‘బ్రిటిష్ రాజులు మన దేశానికి స్వాతంత్య్రం ఇచ్చారన్నది వాస్తవం. మరి మనం ఇప్పుడు బ్రిటిష్ రాణి, రాజుల ఫొటోలు పెట్టుకొని మాకు స్వాతంత్య్రం మీ భిక్షనే అని ప్రతీరోజు తలచుకోవాలా? స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ వంటి స్వాతంత్య్ర సమరయోధులను తలచుకుంటున్నామా? స్వాతంత్య్రం ఇచ్చినవారు గొప్పనా, ప్రజల పక్షాన నిలబడి స్వాతంత్య్రం సాధించినవారు గొప్పనా?’ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ గొప్పనా, తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ పార్టీ గొప్పనా? ముమ్మాటికీ బీఆర్ఎస్సే గొప్ప. కాంగ్రెస్ పార్టీ కూడా బ్రిటిష్ పాలకుల లెక్కనే ప్రవర్తించింది. బ్రిటిష్ వారు మనం అడిగిన వెంటనే స్వాతంత్య్రం ఇవ్వలేదు. లక్షలమంది బలిదానాలు, ఆందోళనల తర్వాత ఇచ్చారు.
Congress | కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ప్రజల మనసు తెలుసుకొని రాష్ట్రం ఇవ్వలేదు. వేలమంది సామాన్యుల బలిదానాల తర్వాత.. సంఘర్షణ తర్వాత రాష్ట్రం ఇచ్చింది. తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెట్టి.. అరిగోస పెట్టిన తర్వాత రాష్ట్రం ఇచ్చింది. కాంగ్రెస్ తీరు మొదటినుంచి తెలంగాణకు వ్యతిరేకమే. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరోసారి తెలంగాణ ప్రజల ముందుకువస్తున్నది. తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ చరిత్ర తెలియనిది కాదు. దేశంలో 60 ఏండ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీ ఏనాడూ ప్రజల కోణంలో పాలించలేదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయలేదు.
తరతరాలుగా కాంగ్రెస్ పార్టీది రక్తచరిత్రే..: కాంగ్రెస్ పార్టీ తీరును గమనిస్తే.. తెలంగాణ ప్రాంతానికి తరతరాలుగా అన్యాయం చేస్తూనే ఉన్నది. దీనికి అనేక సాక్ష్యాలున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా.. నిజాం రాజ్యం భారతదేశంలో విలీనమయ్యే సందర్భంలో నాటి హైదరాబాద్లో జరిగిన మారణహోమం ప్రపంచానికి తెలియనిది కాదు. ఆనాడు కేంద్రంలో అధికారాన్ని చెలాయిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. కమ్యూనిస్టులను, అమాయక తెలంగాణ భూమి పుత్రులను రజాకార్ల పేరుతో దారుణంగా కాల్చి చంపారు. ఇక్కడ జరిగిన మారణహోమంలో సుమారు 40 వేల మంది ప్రజలు మరణించినట్టు నాటి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీయే అంచనాకు వచ్చింది. అయితే, ఆ నివేదిక బయటకురాలేదు. కమిటీ చెప్తున్నదానికి రెండు-మూడింతల వరకు మరణాలు ఉండవచ్చని నాటి పెద్దలు, చరిత్రకారులు చెప్తుంటారు. ఇక ముల్కీ ఉద్యమం గురించి తెలియనివారు తెలంగాణలో ఉండరు. మా ఉద్యోగాలు మాక్కావాలంటూ తెలంగాణ యువత 1952లో పోరాటాన్ని ప్రారంభిస్తే… నాడు అధికారంలో ఉన్న కర్కశ కాంగ్రెస్ హైదరాబాద్లో యువతను కాల్చిచంపింది. 18 మంది యువకులు ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. వేలమంది యువకులను జైల్లో పెట్టారు.
ఆనాడు జరిగిన ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తుల్లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కూడా ఒకరు. నాటి సిటీ కాలేజీ వద్ద జరిగిన సంఘటన గురించి తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మార్లు చెప్పిన విషయం మనందరికీ తెల్సిందే. ఇక 1969లో జరిగిన తొలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటం గురించి మనకు తెల్సిందే. ఆనాడు సుమారు 340 మంది ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో అసువులు బాశారు. మదన్మోహన్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో జరిగిన రాజకీయ పోరాటాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ నీరుగార్చింది. పెద్ద మనుషుల ఒప్పందం వట్టిపోయింది. తెలంగాణ ప్రజా సమితి పార్టీ గుర్తుపై గెలిచిన పది మంది ఎంపీలను కాంగ్రెస్లో విలీనం చేయించుకొని తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలకు ఆనాడు కూడా మాయమాటలు చెప్పి.. మభ్యపెట్టి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను తుంగలో తొక్కింది కాంగ్రెస్. తెలంగాణ ప్రజా సమితి పార్టీని నామరూపాల్లేకుండా చేసింది. తెలంగాణ అస్తిత్వానికే సవాలు విసిరింది కాంగ్రెస్ పార్టీ. పెద్ద మనుషుల ఒప్పందం పేరుతో తిమ్మిని బమ్మి చేసింది.
తెలంగాణ ప్రజలంటేనే నక్సలైట్లని..
తెలంగాణ యువత అంటే టెర్రరిస్టులుగా చిత్రీకరించిన ఘనచరిత్ర కాంగ్రెస్ పార్టీదే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక, ఇక్కడి వనరులు దోపిడీకి గురవుతుంటే ఆనాడు యువత అటవీబాట పట్టింది. ఇలా వెళ్లిన వారిని సంఘ విద్రోహులుగా చిత్రీకరించి ఎన్కౌంటర్లు చేసిన పాపం కాంగ్రెస్ పార్టీదే. 1972 తర్వాత ఐదు సూత్రాల పథకం, ఆరు సూత్రాల పథకం అంటూ తెలంగాణ యువతను మాయ చేసే కుట్ర చేసింది.
మలిదశ ఉద్యమాన్ని అణచివేసే కుట్ర..: తెలంగాణ ఉద్యమాన్ని అన్ని దశల్లోనూ అణచివేసే కుట్రచేసింది కాంగ్రెస్ పార్టీనే. 2001లో ఉమ్మడి రాష్ట్రంలో జవసత్వాలు కోల్పోయి ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఉద్యమం ఊతకర్రలా కనిపించింది. ఆనాడు స్థానికసంస్థల ఎన్నికల్లో కేసీఆర్ సృష్టించిన సునామీని చూసిన కాంగ్రెస్.. ఆ తర్వాత 2004లో కేసీఆర్తో పొత్తు పెట్టుకున్నది. తెలంగాణ ఇవ్వాలన్న ఏకైక షరతుతో కేసీఆర్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు. తన శక్తియుక్తులన్నింటిని ధారపోసి కాంగ్రెస్కు అధికారం దక్కేలా చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత కూడా కేసీఆర్ ఎలాంటి శాఖలేని కేంద్ర క్యాబినెట్ మంత్రిగా కొంతకాలం పనిచేశారు. తనకు శాఖలతో నిమిత్తం లేదని, తెలంగాణ ఇస్తే చాలని నాటి యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అగ్రనేత ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్సింగ్లకు కూడా చెప్పాడు.
ఈ దశలోనే అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుండా కాలయాపన చేసింది. దీంతోపాటు ఉద్యమపార్టీ గొంతుపిసికే ప్రయత్నం చేసింది. ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించింది. టీఆర్ఎస్ పార్టీని మింగే ప్రయత్నం చేసింది. రాజకీయంగానే తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ కొట్టేందుకు సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నం చేసింది. రాజకీయ పదవులు తమకు గడ్డిపోచతో సమానం అని చెప్పి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసిన సందర్భం కూడా తెలంగాణ ప్రజానీకానికి తెలియనిది కాదు.
2009 నవంబర్ 29న ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అంటూ కేసీఆర్ అమరణ నిరాహార దీక్షకు దిగిన దరిమిలా డిసెంబర్ 9న రాష్ట్రం ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అయితే, కృత్రిమ ఉద్యమాన్ని ఆంధ్ర ప్రాంతంలో లేవదీసి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెనక్కి తీసుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుపై వందల మంది తెలంగాణ యువత ఆత్మార్పణం చేసుకున్నారు. వాస్తవానికి వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారనడం కన్నా.. కాంగ్రెస్ చంపిందని ఆనాడు మేధావులందరూ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ దుర్మార్గ చరిత్రకు తెలంగాణ రాష్ట్రమే ఒక సజీవ సాక్ష్యం.
రాష్ర్టానికో మ్యానిఫెస్టో ఎందుకు?: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల కోసం మ్యానిఫెస్టోను విడుదల చేసింది. అయితే, జాతీయపార్టీ అని చెప్పుకొనే కాంగ్రెస్ జాతీయస్థాయిలో తమ విధానం ఇది అని ఎందుకు చెప్పలేకపోతున్నది? రాష్ర్టానికో హామీని ఎందుకు ఇస్తున్నది? తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణలో చెప్తున్న హామీలను ఎందుకు అమలుచేయడం లేదో ఆ పార్టీ చెప్పగలదా? దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చినా తాము వీటిని అమలుచేస్తామని కాంగ్రెస్ చెప్పలేకపోతున్నది. దేశానికి ఉండాల్సిన విధానాన్ని రాష్ర్టానికొకటి చొప్పున మార్చేశారు.
ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో ఒకవిధంగా.. అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో మరోవిధంగా కాంగ్రెస్ తీరు ఉంటున్నది. తెలంగాణలో చెప్పిన 42 అంశాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, రాజస్థాన్ వంటి రాష్ర్టాల్లో అమలుచేయడం లేదు. అంటే ఇది కూడా నయవంచనే అని చెప్పవచ్చు. నయవంచనకు మరోపేరే కాంగ్రెస్. దీనికి ఆ పార్టీ తెలంగాణలో వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం.
– ఓరుగంటి సతీష్ 80080 06667