అరవై లక్షల ఓట్లు ఇస్తే.. రెండు లక్షల కొలువులు ఇస్తుందట కాంగ్రెస్. ఆ పలుకులు ప్రియాంక గాంధీ నోట చదివించాం కాబట్టి మన తెలంగాణ యూత్ నమ్మాలని పీసీసీ పెద్ద ఉవాచ. దశాబ్దాల తరబడి పాలించిన ఇదే కాంగ్రెస్ నీళ్లు, నిధులు, నియామకాల్లో చెయ్యిచ్చింది కాబట్టే కదా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి బీజం పడింది.
మొదటి ఏడాదిలోనే ఏకంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం ప్రాక్టికల్గా సాధ్యమేనా? నెలకు 16,666 మందిని కొత్తగా నౌకర్లలోకి ఎక్కిస్తదట కాంగ్రెస్ పార్టీ. చిక్కిశల్యమై, దేశంలో కొన్నిచోట్ల అధికారంలో ఉన్న రాష్ర్టాలల్లో ఏడాది లోపల రెండు లక్షల ఎంప్లాయీస్ను నింపిన దాఖలా ఒక్కటన్న సూపెట్టి, తెలంగాణలో గా మాట చెప్తే ఇక్కడి ప్రజలు నమ్మేటోళ్లు. కనీ, కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయలే.
తెలంగాణలో కేసీఆర్ సర్కారు 1.35 లక్షల కొలువులు ఇప్పటికే ఇచ్చి ఉన్నది. ఇంకో 92 వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నది. అంటే, 2.27 లక్షల మందితో ప్రభుత్వ యంత్రాంగాన్ని బలోపేతం చేస్తున్నది. ఇగ ఈ రెండు లక్షల కొలువులు టోకున ఒకటేతాప ఇస్తమని ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్ అర‘చేతి’లో స్వర్గం చూపిస్తున్నది. ఎట్లపడితే అట్ల ఏదో ఒకటి చెప్పి, ఎట్లనన్న జేసి అధికారంలోకి రావాలనే తపనతో నిప్పుకణికలైన తెలంగాణ ప్రజలకు, యువతకు పరీక్ష పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ.
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వ సహనాన్ని పరీక్షిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను, ఇవ్వబోతున్న ఉద్యోగాలను ఎంతలా మరుగుపరచాలనుకుంటే అంతలా అలెర్ట్ అవుతుంది తెలంగాణ సమాజం. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకుంటే మంచిది. ఇక బీజేపీ స్టేట్ చీఫ్ తక్కువేం కాదు. తను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన కొంత కాలానికి హైదరాబాద్లో వరదలు వచ్చాయి.
ఆ వరదల్లో గజగజా వణుక్కుంటూ బిక్కుబిక్కుమంటూ బతికారు హైదరాబాద్ ప్రజలు. వారిని అక్కున చేర్చుకున్నది రాష్ట్ర ప్రభుత్వమే. కానీ, ‘బండి’ పోతే ‘బండి’ ఇస్తామంటూ నానా హడావుడి చేశాడు బండి సంజయ్. తీరా సమస్యకు పరిష్కారం చూపకపోగా, బీమా ఉన్న బండ్లకే అని బాధితులతో పరాష్కమాడాడు. బండి పోయినవాళ్లకు బండి ఇవ్వకుండా చెవిలో పువ్వు పెట్టాడు. గసొంటి అధ్యక్షుడు బండి సంజయ్. ఆయన ఎట్లవడితే అట్ల స్టేట్మెంట్లు ఇయ్యంగనే తెలంగాణ ప్రజలు నమ్ముతరా? తమ పార్టీ సెంట్రల్లో అధికారం ఉన్నది కాబట్టి ‘ఇదిగో తెలంగాణకు ఇది తీసుకువచ్చాం’ అని హైదరాబాద్ నడిబొడ్డున కాలరెగరేసి చెప్పుకొనేది ఒక్కటంటే ఒక్కటన్నా ఉన్నదా? కానీ రాష్ట్రంలో మాత్రం బీజేపీకి అధికారం కావాల్నట? ఎక్కడి ఇష్యూలతోనో సినిమాలు తీస్తరట, జనాలకు చూపిస్తరట.
టాకీసులో గంటల పాటు కూసుండే కన్నా తన పార్లమెంట్ సెగ్మెంట్లోని గ్రామాల ప్రజలను కలిసి, ఢిల్లీ నుంచి ఏమేం తెచ్చిండో, ఏమేం తెస్తాడో చెప్తే ముల్లె ఏమైనా పోతుందా? ఫక్తు ఎవలు సమ్మె చేస్తరు, ఎవలు రోడ్లెక్కుతరు, ఎవలు టెంట్ ఏస్తరో చూసి అక్కడ వాలిపోవాలనేది బండి సంజయ్ ఎజెండా.
ఎట్లెట్ల పెంట జెయ్యచ్చోనని కాసుకొని కూసుంటడు బండి సంజయ్. ‘మీరు లొల్లి ముదిరేటట్టు జేయుం డ్రి, మీ కొలువులకు, సదువులకు, ప్రిపరేషన్కు ఏమైనా అయితే అధికారంలోకి రాంగనే మేం చూస్కుంటం’ అని మాటిమాటికీ విద్యార్థులను రెచ్చగొడుతడు. అసలు అధికారంలోకి వస్తమని నమ్మిచ్చేటందుకు ఇగో మేం అధికారంల ఉన్న రాష్ర్టాల్లో గీ గీ పనులు జేసినం అని చెప్పొచ్చుగా? తెలంగాణల కేసీఆర్ చేస్తున్న మంచికి మించిన రూబడి ఇదిగో అని ‘రైతుబంధు’, ‘ప్రాజెక్టులు’, ‘ఉద్యోగాలు’ అసొంటి ఎన్నో పనులను సూపెడుతున్నరు.
బీజేపీ కూడా అటు కేంద్రంలో, ఇటు అధికారంలో ఉన్న రాష్ర్టాలల్లో చేసిన అభివృద్ధి పనులను చూపెట్టవచ్చుగా? అధికారంలోకి వస్తమని అనేటందుకు బేస్ ఏంటిదో అసలుకే చెప్పదు బీజేపీ? ఇప్పుడేమన్నా ఓ యాభై మంది బీజేపీ ఎమ్మెల్యేలున్నట్టు, వచ్చే ఎన్నికల్లో ఇంకో ఇరువై, ముప్పై సీట్లు పెరుగుతయన్నట్టు ఇస్తున్న బిల్డప్లు జూస్తుంటే ప్రజలే ఈసడించుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ మొదట 60 సీట్లు సాధించారు. ఆ తర్వాత 88 సీట్లు సాధించారు. ఆ బేస్తో ఇపుడు నూరు సీట్లు ఖాయమంటున్నారు. ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఇంకా పచ్చిగా చెప్పాల్నంటే దేశంల 2 కోట్ల నౌకర్లు ఇస్తమని నరికిన బీజేపీని, రాష్ట్రంల అధికారంలోకి వస్తే రెండు లక్షల కొలువులు ఇస్తమని కాంగ్రెస్ పార్టీ చెప్తే ఇక్కడ నమ్మేటోళ్లు ఎవ్వలో ఆ పార్టీలకే తెలియాలి.
ఇల్లెందుల దుర్గాప్రసాద్: 94408 50384
(వ్యాసకర్త: ఇండిపెండెంట్ జర్నలిస్ట్)