ప్రతి ఆటకు కొన్ని నిబంధనలుంటాయి. వాటిని పాటించేవాళ్లే ఆటలో పాల్గొనాలి. లేకపోతే ఆట రక్తికట్టదు. రూల్స్ పాటించకపోతే తొండాట అంటారు. ప్రజాస్వామ్యం విషయంలో బీజేపీ ప్రవర్తన అచ్చంగా తొండాటే అని చెప్పాలి. 2014లో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మన దేశంలో ప్రజాస్వామ్యం ఓ ప్రహసనంలా తయారైంది. ప్రతి ఆటలాగే ప్రజాస్వామ్యానికీ ఓ లెక్క ఉంటుంది. ఎన్నికల్లో మెజారిటీ సాధించిన పార్టీ అధికారం చేపడుతుంది. సంఖ్యాబలం లేని పార్టీ విపక్షంలో కూర్చుంటుంది. కానీ, బీజేపీకి అలాంటి లెక్కాపత్రం ఏదీ ఉన్నట్టు లేదు. రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరే ఇందుకు నిదర్శనం.
ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రత్యేకతలు రాష్ర్టాల ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయి. బెంగాల్ ఛీకొట్టింది. ఢిల్లీ మూలకు నెట్టింది. ఉన్న కర్ణాటక ఊడిపోయింది. కానీ బీజేపీకి ఆశ లావు. అంతటా మనమే గెలవాలి. గెలవకపోతే సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించాలి. ఎమ్మెల్యేలను కొనాలి. పార్టీలను చీల్చి నయానో భయానో సొంత ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. పార్టీని చీల్చేందుకు అవతలివాళ్లు ఒప్పుకోకపోతే దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి దడ పుట్టించాలి. ‘అదిగో కేసు.. ఇదిగో అరెస్టు’ అని ఊదరగొట్టాలి. వారిలో కొందరు భయపడిపోయి దారికి వస్తారు. ఏం చేసినా లక్ష్యం ఒక్కటే. పగ్గాలు మన చేతుల్లోనే ఉండాలి. ఇదీ బీజేపీ నీతి. కర్ణాటకలో ఈ తరహాలోనే గతంలో అధికారంలోకి వచ్చింది. కానీ దుష్పరిపాలన, అవినీతి, మతోన్మాదం బీజేపీ కొంపముంచాయి. ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. ప్రధాని మోదీ స్వయంగా మతావేశాన్ని రెచ్చగొడుతూ ప్రసంగాలు చేసినా, సాష్టాంగం స్థాయిలో వంగి దండాలు పెట్టినా ఓటర్లు బీజేపీని అరేబియా సముద్రంలోకి విసిరి పారేశారు. అయితే దీనినుంచి ఆ పార్టీ ఏమైనా నేర్చుకుందా అంటే గుండుసున్నా అనే చెప్పాలి.
వెనుకటి గుణమేల మాను అన్నట్టు ఇప్పుడు అదేరకం చౌకబారు ఎత్తుగడను మళ్లీ బయటికి తీసింది. మహారాష్ట్రలో బీజేపీ ఇంతకుముందే శివసేనను చీల్చి అధికార పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. బలం పెంచుకునేందుకు తాజాగా ఎన్సీపీని చీల్చింది. రెండు సందర్భాల్లోనూ దర్యాప్తు సంస్థల బెదురు పనిచేసింది. ఎన్సీపీ నేతలపై దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టడమే కాకుండా అజిత్ పవార్ వంటి కొందరి ఆస్తులను జప్తు చేసింది కూడా. ఇప్పుడు వారంతా వాషింగ్ పౌడర్ నిర్మాలో కడిగిన ముత్యాలవుతారు, సచ్ఛీలురవుతారు. ఉపముఖ్యమంత్రి పదవులు, మంత్రి పదవులు వరిస్తాయి. దర్యాప్తు సంస్థలు వారి గురించే మరిచిపోతాయి. బీజేపీ ఆడించినట్టల్లా ఆడితే చాలు. సర్వపాపాలూ హరించుకుపోతాయి. లైంగిక వేధింపుల కేసులో బాధితులైన క్రీడాకారిణులు ఎంతగా పోరాటం చేసినా నిందితుడైన బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ అరెస్టు కాడు. ఏ తప్పూ చేయకున్నా ఆప్ నేత మనీశ్ సిసోడియా జైలు నుంచి బయటకు రాడు. దేశ ప్రజలు ఈ తతంగాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు. సరైన సమయంలో సరైన తీర్పుతో వారు జవాబిస్తారన్న సంగతి బీజేపీ గుర్తుంచుకోవాలి.