ప్రజా సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం అట్టడుగు స్థాయిలో సేవలందించే అంగన్వాడీ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. పేద-ధనిక, కులము-తలము వంటి అంతరాల్లేని అద్భుత కేంద్రాలు, అమృత హస్తాలు అంగన్వాడీలు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లోని పసిపిల్లలు మొదలు గర్భిణులు, బాలింతల వరకు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 35,700 అంగన్వాడీ కేంద్రాల ద్వారా వారికి సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందిస్తుండటం అభినందనీయం. తల్లీబిడ్డలు, గర్భిణులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే సదుద్దేశంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం 2015 జనవరి 1న ‘ఆరోగ్యలక్ష్మి’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇది ప్రభుత్వ మానవతా దృక్పథానికి నిదర్శనం.
ప్రభుత్వానికి సామాన్య ప్రజలకు మధ్య సేవల కూర్పరిగా ఉన్న అంగన్వాడీల డిమాండ్ల పట్ల సానుకూలంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం వారిని అక్కున చేర్చుకోవడం ముదావహం. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న డిమాండ్లన్నీ నెరవేరుస్తామని హామీ ఇవ్వడం విశేషం. అందులో భాగంగానే 3,989 మినీ అంగన్వాడీలను ఉన్నతీకరిస్తూ జీవో విడుదల చేసింది. ఈ కొత్త జీవోతో ప్రభుత్వంపై రూ.115 కోట్ల అదనపు భారం పడనున్నది. అయినా వెనక్కి తగ్గని రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై పని భారం, ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యేక యాప్ను రూపొందిస్తామని ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామం. అంతేకాదు, అంగన్వాడీల ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏండ్లకు పెంచడమే కాకుండా, ఆ తర్వాత ఆసరా పింఛన్ మంజూరు చేస్తామని, యాభై ఏండ్ల లోపు వారికి రూ.2 లక్షల ప్రమాద బీమా, వయస్సు మీరిన వారికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా, ఉద్యోగ విరమణ వేళ టీచర్లకు లక్ష రూపాయలు, హెల్పర్లకు రూ.50 వేలు అందిస్తామని ప్రకటించడం అంగన్వాడీ టీచర్లు, సహాయకుల మీద ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు అంగన్వాడీల్లో 90 శాతం వాటా కేంద్రానిది కాగా, 10 శాతం వాటా రాష్ర్టాలది. కానీ, కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువు దీరగానే అంగన్వాడీలపై కన్నెర్ర జేసింది. కేంద్రం వాటాను 60 శాతానికి తగ్గిస్తూ, రాష్ర్టాల వాటాను 40 శాతానికి పెంచింది. అయినా మడమ తిప్పని తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్వాడీ టీచర్లకు, సహాయకులకు రూ.7,800 చెల్లిస్తున్నది. కాగా, బీజేపీ పాలనలో ఉన్న అసోంలో అంగన్వాడీ టీచర్లకు రూ.6 వేలు, హెల్పర్లకు 2,500 అందజేస్తుండటం గమనార్హం. అందుకేనేమో గత ఫిబ్రవరిలో యూనిసెఫ్ అంతర్జాతీయ సంస్థ ప్రతినిధుల బృందం తెలంగాణను సందర్శించిన అనంతరం ‘తెలంగాణ అంగన్వాడీలు దేశానికి ఆదర్శమని’ కొనియాడింది. ఈ ప్రశంస అంగన్వాడీ వ్యవస్థకో, రాష్ట్ర ప్రభుత్వానికో కాదు, యావత్ తెలంగాణ జాతికే గర్వ కారణం.