స్వాతంత్య్రానంతరం భారతదేశ రాజకీయ చిత్రాన్ని పరిశీలిస్తే చాలా కొద్దికాలం పాటు బీజేపీ పార్టీ పాలన సాగినా ఎక్కువ భాగం కాంగ్రెస్ పార్టీయే పరిపాలించింది. ఏ పార్టీ పాలించినా, నాయకుడి వల్లనే దేశ ప్రగతి ముందుకెళ్ళడమో, అధోగతి పాలవడమో చూస్తున్నాం. పాలనను ఆ నాయకుడి వ్యక్తిత్వం పూర్తిగా ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. సర్దార్ పటేల్ పట్టుదల వల్ల దేశం మొత్తం ఒక పరిపాలనా కేంద్రంగా ఏర్పడింది. నెహ్రూపై ఆయన కుటుంబ నేపథ్యమే గాక, విదేశీ విద్య ప్రభావం పూర్తిగా ఉండటంతో, మన దేశానికి అనువైన విద్యా విధానాన్ని కాకుండా, మన సంస్కృతికి ప్రజలను పూర్తిగా దూరం చేసే పద్ధతిలో సాగింది భారతీయ విద్య. దానికి తోడు వెయ్యేండ్ల తర్వాత స్వాతంత్య్రం సిద్ధించిన దేశంలో ప్రజలందరికీ కావలసిన ప్రాథమిక విద్య కంటే సాంకేతికత పేరుతో ఐఐటీలు స్థాపించి ధనవంతులు, అగ్రవర్ణాల పిల్లలు అధిక విద్యావంతులవడానికి దోహదపడ్డాడే కానీ, పేద ప్రజలను పట్టించుకోలేదు. ఆ సాంకేతిక నిపుణులు చదువు పూర్తవగానే విదేశాలకు ఎగిరిపోతుంటే దేశం వెనుకబడిపోయింది. ఆ రకంగా నెహ్రూ ‘అమెరికా జాతిపిత’ అయ్యారు.
కొద్దికాలమే ప్రధానమంత్రిగా ఉన్నా లాల్బహదూర్ వ్యక్తిత్వం ఆయన పాలనలో ప్రతిబింబించింది. అలాగే ఇందిరా గాంధీ! ఇక వాజపేయి లాంటి మహోన్నత వ్యక్తిత్వం ఉన్నవాడిని దేశం సరిగ్గా ఉపయోగించుకోలేదు. కానీ ప్రతి చర్యలో ఆయన గొప్పతనం విశదమైంది. నెహ్రూ కుటుంబానికి చెందకపోయినా, పూర్తికాలం అందరినీ సమన్వయపరుస్తూ, మారిన కాలానికి కావలసిన సంస్కరణలు, అది కూడా ఎవరినీ కష్టపెట్టకుండా, దేశానికి ప్రసాదించిన గొప్ప వ్యక్తిత్వం పీవీ నరసింహారావుది. ఆయన విద్యాధికత, విజ్ఞానం, వివేకం, పాలనలో ప్రతిబింబించాయి. మొట్టమొదటిసారి భారతదేశాన్ని ప్రగతిశీల మార్గంలో పెట్టిన ఖ్యాతి పూర్తిగా ఆయనదే! ఆయన తెలంగాణ వారవడం మనందరికీ గర్వకారణం.
ఇక ప్రస్తుత కాలానికి వస్తే, గత ఎనిమిదేండ్లుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీల పాలన సాగింది. ఇలా కేంద్రంతో రాష్ర్టాలను పోల్చడం ఏమిటి అనుకోవచ్చు. కానీ ఈ ఎనిమిదేండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాల్లో ఏ ఒక్కటీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరిగింది కాదు. పైగా అపరిమిత వివక్షతో కేంద్రం ప్రవర్తించినా, సాధించిన విజయాలు అవి! బీజేపీ చరిత్ర చూస్తే ఒకే విధానం కనిపిస్తుంది. ఏ రాష్ట్రంలోనైనా ఒక ప్రాంతీయ పార్టీ ప్రజాభిమానం చూరగొంటుంటే, దాని పొత్తులో చేరి ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలిచి, వారి పాలనను ఆగం జేసి తర్వాత ఎన్నికల్లో తాము గెలవడం, అధికారం చేజిక్కించుకోవటం! పాపం మహారాష్ట్ర బలైపోయింది. కానీ తెలివైన నాయకుడు నితీశ్కుమార్ బీహార్లో సరైన సమయంలో మేల్కొని తన పార్టీని రక్షించుకోగలిగాడు. కొరుకుడుపడని ప్రజ్ఞావంతులైన మమతా బెనర్జీ, కేసీఆర్ వంటివారిని, ఢిల్లీలో ఉన్న కేజ్రీవాల్ను తొక్కడానికి అవినీతి ఆరోపణలు, ఈడీ, సీబీఐ, కొన్ని కోర్టులను ఉపయోగించుకోవడం పరిపాటి అయింది మోదీ సర్కారుకి. ఇది ఆయన వ్యక్తిత్వం మీద చెరగని మచ్చలాగ చరిత్రలో మిగలడం ఖాయం! లక్షలాది మంది వలస కార్మికులు రైలు టికెట్లు కూడా కొనలేని స్థితిలో వేలాది మైళ్ళు నడిచి సొంత ఊళ్ళకు చేరుకున్న కరోనా సమయంలో వారికి ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయని మోదీ.. అదానీకి, అంబానీకి లక్షల కోట్ల మేర ఆదాయం పెరగడంలో తోడ్పడితే అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేదని మెడ మీద తలకాయ ఉన్నవాడెవడైనా నమ్మగలడా? ఈ నేపథ్యంలో.. అంశాలవారీగా కేంద్ర ప్రభుత్వం విధానాలు, తెలంగాణ రాష్ట్రంలోని పాలన పోల్చి చూద్దాం.
దేశానికి వెన్నెముక ఈ రంగం. 140 కోట్ల ప్రజల ఆకలి తీర్చే కృషీవలుడిని బీజేపీ పార్టీ తన నల్ల చట్టాలతో నడ్డి విరవటానికి తయారైంది. తమ పొలాల్లో ఆడుతూ పాడుతూ దేశ ప్రజలకు కావలసిన ఆహారాన్ని పండించే రైతులు.. ఎండలో ఎండి, వానలో తడిసి, చలికి వణుకుతూ సంవత్సరం కంటే ఎక్కువ కాలం రోడ్ల మీద ఉద్యమిస్తూ గడపవలసి వచ్చింది కేవలం మోదీ గారి మూర్ఖత్వం వలన. చివరికి వారి పట్టుదల ముందు మోదీ మూర్ఖత్వం మోకరిల్లవలసి వచ్చింది. ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోగా సబ్సిడీలు తీసివేసి, గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఏడిపించిన కర్కశత్వం మోదీ విధానం.
వ్యవసాయం దండుగ అన్న ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు మాటను అబద్ధం చేస్తూ వ్యవసాయాన్ని తెలంగాణలో పండుగగా మార్చారు కేసీఆర్. తరాల పాటు ఇరుగు పొరుగు రాష్ర్టాలతో ఆంధ్రా నాయకులు పెట్టిన గిల్లి కజ్జాలను సంయమనంతో పరిష్కరించి, కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు సాగునీరు, భగీరథతో అందరికీ తాగునీరు, మిషన్ కాకతీయతో పల్లెలకు చెరువు నీరు అందించిన నాయకుడు కేసీఆర్. రైతుబంధు, రైతు బీమా పథకాలతో వ్యవసాయ పెట్టుబడిని, కష్టకాలంలో సహాయం అందిస్తున్న సున్నిత మనస్కుడాయన. రైతు కష్టం, ఆవశ్యకత తెలిసినవాడు.
పెట్రోలు, డీజిల్ ధరలు రోజువారీగా, నిత్యావసరాల వస్తువులు వారం వారం పెంచుకుంటూ సామాన్య జనాల జీవితం నరకం చేస్తూ అంబానీ, అదానీలకు దేశ సంపద దోచిపెట్టడమే కాకుండా, ప్రజల సొమ్ముతో విదేశీ పర్యటనలు చేస్తూ ఆయా దేశాల కాంట్రాక్టులు కూడా ఈ కుబేరులకు ఇప్పిస్తున్న పక్షపాత ధోరణి మోదీది.
పెరుగుతున్న ధరలను బట్టి వృద్ధుల, వికలాంగుల పింఛన్లు, ఉద్యోగుల జీతాలు పెంచే వితరణ కేసీఆర్ది. దళితుల ఆర్థిక స్థోమత కోసం ఏకంగా పది లక్షల దళితబంధు ఇవ్వగలిగిన దానశీలి ఆయన.
ప్రజలకు సాయం చేసే పథకాలను ఉచితాల పేరుతో ఎద్దేవా చేయటమేగాక, వాటిని రద్దు చేయాలంటున్నారు బీజేపీ నాయకులు. అంటే బ్యాంకు దోపిడీలు చేసే ఘరానా గజదొంగలే అటువంటి పథకాలకు అర్హులన్నమాట! అందుకే వారికి 10 లక్షల కోట్ల రుణమాఫీ చేశాడు కరుణామయుడు మోదీ. నోట్లరద్దు వంటి అసంబద్ధ పథకాలతో సామాన్యుల జీవితాలను నరకప్రాయం చేసి ఉద్యోగాలు, ఉపాధులు ఊడగొట్టిన వ్యక్తి మోదీ.
వయో వృద్ధులకు పింఛన్లు, వికలాంగులకు ధన సాయం, పేద కుటుంబాలలోని ఆడపిల్లల పెళ్ళిళ్ళకు ఆర్థిక సాయం, బడుగు బలహీన కుటుంబాలలోని విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో ఉచిత గురుకుల విద్య, విదేశీ విద్య కోసం ఆర్థిక సాయం వంటి పథకాలతో సామాన్యులను ఆదుకుంటున్న కేసీఆర్ దాతృత్వంతో మోదీకి పోలిక ఉందా? వెయ్యికిపైగా గురుకులాలు స్థాపించి, ప్రతి జిల్లాలో ఎల్కేజీ నుంచి పీజీ దాకా అందరికీ ఉచిత విద్యను అందించాలనే కేసీఆర్ ఆలోచనలకు, చదువు ప్రాధాన్యతే తెలియని మోదీకి పొంతనెక్కడుంది?
ఈ ఎనిమిదేండ్ల కేంద్ర, రాష్ట్ర పాలన బట్టి నరేంద్రమోదీ, చంద్రశేఖర్రావుల వ్యక్తిత్వాలు, పాలనా దిశ, పనితనాన్ని పోల్చుకోవచ్చు. కార్యకర్తగా మొదలై, పైవారి అభిమానంతో అంచెలంచెలుగా స్థాయి పెంచుకున్న వ్యక్తి మోదీ. దానికి స్థిరత్వం, సహనం ఉంటే చాలు. సాఫీగా నదీప్రవాహంలా సాగిన రాజకీయ యాత్ర మోదీది. కేవలం తన ఉన్నతి కోసం సాగిన ప్రయాణం.
ఎన్నికలు గెలిచి, రాజకీయ పదవులు పొంది, తన ప్రాంత ప్రజల కోసం వాటిని తృణప్రాయంగా వదిలేసి, ఉద్యమాన్ని సుదీర్ఘంగా నడిపి రాష్ర్టాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్. 14 ఏండ్ల ఉద్యమకాలంలో జయాపజయాలు, అవమానాలు, అన్యాయాలు అన్నీ సహించి స్థిరచిత్తం, సహనమే కాకుండా, తన ప్రజ్ఞ, మేధస్సు సహాయంతో, పూర్తి అహింసామార్గంలో ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్న నాయకుడు. సునామీ వంటి ఉద్యమంలో ఆటుపోట్ల మధ్య సాగిన రాజకీయయాత్ర కేసీఆర్ది. ప్రజల వెతలు తీర్చడం కోసం తన ప్రాణాలు సైతం పణంగా పెట్టిన త్యాగనిరతి ఆయనది.
ప్రజలను విడదీయటానికి బ్రిటిష్ పాలకులలాగ మతాన్ని ఉపయోగించుకుంటున్నారు మోదీ. నిజమైన సనాతన ధర్మం గురించి తెలిసిన వారెవరూ ఒక వర్గాన్నో, ఒక సమూహాన్నో ద్వేషించరు. చెడు మనుషులను, సమాజానికి హాని చేసే వారిని మాత్రమే శిక్షించాలి. కానీ, ఇక్కడ కూడా వివక్ష చూపించటం అంటే వారు ఏ మతం వారు? వీరికి హిందూ దేవుళ్లలో కూడా ఉత్తర భారతంలోని అయోధ్య రాముడే దేవుడు కానీ, భద్రాద్రి రాముడంటే లెక్కలేదు. ఇదేం మతం? మనుష్యులలో మానవత్వాన్ని కాపాడవలసిన మతాన్ని ఉపయోగించుకొని మతమౌఢ్యాన్ని పెంచి దేశంలో కొట్లాటలు పెంచే ఈ బీజేపీ పార్టీని ఏ మతానికి చెందిందని అనుకోవాలి?
తెలంగాణలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన మతాన్ని ఎంత గౌరవించి పాటిస్తారో, ఇతర మతాలకు అంతే గౌరవం, ప్రాధాన్యం ఇస్తారు. ఇదే కదా సనాతన ధర్మసారం? మానవుల వినాశనానికి దారి తీసే యుద్ధాన్ని ఆపాలని శ్రీకృష్ణుడు ఎంత ప్రయత్నించాడో తెలుసుకుంటే ఈ బీజేపీ వాళ్ళ మాటలు ‘సంగ్రామం, యుద్ధం, ప్రతీకారం’ లాంటివి ఎంత వినాశకారి ప్రయత్నాలో అర్థం అవుతుంది. భగవద్గీతను నిజంగా అర్థం చేసుకున్నారా వీళ్ళల్లో ఒకరైనా? ఈ మత మౌఢ్యాన్ని ఇలాగే విస్తరింపనియ్యాలా?
ఒక మహానుభావుడు అంటాడు: ‘మన మాట మీద మనకే గౌరవం లేకపోతే ఇక ఇతరులు గౌరవిస్తారా, నమ్ముతారా’ అని! ఎన్నికల ముందు సామాన్య జనాలకు విదేశాల నుంచి మన దేశ నల్లధనాన్ని తెస్తాననీ, ఆకాశం మీది తారలని తెంపి బహుమతి ఇస్తాననీ ప్రమాణాలు చేసిన మోదీ పాలనలో వారికి నిజంగానే చుక్కలు కనిపిస్తున్నాయి పట్టపగలే! డీమానిటైజేషన్, ఇతర విధానాల వల్ల, ప్రభుత్వ సంస్థల అమ్మకాల వల్ల నిరుద్యోగం ప్రబలి, ధరలు పెరిగి సామాన్యుల బతుకులు భారమైపోయాయి దేశంలో. దేశంలోని ప్రకృతి వనరులన్నీ కార్పొరేట్ కుబేరుల వశం చేస్తున్నారు. పటేల్ విగ్రహాన్ని 3 వేల కోట్లతో నిర్మించి, దేశంలోని మహిళల భద్రతకు మాత్రం బడ్జెట్లో కేవలం 100 కోట్లు కేటాయించారు. బీజేపీ పార్టీకి సంబంధమున్న వాళ్లు అక్రమాలు, అత్యాచారాలు చేస్తే శిక్ష పడదు. నిన్న మొన్న తెలంగాణలో సింగరేణిని ప్రైవేటుపరం చేసే ఆలోచన గానీ, హక్కు గానీ తమకు లేవని చెప్పిన మోదీ, ఢిల్లీ వెళ్ళగానే దానిని వేలం వేయటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. తన మాట మీద తనకే గౌరవం లేకపోతే ఇక 140 కోట్ల ప్రజలకు గౌరవం, నమ్మకం ఎలా ఉంటాయి?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు కాపాడి, వనరులు పెంచి, వసతులు కల్పించటమే ధ్యేయంగా పని చేస్తున్నారు. ఎన్నికలలో చెప్పినట్లుగా వ్యవసాయ రంగ పరిరక్షణ, ఉచిత కరెంటు, సాగుకు పుష్కలంగా నీళ్ళు, భగీరథ ద్వారా తాగునీరు, చెరువుల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జలాల పెంపు సాధించారు. ఎన్నికలలో చెప్పని కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, దళితబంధు వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటున్నారు. ఏడు దశాబ్దాలపాటు నిర్లక్ష్యానికి గురైన గిరిజన తండాలన్నీ గ్రామపంచాయతీలయ్యాయి. ప్రకృతి రక్షణకు హరితహారం, మహిళల రక్షణకు షీటీమ్స్ రూపొందించారు.
మానవీయ కోణం మరిచిన పాలన నియం త పాలన అవుతుంది. గుజరాత్లో మోర్బీ వంతెన కూలితే అక్కడికి వెళ్లిన మోదీ పర్యటనకు, ప్రచారానికి పెట్టిన ఖర్చు 30 కోట్లు. కానీ, ఆ దారుణ దుర్ఘటనలో 55 మంది పిల్లలతో సహా చనిపోయిన 142 మంది కుటుంబాలకు ఇచ్చిన మొత్తం పరిహారం రూ.5 కోట్లే. ఇక కేవలం తన మంకుతనం, మూర్ఖత్వం వల్ల జరిగిన రైతు ఉద్యమం సమయంలో చనిపోయిన 700 మంది రైతుల గురించిన పట్టింపే లేదు ప్రధానమంత్రికి. ఖర్చు లేని క్షమాపణ చెప్పేశారు. ఈ రోజు దాకా ఆ నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్న దాఖలాలు లేవు.
ఏండ్ల తరబడి తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగభద్రత, భారీ ఎత్తున జీతాల సవరణ, కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ప్రభుత్వ అండదండలు కల్పించడమే కాకుండా, ఇతర రాష్ర్టాలలో వరదల్లాంటివి వచ్చినప్పుడు సహాయ సహకారాలను సీఎం కేసీఆర్ అందించారు. తెలంగాణ కళాకారులకు, క్రీడలలో బహుమతులు గెల్చుకున్నవారికి తగిన రివార్డులు ఇచ్చారు. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్లకు, ఉద్యమంలో అసువులు బాసిన రైతులకు ఇతర రాష్ర్టాలకు వెళ్లి మరీ ఆర్థిక సాయం అందించారు కేసీఆర్. ఆయన గొప్ప మానవీయ స్వభావం కలిగిన రాజకీయ నాయకుడు. మనుషుల బాగు కోసం ఆలోచిస్తారు, మేధకి పదును పెడతారు, పథకాలు రచిస్తారు, వాటిని అమలు పరుస్తారు. ప్రధానమంత్రి తెలంగాణకు ఇవ్వవలసిన నిధులను ఆపినా సరే, ఏ పథకాలనూ కేసీఆర్ ఆపలేదు.
తన రాజకీయ గురువైన అద్వానీని తాను ప్రధానమంత్రి అవగానే పక్కన పెట్టాడు మోదీ. గుజరాత్ హింసాకాండ తర్వాత సీఎం పదవి నుంచి మోదీని తప్పించాలని నాటి ప్రధాని వాజపేయి భావించినప్పటికీ, అద్వానీ అడ్డుకున్నారు. ఆయన పట్ల మోదీ చూపించిన ‘కృతజ్ఞత’ ఏమిటంటే, బీజేపీలో అద్వానీ పేరు కూడా వినిపించకుండా చేయటం. ఇంతకు మించిన కృతఘ్నత ఉంటుందా?
ఉద్యమకాలంలో తనకు సలహాలిచ్చి అండగా నిలబడిన జయశంకర్ సార్ పేరు మీద ఒక జిల్లా, ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేశారు కేసీఆర్. మోదీకి, కేసీఆర్కు మధ్య ఉన్న వ్యత్యాసం ఇదీ. మరి బీఆర్ఎస్ కావాలో, బీజేపీ కావాలో విజ్ఞులైన ప్రజలే నిర్ణయించుకోవాలి. భగవంతుడు వారికి ఆ విచక్షణ ప్రసాదించాలని కోరుకుందాం!
-కనకదుర్గ దంటు
89772 43484