దేశమంతా తెలంగాణ మోడల్ అని ఎందుకు చెప్పుకొంటున్నది? ఇతర రాష్ర్టాల్లో ‘దేశ్ కీ నేత కేసీఆర్’ అనే నినాదం ఎందుకు వినపడుతున్నది? అమెరికాలోని అధ్యయన సంస్థల మేధావులు వచ్చి తెలంగాణలో అమలుచేస్తున్న ‘మిషన్ భగీరథ’ వంటి పథకాలను ఎందుకు అధ్యయనం చేస్తున్నారు? తెలంగాణ రాష్ర్టానికి అనేక అవార్డులు ఎందుకు లభిస్తున్నాయి? విదేశాల్లో ఏ ముఖ్యమంత్రికీ లేనంత గౌరవం కేసీఆర్కే ఎందుకు లభిస్తున్నది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం రావాలంటే, కేసీఆర్ వినూత్న పరిపాలనా సరళి గురించి తెలుసుకోవాల్సిందే.
ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాలను ఎల్పీజీగా చెప్తారు. సోవియెట్ యూనియన్ కూలిపోయి అమెరికా ఆధిపత్యంలో ఏకధ్రువ ప్రపంచం ఏర్పడిన తర్వాత ప్రపంచీకరణ విధానాలు అమలుకావడం మొదలైంది. దేశాభివృద్ధికి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేవి తప్పనిసరైనవిగా మారిపోయాయి. మన్మోహన్సింగ్ మొదలుకొని మోదీ వరకు అంతా ఈ విధానాల కోసం వకాల్తా పుచ్చుకున్నవారే. పరిశ్రమలను పట్టించుకోవాలే తప్ప ప్రజల సంక్షేమంపై పట్టింపు అవసరం లేదనే వాదన మొదలైంది. చాలామంది నాయకులు వ్యవసాయం దండుగ అనే స్థాయికి చేరుకున్నారు. ప్రైవేటైజేషన్ మంత్రం పఠించడం ఆనవాయితీగా మారింది. మన దేశంలోనే కాదు, అనేక వర్ధమాన, పేద దేశాల్లో ఇదే పరిస్థితి. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ విలక్షణ రాజకీయవేత్త- పరిపాలకుడు. ప్రపంచీకరణ కాలంలో ఉద్యమాలకు కాలం చెల్లిందని చాలామంది వామపక్ష మేధావులు, నాయకులు భావిస్తున్న తరుణం లో దిగ్విజయంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన ధీరోదాత్తుడు కేసీఆర్. అప్పటివరకు పోరాటాలంటే హింసాయుతంగా సాగుతాయనే భావన ఉండేది. కానీ, కేసీఆర్ అహింసాయుతంగా ఉద్యమాన్ని నడిపి పార్లమెంటరీ విధానాన్ని నమ్ముకొని ప్రజలకు నమ్మకం కలిగించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. ఇదే కేసీఆర్లోని నవ్యత్వం.
పరిపాలనా రంగంలోనూ కేసీఆర్ వైశిష్ట్యం దోత్యకవుతున్నది. పారిశ్రామిక అభివృద్ధినీ, సంక్షేమ విధానాల సమతూకం పాటించి సఫలమైన నాయకుడిగా కేసీఆర్ ప్రసిద్ధులయ్యారు. ఆర్థికవేత్తలు తమ సూత్రాలను, వాదనలను సవరించుకోక తప్పని పరిస్థితిని కేసీఆర్ కల్పిస్తున్నారు. కేసీఆర్ పారిశ్రామికీకరణకు, ప్రైవేటీకరణకు వ్యతిరేకి కాదు. కానీ అందుకు ప్రజా సంక్షేమాన్ని పణంగా పెట్టకూడదంటారు. ఆయన పరిపాలనా విధానాలు కూడా ఆశ్చర్యం గొలుపుతున్నాయి. ఆయన సునిశిత మేధాసంపత్తిని అవి చాటుతాయి. ఉదాహరణకు రాష్ట్రమంతా మంచినీటిని సరఫరా చేయడం గొప్ప విషయం. ప్రజలకు వచ్చే వ్యాధుల్లో నూటికి తొంభై శాతం కలుషిత జలాల వల్ల వచ్చేవే. అంటే మంచినీరు అందిస్తే ప్రజల ఆరోగ్య పరిరక్షణ జరుగుతుందని చెప్పారాయన. ప్రజల ఆరోగ్య పరిరక్షణ అంటే దవాఖానలు పెట్టడమే కాదు, మంచినీరు అందించడం, వైద్యుల సంఖ్య పెంచడం. పల్లె జనం నకిలీ వైద్యుల మీద ఆధారపడకుండా చేయడం.
ప్రజా సంక్షేమం ద్వారా పారిశ్రామికీకరణ విజయవంతం అవుతుందని చాటిచెప్పిన ఆర్థికవేత్త కూడా కేసీఆర్ అని అంగీకరించవలసిందే. ప్రజలకు కొనుగోలు శక్తి ఉన్నప్పుడే వ్యాపారం కూడా సాగుతుంది. ఇదేవిధంగా శాంతిభద్రతలను పరిరక్షించాలంటే పోలీసులను, తుపాకులను నమ్ముకోవడం కాదు. ప్రజా సంక్షేమ విధానాలను అమలుచేయడమని ఆయన నిరూపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే సంక్షేమ విధానాన్ని పాదుకొల్పవచ్చునని ఆయన ఆచరణ ద్వారా వెల్లడించారు. మన వంటి వర్ధమాన దేశంలో వ్యవసాయరంగమే పారిశ్రామిక సౌధానికి పునాదిగా నిలుస్తుందని గ్రహించి ఆ దిశగా తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ నడిపిస్తున్నారు. అదే కేసీఆర్ను విశిష్ట నేతగా నిలుపుతున్నది.
దేశవ్యాప్తంగా పబ్లిక్రంగ పరిశ్రమలను అదానీ వంటి ప్రైవేటు వ్యక్తులపరం చేయడం మోదీ హయాంలో జోరందుకున్నది. కాంగ్రెస్ కూడా ఇదే బాటలో సాగింది. కానీ, కేసీఆర్ ఇందుకు భిన్నంగా పబ్లిక్ రంగాన్ని పటిష్ఠం చేస్తున్నారు. ఆశ్రిత పక్షపాతం కొద్దీ తమకు కావలసిన పారిశ్రామికవేత్తలకు ఆస్తులు కట్టబెట్టడం, పర్మిషన్లు ఇవ్వడం కేసీఆర్ పాలనలో సాగడం లేదు. ఉదాహరణకు- ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్తురంగాన్ని ప్రైవేటు వ్యక్తుల పరం చేయడం జరిగింది. కానీ, కేసీఆర్ విద్యుత్తు కేంద్రాలు ప్రభుత్వరంగంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా వాటిని సమర్థవంతంగా నడుపుతున్నారు. వాటి కాంట్రాక్టులను కూడా బీహెచ్ఈఎల్ వంటి ప్రభుత్వరంగ సంస్థకే కట్టబెట్టారు. దేశవ్యాప్తంగా మోదీ పాలనలో చిన్నతరహా పరిశ్రమలు మూతపడుతున్నాయి. పెద్ద, విదేశీ పరిశ్రమలకే కేంద్ర ప్రభుత్వ విధానాలు అనుకూలంగా ఉన్నాయి. నిజానికి పారిశ్రామికాభివృద్ధిలో సమాజ సంక్షేమంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కీలకమైనవి. అందుకే కేసీఆర్ వీటి మీద దృష్టి సారించారు. ఉమ్మడి రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలను తెరిపించే కార్యక్రమం ఉద్యమంలా చేపట్టారు. ఇండస్ట్రియల్ హెల్త్ క్లీనిక్ అంటూ పెట్టి మూడు వందలకు పైగా పరిశ్రమలను మళ్లీ తెరిపించారు.
ఆసరా పింఛన్, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మీ, మిషన్ భగీరథ మొదలైన పథకాలను సంక్షేమ పాలనకు నిదర్శనంగా చెప్తుంటారు. ఇందులో తప్పు లేదు. కానీ, కేసీఆర్ పరిపాలన అంతకుమించిన విస్తృతి కలది. కేసీఆర్ పరిపాలనకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రావలసినంత గుర్తింపు రావడం లేదని చెప్పవచ్చు. ఇదే మరో రాష్ట్రమైతే ఇంత గొప్ప నాయకుడిని భుజాల మీద పెట్టుకొని ఊరేగేది.
ప్రజాస్వామ్య వ్యవస్థ పరిధిలోనే సంక్షేమ పాలన అందించడమంటే ఇందుకు నార్వే, స్వీడన్, డెన్మార్క్ వంటి స్కాండినేవియన్ దేశాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ దేశాల్లో సాధించిన ఫలితాలను తెలంగాణలో కూడా చూడవచ్చు. ఇందుకు ఉదాహరణ నేరాలు తగ్గుముఖం పట్టడం. స్వీడన్, డెన్మార్క్ వంటి దేశాలలో సంక్షేమ పాలన మూలంగా ప్రజలలో సుఖశాంతులు నెలకొని నేరాలు తగ్గుముఖం పట్టాయి. జైళ్లను మూసివేయవలసి వచ్చింది. తెలంగాణలో కూడా ఇదే జరిగింది. తెలంగాణలో నేరాలు తగ్గుముఖం పట్టడమే కాకుండా కారాగారాలు సంస్కరణాలయాలుగా మారాయి. ఖైదీలు లేక పలు జైళ్లను ప్రభుత్వం మూసివేసింది. ఏ సమాజం ఎంత నాగరికమైనదో తెలుసుకోవాలంటే అక్కడి జైళ్లను చూడాలని ప్రఖ్యాత రచయిత దోస్తోవిస్కీ అన్నాడు. తెలంగాణ సమాజ నాగరిక లక్షణం కూడా ఈ జైళ్లను బట్టి అంచనా వేయవచ్చు. దేశవ్యాప్తంగా ఖైదీల మరణాలు పెరుగుతున్నాయి. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో ఖైదీల మరణాలు భారీగా తగ్గిపోయాయి. జైళ్లలో ఖైదీల జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయి. నేరస్థులను సంస్కరించడమనే గొప్ప కార్యక్రమం సాగుతున్నది. ఖైదీలు ఉత్పత్తి కార్యక్రమాలలో పాల్గొనడానికి, లైబ్రరీలో చదువుకోవడానికి ఏర్పాట్లు జరిగాయి. ఖైదీల కుటుంబాలు రోడ్డునపడకుండా వారికి రుణాలు ఇచ్చి నిలదొక్కుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఖైదీలు విడుదలైన తర్వాత మళ్లీ నేరాలు చేయకుండా, గౌరవప్రదమైన రీతిలో బతికే పరిస్థితులను కలిగిస్తున్నది. పల్లెలు, పట్టణాలు సంపదకు, ఉత్పత్తికి కేంద్రాలు కావడం కూడా నేరాలు తగ్గడానికి కారణం. ఖైదీలతో వస్తువులు తయారుచేయించి అమ్మడం ద్వారా ఆదాయం లభిస్తున్నది. దీనివల్ల ఖైదీలకు కూడా సొంత కాళ్ళమీద నిలబడటం అలవాటవుతున్నది. సొంత పెట్రోలు బంకులు పెట్టి జైలు నుంచి విడుదలైన వారికి ఉపాధి కల్పిస్తున్నది. ఇవన్నీ తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా నిలిపాయి. ఇదీ కేసీఆర్ గొప్పతనం.
యూరప్ వంటి సంపన్న దేశాల్లో సంక్షేమ విధానాలు తగ్గిపోయే కొద్దీ సంక్షోభాలు తలెత్తుతున్నాయి. కానీ, లాటిన్ అమెరికా దేశాల్లో కూడా సంక్షేమ విధానాలను అమలుచేయడం మనం గమనించవచ్చు. కానీ, అవి పెట్రోల్ వంటి వనరుల ఆదాయంపై ఆధారపడ్డాయి. కానీ, శాస్త్రీయ పద్ధతిలో ఆర్థికవ్యవస్థను నిర్మించి పారిశ్రామిక విధానాలపై వ్యతిరేక ప్రభావం పడకుండానే సంక్షేమ పాలన సాగించడం కేసీఆర్ గొప్పతనం. నేడు తెలంగాణ ఏమి చేస్తున్నదో రేపు దేశం అదే అనుసరిస్తుంది. సంక్షేమ రాజ్య సంధాత అయిన కేసీఆర్ మార్గదర్శకత్వం కోసం దేశం ఎదురుచూస్తున్నది.
(వ్యాసకర్త: టీ కేసీఆర్ సెంటర్)
-గోసుల మల్లికా యాదవ్