కాకతీయ రాజుల్లో గణపతిదేవుడి తర్వాత కుతుబ్షాహీ కాలంలో కొంత కాలం మాత్రమే ఆంధ్ర ప్రాంతాలు ఏకఛత్రాధిపత్యం కింద ఉన్నాయి. ఆంధ్రభాషను మాట్లాడే ప్రజలందరినీ ఏకఛత్రం కిందకు తెచ్చిన మొదటి వారు కాకతీయులే. ఈ కాలంలోనే ఓరుగల్లుకు ఆంధ్రనగరి అని పేరు వచ్చింది.
కాకతీయులు ఆంధ్రప్రాంతాలను పాలిస్తూ ఆంధ్రాభిమానం కలిగి ఉన్నవారు సంస్కృత భాషను అభిమానించి, సంస్కృత భాషలో శాసనాలను వేయించారు. అప్పటికి ఉత్తరభారతం తురుష్కుల చేత ఆక్రమించబడింది. సంస్కృత సాహిత్యాన్ని ఆదరించేవారు కరువైనారు. అప్పుడు సంస్కృత భాష దక్షిణ దేశానికి వలస వచ్చింది. ఎందరో సంస్కృత కవి పండితులు దక్షిణ దేశ రాజులను ఆశ్రయించారు. అట్లా ఆదరించిన ప్రభువుల్లో కాకతీయులు అగ్రభాగాన కలరు. అగస్త్యుడు అనే గొప్ప సంస్కృత పం డితుడు ఓరుగల్లు అనే నగరం బయట పెద్ద ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. అతని వద్ద ఎంతో మంది సంస్కృత విద్యార్థులు విద్యలను అభ్యసించేవారు.
అగస్త్యుడు స్వయంగా 74 సంస్కృత గ్రంథాలు రచించాడు. అతని కొడుకు నరసింహరుషి ‘సిద్దోద్వాహము’ అనే సంస్కృత లఘు కావ్యాన్ని ఓరుగల్లు గుట్టపై, శిలలపై లిఖింపచేశాడు. 1968లో ఇది పుస్తకంగా వచ్చింది. అగస్త్యుని మేనల్లుడు విశ్వనాథుడు గొప్ప పండితుడు. విద్యానాథుడు అనే మరో పండితుడు ‘ప్రతాపరుద్ర యశోభూషణ’ అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథంలో ఉదాహరణలుగా ప్రతాపరుద్రుని శౌర్యపరాక్రమాలను వర్ణించే పద్యాలు ఉన్నాయి. మొట్టమొదటి సారిగా లక్షణ గ్రంథాల్లో కృతి భర్త రాజును గూర్చి ఉదాహరణ శ్లోకాలుండటం ఇదే మొదలు. మొదటి రుద్రదేవుడు సంస్కృతంలో ‘నీతిశాస్త్ర ముక్తావళి’అనే గ్రంథాన్ని రచించాడు. రెండో ప్రతాపరుద్రుడు కూడా కవి. అతడు రుద్రదేవుడు అనే పేరుతో ‘యయాతి చరిత్ర’ అనే సంస్కృత నాటకాన్ని రచించాడు. ఇది ప్రసిద్ధ నాటకం. తెలుగులో భాస్కర కవి రచించిన రామాయణంలో కొన్ని భాగాలు రుద్రదేవుడు రచించాడు. ప్రతాపరుద్రుడే రుద్రదేవుడనే పేరుతో రచించాడని అంటారు. ఓరుగల్లుకు చెందిన గంగాదేవి బుక్కరాయల కుమారుడు కంపరాయలను వివాహం చేసుకొని అతడు మధురానగరాన్ని జయించిన ఇతివృత్తాన్ని తీసుకొని ‘మధురా విజయం’ అనే కావ్యాన్ని రచించింది. ఆమె అగస్త్యుని మేనల్లుడు విశ్వనాథుడు తనకు విద్యాగురువని పేర్కొన్నది. సంస్కృతంలో మహాకావ్యాన్ని రచించిన మొట్టమొదటి కవయిత్రి గంగాదేవి. ఈ కావ్యం క్రీ.శ. 1371-74 మధ్య (మధురా) విజయం రాయబడింది. ఆ తర్వాత రఘునాథ రాయల ఆస్థానంలో కవయిత్రులు సంస్కృత కావ్యాలు రాశారు.
మొత్తం సంస్కృత సాహిత్యంలోనే కావ్యరచన చేసిన మొట్టమొదటి కవయిత్రి ఓరుగల్లు వాసియైన గంగాదేవియే. గణపతిదేవుడి దగ్గర గురువుగా ఉన్న శివదేవయ్య ‘పురుషార్థసారము’, ‘నీతిసారము’, ‘శివదేవధీమణి’ అనే సంస్కృత గ్రంథాలను రచించాడు. తిక్కన సోమయాజి గణపతిదేవుడి ఆస్థానానికి వచ్చినప్పుడు శివదేవయ్యను చూసి.. ‘ఈతడీశ్వరుడు గాని మనుజమాత్రుడు గాదు’ అని ప్రస్తుతించాడు.
ఈ విధంగా ఎంతో సంస్కృత సాహిత్యం కాకతీయుల కాలంలో సృష్టించబడింది. స్వయంగా రాజులే సంస్కృత గ్రంథాలు రచించారు. ఈ విధంగా తెలంగాణ నేల మీద కవయిత్రి రచించిన మహాకావ్యం రావడము, అనేకమంది సంస్కృత పండితులు కావ్యాలు, శాస్త్రగ్రంథాలు రచించటం తెలంగాణ గడ్డకే గర్వకారణం.
మొట్టమొదటి సారిగా లక్షణ గ్రంథాల్లో కృతి భర్త రాజును గూర్చి ఉదాహరణ శ్లోకాలుండటం ఇదే మొదలు. మొదటి రుద్రదేవుడు సంస్కృతంలో ‘నీతిశాస్త్ర ముక్తావళి’అనే గ్రంథాన్ని రచించాడు. రెండో ప్రతాపరుద్రుడు కూడా కవి. అతడు రుద్రదేవుడు అనే పేరుతో ‘యయాతి చరిత్ర’ అనే సంస్కృత నాటకాన్ని రచించాడు.
ముదిగంటి సుజాతారెడ్డి, 99634 31606
ఇవి కూడా చదవండి :
కొన్నది వంకాయ.. కొసిరేది గుమ్మడికాయ