CM KCR | ప్రణాళికాబద్ధ రాజకీయాలకు పెట్టింది పేరు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ఉద్యమాన్ని, ఆటుపోట్లను బాగా ఔపోసన పట్టిన తర్వాతనే.. దాన్ని సాధించేందుకు ఎంచుకున్న మార్గంలో ఓ సక్సెస్ ఫార్ములాను ఆయన అనుసరించారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను ఇక్కట్లను ఎలా అధిగమించాలో కూడా ఆయన తన రోడ్మ్యాప్లో నిర్దేశించుకున్నారు. రాకెట్ ప్రయోగంలో ఎలాంటి ప్రణాళిక ఉంటుందో తెలంగాణ సాధనలోనూ.. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు లోనూ..పథకాలను అమలు చేయడంలోనూ.. అంతకు మించిన ప్రణాళిక దాగి ఉన్నది. అందుకే ఆయన రాజకీయ జీవితం అప్రతిహతంగా కొనసాగుతున్నది.
గుడ్డెద్దు జొన్నచేలో పడ్డట్టుగా కేసీఆర్ రాజకీయాలు చేయరని ఆయన సక్సెస్ను గమనించినవారు చెప్తారు. గత ఎన్నికల్లో విజయం సాధించడంలోనూ.. ఎన్నికలను ముం దుకు జరిపి ముందస్తుకు వెళ్లడంలోనూ అనూహ్యమైన ప్రణాళిక ఉన్నది. ప్రజలనాడి పట్టకుండా రాజకీయాలు చేసేవారు ఫెయిలవుతారు. ఇది బాగా ఎరిగిన వారు సక్సెస్ అవుతారు. అందుకే రాజకీయాల్లో కేసీఆర్ సాధించిన విజయాలు మరే పార్టీ లేదా నేత సాధించలేకపోతున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని తలకెత్తుకునే ముందు కేసీఆర్ ఎంతగానో మేధోమథనం చేశారు. తను ఎంచుకున్న మార్గంలో ముళ్లు, రాళ్లు, ఎగుడుదిగుడులు ఉంటాయని తెలిసినా, వాటిని ఎలా తొలగించుకుంటూ ముందుకు సాగాలో కూడా ప్రణాళిక మేరకు ముందుకు సాగారు. ఆయనను దగ్గరగా చూసిన వారికి ఆయన రచిస్తున్న వ్యూహాలు తెలుసు. నెలల తరబడి నిద్రాహారాలు కూడా మానేసి ఆయన ఓ రోడ్మ్యాప్ గీసుకుని ముందుకు నడిచారు. ఆషామాషీగా ఆయన రంగంలోకి దిగలేదు… దిగిన తర్వాత వెనుదిరిగి చూడలేదు. అదే ఆయన విజయ రహస్యం.
తెలంగాణ ఉద్యమం సాధించిన విజయంతో ప్రభుత్వాన్ని కూడా తను ఏర్పాటు చేస్తేనే సాధించుకున్న తెలంగాణ ఆకాంక్షలు సాకారమవుతాయని భావించారు. ఎంతోమంది విద్యార్థి నాయకులకు, ఉద్యమకారులకు ఎంపీ, ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్కే దక్కింది. ఉద్యమకారులను పట్టించుకోవడం లేదనే విమర్శలదేముంది చాలా చేస్తారు. కానీ, ప్రజలకు తెలుసు. అందుకే ఆయన వెంట ప్రజలు కూడా నమ్మకంగా నడిచారు. ప్రజల నాడిని పట్టి. .వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగడం.. రాజకీయాలో ఎత్తులు, పై ఎత్తులు వేయడం కేసీఆర్కు మాత్రమే తెలిసిన విద్య.
జాతీయ పార్టీలో ఆయన ఉండి ఉంటే ఈ పాటికి వేరుగా ఉండేది. కేసీఆర్కు దేశం మీద అవగాహన ఉన్నది. నదుల మీదా.. వాటి నడక మీదా అవగాహన ఉన్నది. అన్నింటికి మించి ప్రజల జీవనవిధానంపై లోతైన అవగాహన ఉన్నది. ప్రపంచ గమనం పైనా అవగాహన ఉన్నది. ప్రపంచ రాజకీయాలతో పాటు, దేశ రాజకీయాలను బాగా ఔపోసన పట్టిన వ్యక్తి. దేశం లో మోదీతో పోల్చుకుంటే కేసీఆర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయగల సత్తా ఉన్న నేత. దేశంలో ఉన్న వనరులు, వాటిని ఉపయోగించుకునే తీరు కూడా బాగా తెలిసినవాడు. తెలంగాణలో 24 గంటల నిరంతర విద్యుత్తును ఇవ్వగలగటంలోనే ఆయన దార్శనికతను అర్థం చేసుకోవచ్చు. నిరంతర విద్యుత్తు ఉంటే చిన్నా, పెద్దా పరిశ్రమల ఉత్పత్తి రంగం దెబ్బతినదని కూడా బాగా తెలుసు. అందుకే నిరంతర విద్యుత్తును సాకారం చేశారు. నిజానికి దేశవ్యాప్తంగా నిరంతర విద్యుత్తు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో ఇప్పుడు ఆలోచన చేయాలి.
దేశంలో పారుతున్న నదులను కూడా ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి కేసీఆర్. అందుకు గోదావరి జలాలను ఎదురెక్కించి రిజర్వాయర్లను కట్టించిన తీరు ఆయన ముందుచూపుకు నిదర్శనం. కాళేశ్వరంతో మొదలు పెట్టి.. కొండపోచమ్మసాగర్ వరకు నీటి రాకను చూస్తే అద్భుతం అని అనని వారుండరు. ఒక రాష్ర్టాన్ని ఎలా అభివృద్ధి చేయవచ్చన్నది కేవలం ఈ తొమ్మిదేండ్లలో చేసి చూపా రు. కాళేశ్వరంతో పాటు అనేక ప్రాజెక్టులను కట్టడం, చెరువులను పునరుద్ధరించి గొలుసుకట్టు చెరువులకు ప్రాణం పోయ డం, మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీరు సరఫరా చేయ డం చేశారు. హరితహారంతో పచ్చదనాన్ని పెంచి మొక్కల పెంపకం ప్రాధాన్యం తెలిపారు. జిల్లాల విభజనతో పాలనను ప్రజలకు చేరువ చేశారు. అన్నింటికి మించి యాదాద్రి ఆలయాన్ని నభూతో నభవిష్యతి అన్న రీతిలో పునరుద్ధరించి.. కాకతీయ కళావైభవాన్ని కండ్లకు కట్టారు. ఇవన్నీకూడా విప్లవాత్మక నిర్ణయాలే.
ఇదే తరహాలో దేశ పగ్గాలు అందుకుంటే ఖచ్చితంగా ఓ నాలుగైదేండ్లలో గణనీయమైన మార్పులు చూపి.. ప్రజలకు ఆదర్శనేతగా నిలిచే సత్తా కేసీఆర్కు మాత్రమే ఉందనడంలో సందేహం లేదు. నిజానికి కేసీఆర్ ఏదేనీ జాతీయ పార్టీలో ఉండి ఉంటే మోదీకి అవకాశం వచ్చేది కాదు. మోదీకి లేని విజన్ కేసీఆర్కు ఉందనడంలోనూ సందేహం లేదు. మోదీది ప్రచార పటాటోపం తప్ప మరోటి కాదు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో నేటికీ మోదీ పెద్దగా విజయం సాధించలేదు. ప్రజల నాడిని పట్టిన నేతగానే కేసీఆర్ దేశం ముందు నిలిచారు.
తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరిని ఎలా వాడుకోవాలో అన్న ప్రణాళికతోనే కార్యక్షేత్రంలోకి దిగారు. అసాధ్యం అన్న తెలంగాణను సుసాధ్యం చేసి చూపారు. జాతీయస్థాయిలో ఏయే రాజకీయ పార్టీలతో స్నేహం చేయాలో చేశారు. ఎవరెవరిని మచ్చిక చేసుకోవాలో చేసుకున్నారు. ఇలా తెలంగాణను సాకారం చేయడంతో పాటు, పాలనలో తనదైన ముద్ర వేయగలిగారు. రాజకీయ పార్టీల హడావుడి, విమర్శలు తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇంతకుమించి చేయగలిగిన నేత ఇతర పార్టీల్లో లేరు. అంతెందుకు తెలంగాణలో కేసీఆర్ను మించిన విజనరీ నేత లేడనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందుకే నూరు కాదు.. నూటా ఐదు సీట్లు గెలుస్తామన్న ధీమాలో కేసీఆర్ ఉన్నారు. ఈ ధీమా వెనక కూడా బృహత్తర ప్రణాళిక దాగి ఉంటుంది. అదే సాకారం అవుతుందని మరోమారు మనం గమనించక తప్పదు.
– రాంపల్లి మహాలక్ష్మి70139 01466