హిట్లర్ను కూలదోసిన స్టాలిన్ను కేసీఆర్ గుర్తుకుతెచ్చారు.
ఏ దేశ పాలకుడైన తనది మహత్తర దేశం కావాలనుకుంటాడు. ప్రజలంతా కలిసికట్టుగా జీవించాలని కోరుకుంటాడు. వారి జీవనస్థాయిలను మెరుగుపరిచి, సమన్యాయం కోసం పనిచేస్తాడు. ఇలాంటి విలువలతో కూడిన ప్రగతిశీల పాలనకు మోదీ ఆటంకంగా మారాడని, తిరోగమనమే తప్ప పురోగమన మే లేదని వర్తమానం చెప్తున్నది. గత ఎనిమిదేండ్ల నుంచి దేశం ఎదుర్కొంటున్న ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేని అశక్తతకు మోదీ ప్రభుత్వం దిగజారింది. ‘సబ్కా సాత్-సబ్కా వికాస్- సబ్కా విశ్వాస్’ పచ్చి బూటకమని అనుభవంలో తేలింది. ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా కారుచౌకగా తెగనమ్మేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. దేశీయ పెట్టుబడుదారులైన అదానీ, అంబానీలతో లాలూచీ పరాకాష్ఠకు చేరింది. శతాబ్దాలుగా కొనసాగిన సంఘ సంస్కరణ ఉద్యమాలతో రూపుదిద్దుకున్న నాగరిక ప్రజాస్వామ్య దేశాన్ని మళ్లీ వేల ఏండ్లు వెనక్కి తీసుకెళ్లే విధంగా ప్రజా వ్యతిరేక పాలనను మోదీ కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీ భారత ప్రజల ఉమ్మడి శత్రువుగా మారింది. ఈ విద్వేష రాజకీయాల నిరోధానికి బలమైన కోటగా కేసీఆర్ నిలబడుతున్నారు. దశాబ్దాలుగా దగాపడి కరువు కాటకాలకు నిలయంగా మారిన తెలంగాణను అనతికాలంలో ప్రగతిలో ఒక నమూనాగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ది. ఇదే.. ఇప్పుడు దశదిశలా దేశమంతా మార్మోగుతున్నది.
ఆర్య జాతి ఆధిపత్య, అతి జాతీయవాద రాజకీయాలు నడిపిన హిట్లర్ బాటలో మోదీ నడుస్తున్నారు. ఫాసిజమే అప్పుడు నాజీ పార్టీకి, ఇప్పటి బీజేపీకి ఉన్న భావజాలం. ప్రతిపక్షాలను అణచివేయడం, ప్రజలకు అబద్ధాలు చెప్పి నమ్మించడం, సైనిక శక్తిని ఆరాధించి ఆకాశానికి ఎత్తిచూపటం, ఒకే పార్టీ, ఒకే నాయకుడు, ఒకే మతం, ఒకే భాష, ఒకే సిద్ధాంతం అనే అవలక్షణాల ప్రాతిపదికను ఫాసిజం కలిగి ఉంటుంది. మతం, పేదరికం ఉన్నచోట ఫాసిజం పడగ విప్పుతుంది. సంపన్నులను ఆదరించి సహజ సంపదను వాళ్లకు అప్పజెప్తుంది. వైజ్ఞానిక వాదాన్ని తగ్గించి, మిథ్యావాదాన్ని, మూఢత్వాన్ని పెంచి పోషిస్తుంది. వైవిధ్యం, సమన్యాయాలను అంతం చేయజూస్తుంది. ఆర్థికంగా సంపన్నవర్గాలకు అండగా నిలిచి వారి పన్నులను తగ్గించి శ్రామికవర్గాల మీద పరోక్ష పన్నులను పెంచుతుంది. కార్మిక, కర్షక ప్రయోజనానికి వ్యతిరేకమైన చట్టాలు చేస్తుంది. దేశ సైన్యాన్ని తన స్వప్రయోజనాలకు ఉపయోగించుకొని, అంతరంగిక భద్రతను విచ్ఛిన్నం చేస్తూ అర్ధ సైనిక సమూహాలను పెంచి పోషిస్తుంది.
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీడీపీ పతనమైంది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.79.38లకు దారుణంగా పడిపోయింది. నిరుద్యోగం తారాస్థాయికి చేరుకున్నది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉన్న 80 లక్షల ఉద్యోగ ఖాళీలను నింపడం లేదు. వినియోగధరల సూచి, టోకుధరల సూచి అనూహ్య స్థాయిలో పెరిగిపోతున్నాయి. జీఎస్టీతో మధ్యతరహా పరిశ్రమలను, వ్యాపారాలను చావుదెబ్బ తీశారు. సంఘటిత, అసంఘటిత రంగంలో కార్మికుల వేతనాలు దారుణంగా పడిపోతున్నా పట్టించుకోవడంలేదు. దీనికితోడు పార్ట్టైం, కాంట్రాక్టు ఉద్యోగాల ధోరణి ప్రారంభమైంది. తమ ప్రయోగానికి దేశభక్త యువతతో, త్యాగాలకు సిద్ధంగా ఉండే సైన్యంలో ‘అగ్నిపథ్’ పేరుతో కాంట్రాక్టు ఉద్యోగాలకు తెరతీశారు. దేశంలో అభివృద్ధి నిరోధక ఫాసిజం మొగ్గదశ నుంచి పువ్వు దశకు చేరింది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు రావాలి. ప్రజాకంటకులను అధికార పీఠాల నుంచి పారదోలాలి.
శాంతియుత సహజీవనం, భిన్నత్వంలో ఏక త్వం భారత సమాజ ప్రత్యేకత. ఈ సామరస్యత నేడు సంక్షోభానికి గురవుతున్నది. మానవతావాద ప్రాతిపదికన ప్రజానుకూల ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. ఈ ఆలోచనలనే దేశ ప్రజల ముందు పెడుతున్నారు. సిద్ధాంత, భావసారూప్యం ఉన్న రాజకీయపార్టీలను పౌర సమాజ సంస్థలను భాగస్వామ్యం చేయడానికి కదులుతున్నారు. దేశంలో 50 శాతం పైగా యువత ఉన్నది. వారిని ఉత్పాదక శక్తిగా మార్చడానికి కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. నదీ జలాలను వినియోగించుకోవడంలో సఫలీకృతమైన తెలంగాణ నమూనాను దేశవ్యాప్తంగా అమలుచేయడానికి ముందుకు పోతున్నారు. ఈ వెలుగులో రూపొందించుకున్న శ్రేయో సంక్షేమ రాజ్య దార్శనికత దేశమంతా పుష్పించి ఫలించే రోజు త్వరలో తప్పక సాకారం అవుతుంది. కేంద్రంలో ప్రజాహిత పాలనను స్థాపించడం కోసం కేసీఆర్ ప్రారంభించిన దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంలో సంపూర్ణ శక్తిసామర్థ్యాలతో ప్రజలంతా కదలాలి. ప్రజా వ్యతిరేక పాలకులకు కాలం లేదని చాటిచెప్పాలి.
(వ్యాసకర్త: ఉపాధ్యక్షులు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం)
– అస్నాల శ్రీనివాస్
96522 75560