లక్షద్వీప్లోని మినీకాయ్ ద్వీపంలో వ్యూహాత్మక నౌకాదళ స్థావరాన్ని భారత్ ఏర్పాటు చేసింది. ఐఎన్ఎస్ జటాయు పేరిట నెలకొల్పిన ఈ స్థావరాన్ని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ ఇటీవల ప్రారంభించారు. సీతమ్మను అపహరించుకుపోతున్న రావణుడిని ఎదుర్కొన్న జటాయు పేరు దీనికి పెట్టడం విశేషం.
1980లోనే మినీకాయ్లో నావికాదళ కార్యక్రమాలు ప్రారంభించిన భారత్.. 2012లో ఐఎన్ఎస్ ద్వీప్క్ష్రక్ పేరిట కవరత్తిలో మొదటి పూర్తిస్థాయి నౌకాదళ స్థావరాన్ని నెలకొల్పింది. చైనా సరిహద్దుల్లో సైనిక ప్రతిష్టంభన, మాల్దీవులతో వివాదం నేపథ్యంలో మినీకాయ్లోని వ్యవస్థను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. ఐఎన్ఎస్ జటాయు మోహరింపుతో తీరప్రాంత పరిరక్షణలో వ్యూహాత్మక అడుగులు వేయడంతో పాటు భారత సైనిక ఉనికిని, పరిధిని విస్తరించినట్టయింది.
శ్రీలంకలోని హంబన్తోట ఓడరేవు, పాకిస్థాన్లోని గ్వాదర్లో మౌలిక సదుపాయాల కల్పనను చైనా వేగవంతం చేస్తున్నది. వివిధ ప్రాజెక్టుల ద్వారా భారత తీరానికి చేరువయ్యేందుకు డ్రాగన్ ప్రయత్నిస్తున్నది. హిందూ మహాసముద్రంలో చైనా ఉనికి పెరుగుతుండటంతో భారత నావికా సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకే ఈ ప్రాంతంలో నౌకాదళ స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. పైరసీ, మాదకద్రవ్యాల రవాణాకు ఈ స్థావరం అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. మాల్దీవులతో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్యాన్ని కట్టడి చేయడంలో ఐఎన్ఎస్ జటాయు ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. పైగా దీని ద్వారా చైనా-మాల్దీవుల కార్యకలాపాలపై నిఘా పెట్టవచ్చు.
దక్షిణాసియాలో ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు భారత్, చైనాలకు మాల్దీవులు వ్యూహాత్మకంగా కీలకమైనది. అందుకే మన దేశం ఎప్పటినుంచో మాల్దీవులకు సాయం చేస్తున్నది. అందులో భాగంగానే 45కు పైగా మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టింది. పర్యాటక ఆదాయంపైనే ఆధారపడుతున్న మాల్దీవులకు అత్యధికంగా వెళ్లేది భారతీయులే. మాల్దీవుల గత ప్రభుత్వం భారత్తో సఖ్యతతోనే వ్యవహరించేది. కానీ, ఇటీవల ఎన్నికైన మొయిజు సర్కార్ చైనాకు వత్తాసు పలుకుతున్నది. చైనా కూడా కొన్నేండ్లుగా మాల్దీవులకు ఆర్థికసాయం అందిస్తూ, మౌలిక సదుపాయాల కల్పన, పోర్టుల లీజు ఒప్పందాలతో ఆ దేశంతో సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నది.
చైనా అనుకూల విధానాన్ని అనుసరిస్తున్న మొయిజు మాల్దీవులలో ఉన్న మన సైనికులు వెనక్కి వెళ్లిపోవాలని పట్టుబడుతున్నారు. ఇతర దేశాలకు చెందిన సైనికులు తమ నేలపై ఉండకూడదని ఆయన తేగేసి చెప్తున్నారు. భారత్ అందించిన హెలీకాఫ్టర్ నిర్వహణ సేవలను సైనికులకు బదులుగా సాంకేతిక సిబ్బంది అందించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అందుకే ఇటీవల సాంకేతిక నిపుణుల బృందాన్ని అక్కడికి పంపింది భారత్. మే 10 తర్వాత మాల్దీవులలో భారత సైనికులెవరూ ఉండరని ఇటీవల మొయిజు ప్రకటించారు. అయితే అంతకుముందు రోజే మాల్దీవులు, చైనా మధ్య మిలటరీ సహకారానికి సంబంధించి ఒప్పందం కుదరడం ఆందోళనకరం.
భారత్ పట్ల మొయిజు వ్యవహారశైలితో మాల్దీవులు భారీగా నష్టపోయింది. ఆ దేశ పర్యాటక రంగం కుదేలైంది. 2.09 లక్షలతో మాల్దీవుల పర్యాటకుల్లో అగ్రస్థానంలో ఉండే భారతీయుల సంఖ్య 20 వేలకు పడిపోయింది. దీంతో ఆ దేశ పర్యాటక ఆదాయం భారీగా తగ్గిపోయింది. అయినా ఇవేమీ పట్టని మొయిజు భారత్పై నిప్పులు కక్కుతూనే ఉన్నారు. అయినప్పటికీ మానవతా దృక్పథంతో భారత్ ఆ దేశానికి సాయం అందిస్తూ, ఆదుకుంటూనే ఉన్నది.
ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయాన్ని పక్కనపెట్టి మరీ తుర్కియే, చైనాలలో మొయిజు మొదటగా పర్యటించడం గమనార్హం. భారత్-మాల్దీవుల మధ్య నెలకొన్న దౌత్య వివాదాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని, మాల్దీవులపై పట్టు పెంచుకోవాలని, తద్వారా భారత్ను దెబ్బకొట్టాలని చైనా భావిస్తున్నది. అందులో భాగంగానే భారత కదలికలపై నిఘా వేసేందుకు మాల్దీవులను బేస్గా మార్చుకోవాలని చైనా కుట్ర పన్నుతున్నది. అయితే మినీకాయ్లో ఏర్పాటు చేసిన నావికా స్థావరంతో చైనా, మాల్దీవుల కుట్రలకు చెక్ పెట్టినట్టయింది.