ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా ఉన్న నేతన్నల బతుకులు మారుతాయి. కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటుచేసి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు గెలిచి ప్రధాని కావాలని కోరుకునేవారిలో పద్మశాలి బిడ్డగా నేను మొదటి వ్యక్తిని. ఎందుకంటే 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటినుంచి ఉద్యమ సమయంలో నేతకార్మికుల గోసను, వారి ఆత్మహత్యలను చూసి చలించిన వ్యక్తి కేసీఆర్.
14 ఏండ్ల ఉద్యమం తర్వాత తెలంగాణను సాధించుకున్నాం. ఉద్యమనేత కేసీఆర్ సీఎం అయిన నాటినుంచి నేత కార్మికుల కుటుంబాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. 51 ఏండ్లు దాటిన నేత కార్మికులకు నెలకు రూ.2016 పింఛన్లు ఇస్తున్నారు. 18-60 ఏండ్ల వయసులోపు నేతన్నలకు రూ.5లక్షల ‘నేతన్నకు బీమా’ పథకం, నేతన్నకు త్రిప్ట్ (పొదుపు పథకం) అమలు చేస్తున్నారు. నూలు సబ్సిడీ, మరమగ్గాల ఆధునికీకరణ పథకం, రూ.లక్షలోపు రుణమాఫీ వర్తింపజేస్తున్నారు. చేనేత రంగానికి ప్రత్యేక బడ్జెట్ (బీసీ వెల్ఫేర్ నుంచి) రూ.1200 కోట్లు కేటాయించారు. చేనేత, జౌళిశాఖ రెగ్యులర్ బడ్జెట్కు ఇది అదనం. బలహీనవర్గాల సంక్షేమ బడ్జెట్ కింద ప్రత్యేక బడ్జెట్ రూపంలో రూ.400 కోట్లు కూడా కేటాయించారు. చేనేత మిత్ర పథకం కింద చేనేత కార్మికులకు కాటన్, ఉన్ని, నూలు, సిల్, రంగుల కొనుగోలుపై 40 శాతం రాయితీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఇది కేం ద్రం ఇచ్చే 10 శాతం రాయితీకి అదనం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 20,501 మంది చేనేత కార్మికులు రూ.24.09 కోట్ల మేర సబ్సి డీ పొందారు. నూలు కొనుగోలుకు పావలా వడ్డీ రుణ పథకం అమలుచేస్తున్నారు.
ప్రభుత్వం ద్వారా చేనేత వస్ర్తాల ప్రదర్శన ఏర్పాటు చేయించి మార్కెటింగ్ అవకాశాలు కల్పించారు. గద్వాలలో శిక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, మార్కెట్ ఇన్సెంటివ్స్, హ్యాండ్లూం పార్కులను ఏర్పాటుచేశారు. సిరిసిల్లలో టెక్స్టైల్ పార్క్, వరంగల్లో మినీ టెక్స్టైల్ పార్క్, సిరిసిల్లలో అప్పారెల్ పార్క్నూ ఏర్పాటుచేశారు. మరమగ్గాల సేవా కేంద్రం, వర్క్ టూ ఓనర్ పథకం, మరమగ్గాలకు వినియోగించే విద్యుత్పై 50 శాతం సబ్సిడీ అందజేస్తున్నారు. టెసో ద్వారా ఆర్అండ్ డీ విభాగాన్ని ఏర్పాటుచేసి నూతన డిజైన్లు, వస్త్రోత్పత్తి గురించి పరిశోధనలకు ఊతం ఇస్తూ, పురాతన కళాకృతులకు మళ్లీ జీవం పోస్తున్నారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ ఒక కోటి ఇరవై లక్షల జాతీయ జెండాలను నేత కార్మికులతో తయారుచేయించి వారికి ఉపాధి కల్పించి ఇటు దేశభక్తిని, అటు మానవీయత ను చాటుకున్నారు.
రాష్ట్రంలో 49,112 మరమగ్గాలు, 17,069 చేనేత మగ్గాలున్నాయి. 4వ అఖిల భారత చేనేత గణన 2019-20 ప్రకారం రాష్ట్రంలో 25,930 మంది చేనేత కార్మికులు, 21,922 అనుబంధ కార్మికులు ఉపాధి పొం దుతున్నారు. చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్ చేనేతరంగ అభివృద్ధికి అనేక సంస్కరణ లు తీసుకువస్తున్నారు.
దేశవ్యాప్తంగా 23.77 లక్షల చేనేత మగ్గాలున్నాయి. దాదాపు 50 లక్షల మరమగ్గాలున్నాయి. టెక్స్టైల్ రంగం ద్వారా దాదాపు 4.5 కోట్ల మంది ఉపాధి పొందుతున్నరు. దేశంలో వ్యవసాయరంగం తర్వాత ఎకువ మంది ఉపాధి పొందుతున్న రంగం టెక్స్టైల్ రంగమే. ప్రపంచవ్యాప్తంగా భారతీయ చేనేతకు మంచి గుర్తింపు ఉన్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల భారతీయ చేనేతరంగం మూత పడే పరిస్థితి నెలకొన్నది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చేనేత వస్త్రాలపై ఎలాంటి పన్నుల్లేవు. కానీ మోదీ ప్రభుత్వం వచ్చాక కేంద్రం పలురకాల వస్ర్తాల మీద 5-18 శాతం జీఎస్టీని విధిస్తున్నది. అది కూడా ముడిసరుకులైన నూలు, రంగులపైన ఒకసారి, ఇవే ముడిసరుకులతో తయారైన వస్ర్తా లపైన మరోసారి విధిస్తున్నది. జీఎస్టీని రెండు సార్లు విధించడం వల్ల చేనేత వస్ర్తాలు ఖరీదవుతున్నాయి. ధర పెరగడంతో వినియోగదారులు కొనడానికి ముందుకు రావడం లేదు.
ఒక సర్వే ప్రకారం చేనేతపై జీఎస్టీ విధించిన తర్వాత చేనేత వస్ర్తాల అమ్మకాలు తగ్గి మగ్గాలు మూతపడ్డాయని, తద్వారా నేత కార్మికులు ఉపాధి కోల్పోయారని తేలింది. ఇది చేనేత కార్మికులను తిరిగి ఆత్మహత్యలకు పురిగొల్పేలా ఉన్నది. ఇలాంటి కేంద్ర ప్రభు త్వ విధానాలకు స్వస్తి పలకాలంటే జాతీయ స్థాయిలో కేసీఆర్ లాంటి నాయకుడు రావా లి. తెలంగాణలో నేత కార్మికులు సుఖసంతోషాలతో, ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితే దేశవ్యాప్తంగా 4.5 కోట్ల నేత కార్మికుల కుటుంబాల్లో ఉండాలంటే ఇక్కడి పథకాలు దేశవ్యాప్తంగా విస్తరించాలి. అది కేసీఆర్తోనే సాధ్యం. జాతీయపార్టీని ఏర్పాటుచేయాలన్న కేసీఆర్ నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా.
– బొద్దుల లక్ష్మణ్
(వ్యాసకర్త: రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు, జూలపల్లి జడ్పీటీసీ)