ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన వెంటనే అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి ఇచ్చిన విభజన హామీలు దశాబ్దకాలం ముగుస్తున్నా ఏ మాత్రం అమలు చేయలేదు. రాష్ట్ర విభజన హామీల్లో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని స్పష్టంగా ఉన్నా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని నోరు తెరిచి అడిగినా ఇవ్వలేదు. పైగా ఇచ్చామని ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు వల్లిస్తున్నారు.
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీని హడావుడిగా విభజించారని.. కేంద్రంలో అధికారంలో రావడానికి అవకాశం ఇచ్చిన ఏపీని ఎంతో సిగ్గులేని రీతిలో విభజించారని కాంగ్రెస్పై 2022, ఫిబ్రవరిలో రాజ్యసభలో ప్రధాని మోదీ మండిపడ్డారు. విభజన అంశంలో ఎలాంటి చర్చ జరపకుండానే విభజన ప్రక్రియ చేసి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. విభజన ప్రక్రియ సరిగా లేని కారణంగా.. ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు నష్టం జరిగిందన్నారు. రాష్ట్ర విభజనతో ఏర్పడిన విద్వేషం ఈ రోజుకు కూడా తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు నష్టం చేకూర్చుతున్నదని ఆయన వాపోయారు.
తొమ్మిదేండ్లుగా అధికారంలో ఉండి ఉభయసభల్లో మెజారిటీ ఉన్నప్పటికీ ఇంత పెద్ద వ్యాఖ్యలు చేస్తూ, అంత బాధపడుతూ ఎదుటివారిపై నిందలు వేశారు. మోదీ కొత్తగా ఏం చేయకపోగా బిల్లులో మంజూరుచేసిన, అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలుచేయలేదు. మోదీ వ్యాఖ్యలపై స్పందించిన రాష్ట్ర మంత్రి కేటీఆర్ దశాబ్దాల స్ఫూర్తిదాయక పోరాటాన్ని, ప్రజల త్యాగాన్ని పదే పదే అవమానిస్తున్నారని, అసంబద్ధ వ్యాఖ్యల పట్ల రాష్ట్ర ప్రజలకు నరేంద్ర మోదీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ వ్యాఖ్యలతో బీజేపీ మనసులోని మాటని బయటపెట్టిందని తెలంగాణ ప్రజానీకం భావిస్తున్నది. విభజన బిల్లులో తెలంగాణతో పాటు ఏపీకి ఇచ్చిన హామీల్లో కీలకమైనవేవీ అమలుచేయడం లేదు. దీనికి ప్రధాన కారణం ఉభయ రాష్ర్టాల్లో బీజేపీ అధికారంలోకి రావటం కాదు కదా, కనీసం ప్రధాన ప్రతిపక్షానికి కూడా వచ్చే పరిస్థితి దరిదాపుల్లో కనిపించకపోవడమే.
గడిచిన తొమ్మిదేండ్లలో బిల్లులో మంజూరు చేసిన, ఇచ్చిన హామీలను అమలుచేసి ఉంటే కీలక రాజకీయపక్షంగా జెండా ఎగురవేసే అవకాశాన్ని బీజేపీ కోల్పోయింది. బిల్లులో తప్పొప్పుల గురించి మాట్లాడే బీజేపీ నాడు వారి పరిశీలన తర్వాతే పార్లమెంటులో పెట్టిన అంశాన్ని గాని లేదా సరిచేసే అధికారం వచ్చి ఇన్నేండ్లయినా ఆ దిశగా పనిచేయకపోవటం గమనార్హం. చట్టంలోని సెక్షన్ 93లో కేంద్రం షెడ్యూల్డ్ 13లో మంజూరుచేసిన అంశాలు కొత్త రాష్ర్టాల్లో సుస్థిరాభివృద్ధి కోసం పదేండ్లలో ఏర్పాటుచేయాలనీ స్పష్టంగా నిర్దేశించింది.
బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో సెయిల్ విభజన జరిగిన ఆరు నెలలకే ఫీజిబులిటీ రిపోర్ట్ ఇచ్చిందని, దీని సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు లోతైన పరిశీలన చేసేందుకు స్టీల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ ఏర్పాటుచేశామని, ఇప్పటివరకు నివేదిక సమర్పించలేదని కేంద్రం తెలిపింది. మరోవైపు కేంద్రమంత్రి కిషన్రెడ్డి బయ్యారంలో లభించే ముడి ఖనిజంలో నాణ్యత లేదని, అందువలనే ప్లాంట్ ఏర్పాటు సాధ్యపడదని ప్రకటించారు. డీపీఆర్ కోసం సమాచారం పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా స్పందన లేదని ఉక్కు మంత్రిత్వశాఖ తెలియజేసింది. అసలు ఈ ఇద్దరిలో ఎవరి మాట నమ్మాలి? అసలు బయ్యారం ఫ్యాక్టరీ నిర్మించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ఉందా లేదా? అనే మీమాంస ప్రజల్లో నెలకొన్నది.
ఎన్టీపీసీ తెలంగాణలో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టును మంజూరు చేస్తూ అందుకు అవసరమైన కోల్డ్ లింకేజీ కల్పించాలని ఆదేశించింది. కానీ ఇప్పటికీ కేవలం 1600 మెగావాట్లు 10,898 కోట్లతో ఏర్పాటుచేసి మిగిలిన 2,400 మెగావాట్లకు 17,739 కోట్లతో 2016 మొదటి త్రైమాసిక ధరల ప్రకారం డీపీఆర్ను ఎన్టీపీసీ పెట్టుబడుల బోర్డు ప్రతిపాదించింది. 2023 ధరల ప్రకారం సవరించిన అంచనాలు రూపొందించాలని వాటికీ పెట్టుబడుల ఆమోదం, సీడబ్ల్యూసీ నీటి కేటాయింపు, కోల్డ్ లింకేజీ వీటితోపాటు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అయిన తర్వాతే ఇది సాధ్యపడుతుందని ఎన్టీపీసీ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ర్టానికి కేంద్ర పెట్టుబడులు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి, ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 85 శాతం రాష్ర్టానికే చెందుతుంది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం .. తెలంగాణకు 34, ఏపీకి 50 అసెంబ్లీ స్థానాలు పెంచి పునర్విభజన చేయాలని నిర్దేశించినప్పటికీ రాజ్యాంగ సవరణ చేయనిదే పెంపుదల కుదరదని అటార్ని జనరల్ అభిప్రాయం మేరకు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఘంటాపథంగా చెప్పింది.
కానీ జమ్మూకశ్మీర్లో ఆర్టికల్-370 రద్దుచేసిన తర్వాత దేశంలోని అన్ని రాష్ర్టాలతో కశ్మీర్ రాజ్యాంగపరంగా సమానమైంది. కానీ, బీజేపీ రాజకీయ ప్రయోజనాలు ఆశించి జమ్మూకశ్మీర్ విభజన చట్టంలో 7 అసెంబ్లీ స్థానాలు పెంచుతూ తదనుగుణంగా డీ లిమిటేషన్ కమిషన్ ఏర్పాటుచేసింది. బీజేపీ, ఒకటి, రెండు చిన్నపార్టీలు మినహా దాదాపు అన్ని రాజకీయపక్షాలు వ్యతిరేకించినా పునర్విభజన ప్రక్రియ పూర్తిచేశారు. ఇలాంటి చర్యలు రాజకీయపార్టీల వైఖరితో ప్రాంతాల మధ్య అనవసర విద్వేషాలు కలుగజేస్తున్నాయి. తెలంగాణలో విభజన చట్టం ప్రకారం సీట్లు పెంచాలని రాజ్యాంగ సవరణ అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్ ప్రధాని మోదీకి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. అయినా కేంద్రం ఏ మాత్రం స్పందించలేదు. ఆర్థికభారం కేంద్రంపై ఏ మాత్రం లేకున్నా అసెంబ్లీ సీట్లు పెంచితే తమకు లాభం లేకపోగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మరింత బలోపేతమవుతుందనే సంకుచిత ధోరణితో నిలిపివేయటం సమాఖ్య వ్యవస్థకు మంచిది కాదు. సమీప భవిష్యత్తులో బీజేపీ మాత్రం దీని నుంచి బావుకునేది ఏమీ కనిపించటం లేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటనలోని పరిశ్రమల ప్రోత్సాహకాలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధుల కేటాయింపు ఊసు కూడా లేదు.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-ఇనగంటి రవికుమార్
94400 53047